అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు

alluri

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజావ్యతిరేక విధానాలను చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హెచ్చరించారు. ఢిల్లీలో నిర్వహించిన అఖిలభారత రైతు సదస్సులో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ.. రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం మూడు సాగు చట్టాలను తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. రైతుల ప్రయోజనాలను పాతరపెట్టే ఈ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 25న ‘భారత్ బంద్’ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ బంద్‌కు విద్యార్థి, యువజన, గిరిజన, కార్మిక సంఘాలు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ బంద్‌ని సంపూర్ణంగా నిర్వహిస్తామన్నారు. రైతుల విషయంలో మోదీ మొండిగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న విశాఖపట్టణం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనుకోవడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొట్టడమేనన్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు వారసులుగా తెలుగుజాతి దీనిని చూస్తూ సహించబోదని హెచ్చరించారు. ఏపీలో రైతు ఉద్యమాన్ని ఉద్దేశించి దేశంలో చారిత్రాత్మక పోరాటం సాగుతున్నా మోదీ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దారుణమని వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.

Share: