టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ ఏదో ఒక విధమైన రికార్డులు ఉన్నాయి. అలా మహేశ్ బాబుకు ఎవరికీ లేని ఓ అరుదైన రికార్డు ఉంది. అదేమిటంటే, ఒకే థియేటర్ లో వరుసగా విడుదలైన మహేశ్ బాబు నాలుగు చిత్రాలు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం. అదీ నాలుగు ఆటలతో ప్రదర్శితం కావడం విశేషం. ఆ అరుదైన రికార్డును మహేశ్ బాబు సొంతం చేసిన చిత్రాలు ఏవంటే – ‘మురారి’, ‘ఒక్కడు’, ‘అతడు’, ‘పోకిరి’. ఆ రికార్డుకు కేంద్రంగా మారింది హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎమ్.ఎమ్. థియేటర్. ఈ రికార్డు అంతకు ముందు కానీ, ఆ తరువాత కానీ ఏ తెలుగు హీరోకు లేదు. అంతటి రికార్డును మహేశ్ పరం చేయడానికి శ్రీకారం చుట్టిన చిత్రం ‘మురారి’. ఈ సినిమా మొన్న ఫిబ్రవరి 17తో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇంతటి చరిత్రకు నాంది పలికిన ‘మురారి’ని మననం చేసుకోవడం ఘట్టమనేని అభిమానులకు మరింత ఆనందం కలిగిస్తోంది.
‘మురారి’కి తొలి నుంచీ క్రేజ్!
జనం మదిలో ‘ప్రిన్స్’గా నిలచిన మహేశ్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో సోలో హీరోగా అరంగేట్రం చేసినప్పుడు తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటాడని పలువురు జోస్యం చెప్పారు. ‘రాజకుమారుడు’ చిత్రం అప్పట్లో 25 పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసి ఘట్టమనేని అభిమానులను ఆనందసాగరంలో మునకలేయించింది. ఆ తరువాత వచ్చిన రెండు చిత్రాలు మహేశ్ ఫ్యాన్స్ కు అంతగా కిక్ ఇవ్వలేకపోయాయి. అయితే మహేశ్ బాబుతో కృష్ణవంశీ దర్శకత్వంలో నందిగం రామలింగేశ్వరరావు ‘మురారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలియగానే అభిమానులకు నూతనోత్సాహం కలిగింది. ఎందుకంటే నందిగం రామలింగేశ్వరరావు హీరో కృష్ణకు వీరాభిమాని, ఆయన ఖర్చుకు వెనుకాడకుండా తన అభిమాన కథానాయకునితో “కంచుకాగడా, కిరాయి కోటిగాడు” వంటి చిత్రాలు నిర్మించారు. పైగా మహేశ్ బాబు హీరోగా అడుగు పెట్టింది మొదలు, ఆయనతో ఓ మరపురాని చిత్రం తీస్తాననీ నందిగం చెబుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో ‘మురారి’కి ఆరంభం నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.
విభేదాలతోనే విజయం
‘మురారి’ సినిమా షూటింగ్ మొదలయిన కొద్ది రోజులకే నిర్మాత నందిగం రామలింగేశ్వరరావుకు, దర్శకుడు కృష్ణవంశీకి మధ్య విభేదాలు తలెత్తాయి. మహేశ్ బాబు చొరవతో అవి సద్దుమణిగినా, మాటంటే ఎంతో పట్టింపు ఉన్న రామలింగేశ్వరరావు షూటింగ్ కు కావలసిన మొత్తం ఏర్పాటు చేసేవారే కానీ, ఏ నాడూ నిర్మాణం ఎలా సాగుతుందనీ జోక్యం చేసుకోలేదు. అప్పట్లో కృష్ణవంశీకి విపరీతమైన క్రేజ్ ఉండేది. దాంతో మహేశ్ కూడా అతనికే మద్దతు పలికినట్టు చెబుతారు. నిజానికి మహేశ్ లాంటి మాస్ హీరో లభిస్తే, ఏ డైరెక్టర్ అయినా కమర్షియల్ ఫార్ములాతోనే చిత్రాన్ని తెరకెక్కిస్తాడు. అయితే కృష్ణవంశీ అందుకు భిన్నంగా వైవిధ్యం కోసం పట్టు పట్టారు. ఈ చిత్రకథనే వరైటీఆ సాగుతుంది. ఓ జమీందార్, బ్రిటిష్ వారి ప్రోద్బలంతో అమ్మవారి విగ్రహం దొంగిలిస్లాడు. అమ్మవారి ఆగ్రహానికి బలియైపోతాడు. ఆ తరువాత ప్రతి 48 ఏళ్లకు ఒకసారి అమ్మవారు ఆ జమీందార్ వంశస్థుల్లో ఒకరిని బలి తీసుకుంటుందనే నమ్మకం ఏర్పడుతుంది. అలా హీరోకు మరణగండం ఉందని తెలుస్తుంది. రక్తప్రోక్షణతో ఆ గండం నుండి గట్టెక్కవచ్చునని జోస్యులు చెబుతారు. హీరో నాన్నమ్మ బలిదానంతో అతను ప్రాణాపాయం నుండి గట్టెక్కుతాడు. ఈ సినిమా విడుదలయిన రోజున చిత్రం చూసి అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఇందులోని పాటలు మాత్రం వారిని భలేగా ఆకట్టుకున్నాయి. అయినా వారు కోరుకున్న రీతిలో క్లయిమాక్స్ లో హీరో విలన్లను చితకబాదే సీన్స్ ఇందులో కనిపించక పోవడంతో నిరుత్సాహ పడ్డారు. దాంతో డివైడ్ టాక్ వచ్చింది. పైగా ఈ సినిమా నిడివి బాగా ఉండడంతో పలు కేంద్రాలలో సినిమా ఆపరేటర్లే ఎడిటర్స్ గా మారి, పలు సన్నివేశాలకు కత్తెర వేశారు. అలా రెండు వారాలు సాగిన తరువాత ‘మురారి’లోని వైవిధ్యం జనాన్ని భలేగా ఆకట్టుకోవడం మొదలు పెట్టింది. అలా ఆరంభంలో విభేదాలు, ఆ తరువాత డివైడ్ టాక్ వచ్చినా కూడా ‘మురారి’ విజయం సాదించడం విశేషమనే చెప్పాలి.
మహేశ్ ఫస్ట్ సిల్వర్ జూబ్లీ!
మహేశ్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’ ఈ సినిమా కంటే ఎక్కువ కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. అయినా, ఆ సినిమా తరువాత అంతగా అలరించలేక పోయింది. మహేశ్ కెరీర్ లో తొలి డైరెక్టు సిల్వర్ జూబ్లీగా ‘మురారి’ నిలచింది. ఈ చిత్రం సుదర్శన్ 35 ఎమ్.ఎమ్. థియేటర్లో అప్పట్లో కోటి రూపాయలు వసూలు చేసింది. డివైడ్ టాక్ వచ్చినా, ఇంత కలెక్షన్స్ చూసి సినీజనం నివ్వెర పోయారు. ఈ సినిమా 23 కేంద్రాలలోనే శతదినోత్సవం చూసింది. హైదరాబాద్, బందరులో సిల్వర్ జూబ్లీ చేసుకుంది.
కృష్ణ కెరీర్ మొత్తం కలిపి మూడు సినిమాలు డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ చూశాయి. మహేశ్ ఒక్క థియేటర్ లోనే నాలుగు సిల్వర్ జూబ్లీస్ చూడడం నిజంగా ఘట్టమనేని అభిమానులకు మహదానందం కలిగించింది. ఆ ఆనందానికి ఆరంభం పలికింది ‘మురారి’.
పలు ప్రత్యేకతలు!
ఈ సినిమాతోనే అందాలతార సోనాలి బింద్రే తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత అగ్రకథానాయకులతోనూ కలసి నటించి పలు విజయాలను చవిచూశారు సోనాలి. ఇందులో “డుమ్ డుమ్ నటరాజు…” పాటలో అల్లూరి సీతారామరాజు లోని కృష్ణ బొమ్మ తెరపై కనిపించగానే అభిమానుల ఆనందం అంబరమంటింది. ఇక నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు కృష్ణ అభిమాని కాబట్టి, సినిమా టైటిల్స్ కు ముందే ఈ చిత్రం ఘట్టమనేని వంశాభిమానులకు అంటూ ఓ కార్డ్ వేశారు. దాంతో ఫ్యాన్స్ మరింత పరమానందం చెందారు. మణిశర్మ బాణీల్లో రూపొందిన పాటలన్నీ జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. యన్టీఆర్ ‘సీతారామకళ్యాణం’లోని “సీతారాముల కళ్యాణం చూతము రారండి…” పాట స్ఫూర్తితో ఇందులో “అలనాటి రామచంద్రునికి…” అనే పాటను రూపొందించడం ఇట్టే కనిపిస్తుంది.
కృష్ణవంశీ ‘యన్టీఆర్ సెంటిమెంట్’!
దర్శకుడు కృష్ణవంశీకి ఓ సెంటిమెంట్ భలేగా కలసి వచ్చిందని చెప్పాలి. ఆయన నటవారసులతో సినిమాలు తీసినప్పుడు ఓ సెంటిమెంట్ ను అనుసరించారు. నాగార్జునతో ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా తీశారు. ఆ సినిమా టైటిల్ కార్డ్స్ వచ్చే సమయంలో యన్టీఆర్ ‘సీతారామకళ్యాణం’లోని “సీతారాముల కళ్యాణం చూతము రారండి…” పాటను నేపథ్యంగా వినిపించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించి, డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ చేసుకుంది. అదే సెంటిమెంట్ తో కృష్ణ నటవారసుడైన మహేశ్ తో ‘మురారి’ తీసే సమయంలోనూ అనుసరించారు కృష్ణవంశీ. ‘మురారి’ టైటిల్స్ పడే సమయంలో యన్టీఆర్ ‘పాండురంగ మహాత్మ్యం’లోని “జయకృష్ణా ముకుందా మురారి…” పాటను ప్లే చేశారు. ఈ సినిమా కూడా డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ చేసుకుంది. కృష్ణవంశీ కెరీర్ లో ఈ రెండు చిత్రాలే సూపర్ హిట్స్ గా నిలవడమూ గమనార్హం! పైగా ఈ రెండు పాటలూ యన్టీఆర్ సొంత చిత్రాలలోనివి కావడం మరో విశేషం!