మా వూరు – మా తీరు – పర్వతనేని ఉపేంద్ర

maa uru

పర్వతనేని ఉపేంద్ర.. తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దడంలో తొలినాళ్లలో విశేషంగా శ్రమించారు. పార్టీకి రూపు రేఖలు ఇవ్వడంలో ఎన్టీఆర్‌కు సహకరించి మంచి పేరు సంపాదించుకున్నారు. 1984 – 1990 మధ్య టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1989లో విశ్వనాథ ప్రతాప్ సింగ్ (వీపీ సింగ్) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖా మంత్రి (1989-90)గా పనిచేశారు. ఆ కాలంలో ప్రసార భారతి బిల్లు ప్రవేశ పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. 1990లో తిరిగి రాజ్యసభ సభ్యుడైన ఆయన ఎన్టీఆర్‌తో విభేదాల కారణంగా కాంగ్రెస్‌లో చేరారు.

1996, 1998లలో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలోని పోతునూరులో జన్మించిన ఉపేంద్ర ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టాను అందుకున్నారు. ఆ తర్వాత కలకత్తాలో రైల్వే మంత్రిత్వ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్న ఉపేంద్ర తన రాజకీయ అనుభావాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ‘గతం-స్వగతం’ పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకం ఆత్మకథ కాదనేవారు ఉపేంద్ర. ఆత్మకథలకు ఉండే పరిధి, పరిణితి ఈ పుస్తకంలో లేవని నిర్మొహమాటంగా చెప్పేవారు. బాల్యం నుంచి.. ఎన్టీఆర్‌తో అపోహల వరకు ఈ పుస్తకంలో ఎక్కడా పొల్లుపోకుండా వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ అనుభవాలు నేటి సమాజానికి ఎంతోకొంత స్ఫూర్తినివ్వగలవన్న ఆశాభావంతో ‘గతం-స్వగతం’ నుంచి ప్రతి నెలా కొంత భాగాన్ని పాఠకులకు అందించదలిచాం.
—————-
మా వూరు పోతునూరు.

ma uru1
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు దగ్గరలో వుంది.
ఊరు చిన్నదే అయినా, పేరెన్నిక గన్నది. దేశ స్వాతంత్ర్యం కోసం ఉవ్వెత్తుగా లేచిన జాతీయోద్యమంలో మా వూరు కూడా స్పందించి తన సేవలందించింది. ఒక్కసారి జ్ఞాపకాల పుటలు తిరగేస్తే మా వూరులోని స్వాతంత్ర్య సమరయోధులెందరో గుర్తుకొస్తారు. మను చరిత్ర కావ్యంలో పెద్దనగారు చెప్పినట్టు- ‘అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ!’

1929 ప్రాంతాలలో గాంధీజీ మా వూరు వచ్చారు. వాణీ గ్రంథాలయానికి శంకుస్థాపన చేశారు. ఆయన పైపంచె జోలెగా పట్టి జాతీయోద్యమానికి చందాలు కోరగా స్త్రీలందరూ తమ నగలను ఒలిచి ఇచ్చేశారు. ఆ రోజు నుంచే, తమ ఇళ్లలోని విదేశీ వస్త్రాలను విసర్జించి ఖాదీ వస్త్రధారణకు ఉద్యమించారు. ఇంటింటా చరఖా వెలిసింది. గాంధీజీ సిద్ధాంత ప్రభావానికి లోబడిన వా వూరి మునసబు కొమ్మారెడ్డి ఆంజనేయులుగారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లిపోయారు. అప్పటి నుంచే ఆయనకు ‘సర్దార్ ఆంజనేయులనే’ పేరు వచ్చింది.

రైతు నాయకులు కొమ్మారెడ్డి సత్యనారాయణగారు (నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వైస్-చాన్సలర్ డాక్టర్ కె.ఆర్.ఆర్. మోహనరావుగారి తండ్రి) మా బంధువు. ఆయన 1937-38లో అటు ఇచ్ఛాపురం నుంచి, ఇటు మద్రాసు వరకూ చారిత్రాత్మకమైన రైతాంగ రక్షణ జైత్రయాత్ర నిర్వహించారు. అలాగే సుప్రసిద్ధులు, స్వాతంత్ర్యోద్యమ యోధులు కొమ్మారెడ్డి సూర్యనారాయణగారు మా పెదనాయన. ఆయన తన పద్దెనిమిదవ యేటనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. కొంతకాలం పాటు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. తొలుత, కొంతకాలం రాజ్యసభ సభ్యులు. ఆ మీదట దాదాపు రెండు దశాబ్దాలపాటు లోక్‌సభ సభ్యులుగా వున్నారు. ఆ కాలంలో పార్లమెంటులో, తెలుగువారి సమస్యలను ఎంతో నేర్పుగా సభ దృష్టికి తెచ్చేవారు. ఆయన శక్తియుక్తులు ఆయనను సమర్థుడైన పార్లమెంటరీ వ్యవహారదక్షునిగా నిరూపించాయి. ఆయన తల్లిదండ్రులు కొమ్మారెడ్డి బ్రహ్మయ్య, కనకమ్మగార్లు కూడా స్వాతంత్ర్య యోధులే.

వీరమాచనేని వేంకట నారాయణగారు వరుసకు నాకు మేనమామ. ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, రాష్ట్ర మంత్రిగా వివిధ పదవులు సమర్థవంతంగా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసినదే.

కొమ్మారెడ్డి సత్యనారాయణ వర ప్రసాదరావుగారు వరుసకు నాకు బాబాయి. సాతంత్ర్యోద్యమంలో అనేక పర్యాయాలు కారాగార శిక్ష అనుభవించారు. ఏలూరు తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. కొమ్మారెడ్డి సత్యానారాయణ వర ప్రసాదరావుగారిని పోలీసులు నిర్బంధించి తీసుకు వెళ్లడం నాకింకా కళ్లల్లో మెదులూతూంది. ఇంకా కొమ్మారెడ్డి బాపయ్య చౌదరిగారు, తదితర జాతీయోద్యమ వాదులు నా స్మృతిపథంలో నిలిచే ఉన్నారు.

మా బంధువు శ్రీమతి వీరమాచనేని విమలాదేవిగారు 1962లో పార్లమెంటు సభ్యులయ్యారు. ఆమెది కూడా మా వూరే.

కొమ్మారెడ్డి కుటుంబరావుగారు, కొమ్మారెడ్డి చినాంజనేయులుగారు 1942 ఉద్యమంలో జైలుకి వెళ్లారు.

కొమ్మారెడ్డి పూర్ణచంద్రరావుగారి కుమార్తె, ప్రస్తుతం దెందులూరు శాసనసభ్యురాలు, మంత్రిణి శ్రీమతి మాగంటి వరలక్ష్మిగారు, వారి భర్త, కీ.శే. మాగంటి రవీంద్రనాధ్ చౌదరిగారు మా బంధువులే. మాజీ మంత్రి చనుమోలు వెంకరావు గారు మా బంధువుల అల్లుడు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరో ఆప్తులు. కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేసిన మా వూరి వారెందరో నాకు తరచు గుర్తుకు వస్తూ వుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చాటపర్రు, దెందులూరు, కొవ్వలి, పెదపాడు వంటి గ్రామాలతో మా గ్రామానికి బంధుత్వాలెక్కువ. ఆ గ్రామాల నుంచి చాలామంది జాతీయోద్యమంలో అదే అంకిత భావంతో పనిచేయడం వల్ల – మా పోతునూరు గ్రామం రాజకీయ కేంద్రంగా రూపొందింది.

ఇక్కడ ఒకసారి ఆగి – తెలుగుపేరు లాగ వినిపించని నా పేరు వెనక నేపథ్యంగా వున్న జాతీయోద్యమ ప్రభావం గురించి కొంత చెబుతాను.

ఆంధ్ర, వంగజాతుల మధ్య అనుబంధం చాలా ప్రాచీనమైంది. వంగదేశపు జాతీయ నాయకులిచ్చిన ప్రేరణతో తెలుగు వారెందరో ప్రభావితులై గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన విద్యా సంస్థ – శాంతినికేతన్ (ఇప్పుడది విశ్వభారతి విశ్వవిద్యాలయం)లో విద్యాభ్యాసం చేశారు. జాతీయోద్యమ తరంగాలు ఉవ్వెత్తుగా దేశమంతటా లేస్తున్న రోజుల్లో ఆ గంగాతీరం నుంచి ఈ గోదావరీ తీరానికి బెంగాలీ మహానాయకులెందరో వచ్చి ఉత్తేజకరమైన తమ ఉపన్యాసాలతో తెలుగుజాతిని ఉర్రూతలూగించారు. ఒక్క రాజకీయ ఉద్యమాలే కాదు; సాంఘిక ఉద్యమాలు, సంస్కరణోద్యమాల – చివరకు ఇటీవలి నక్సలైట్ ఉద్యమం వరకూ – పుట్టడం బెంగాల్‌లో అయినా, ఊపిరిపోసుకుని పెరిగి ప్రభావం చూపించింది తెలుగునేల మీదనే. అలనాటి బ్రహ్మసమాజ ప్రభావం కలకత్తా నుంచి కాకినాడకు వ్యాపించింది. ‘మానవసేవే మాధవసేవ’ అని ప్రబోధించిన రామకృష్ణ పరమహంస, వివేకానందుల ప్రభావం ఆంధ్రదేశాన్ని ఆవరించింది. బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన జరిపినప్పుడు ప్రసిద్ధ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు –

భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పిదుకుచున్నారు మూతులు బిగయగట్టి.

– అనే చారిత్రాత్మక పద్యం రాసిన సంగతి జాతీయవాదులకు బాగా తెలుసు. తరువాత ఆ పద్యం జాతీయోద్యమ సాహిత్యంలో ప్రముఖస్థానం పొందింది. ఇక ‘శరత్‌బాబు’గా ఆంధ్రులకు సుపరిచితుడైన రచయిత అసలు పేరు శరచ్ఛంద్ర చటర్జీ అంటే నమ్మలేనంతగా – ఆయన రచనలు తెలుగుజాతి పాఠకులను అలరించాయి. విశ్వకవి రవీంద్రుణ్ణి ఎరగని వారెవరు? ఆయన రాసిన ‘జనగణమన అధినాయక జయహే.. ’ గీతం తొలిసారిగా మదనపల్లెలో గళం విప్పుకుంది.

మా వాళ్లలో కొందరు శాంతినికేతన్‌లో విద్యాభ్యాసం చేశారు. ఈ ప్రభావ నేపథ్యంలో – మా వాళ్లందరికీ, పెద్దగా చదువులు అబ్బకపోయినా బెంగాలీ సంస్కృతీ, సంస్కారాలు మాత్రం అలవాటయ్యాయి. అందువల్ల మా కుటుంబాలలో పిల్లలకు బెంగాలీ పేర్లు పెట్టడం చిరకాలంగా ఆచారమైంది. నాకూ ఆ విధంగానే పేరు పెట్టారు.

నేను 1936 జులై 14వ తేదీన జన్మించాను. జన్మనక్షత్రాన్ని బట్టి పేరు ‘ఉ’తో ప్రారంభం కావాలని’ ఉపేంద్ర చంద్ర చౌదరి’ అని నామకరణం చేశారు. ఆ తరువాతి జీవితంలో అతి ముఖ్యమైన యౌవనకాలాన్ని పదిహేడు సంవత్సరాల పాటు వంగదేశంలో గడపవలసి వచ్చింది. అప్పుడు పేరు తీరునుబట్టి బెంగాలీ సోదరులు నన్ను తమవాడిగానే భావించేవారు. సమాదరించారు.

మాది సాధారణ రైతు కుటుంబం. మా తాతగారు పర్వతనేని బలసవయ్యగారు. మొదట ఆయన కృష్ణా జిల్లా ముక్కొల్లుపాడు గ్రామ నివాసి. వరుసకు వారి అన్న అయిన కొమ్మారెడ్డి వెంకటరత్నంగారు తమ వ్యవసాయం, ఇతర పనిపాటలు దక్షతగా చూసి పెట్టడం కోసం మా తాతగారిని ముక్కొల్లుపాడు నుండి పోతునూరు తీసుకువచ్చారు. బసవయ్యగారి వివాహం కూడా వెంకటరత్నంగారే జరిపించారు. మా నాయనమ్మ శ్రీమతి శేషమ్మగారు ఆయన భార్యవైపు దగ్గర బంధువు కూడా. బంధుత్వం కూడా అలా కలిసిరావడంతో మా రెండు కుటుంబాలూ ఎంతో కలిసి మెలిసి వుండేవి. మా నాన్నగారు, పినతండ్రులు, అత్తయ్యలు, అంతా వెంకటరత్నంగారి పిల్లలతోపాటే ఒకే ఇంట్లో పెరిగి పెద్దవాళ్లయ్యారు. కొమ్మారెడ్డి వెంకటరత్నంగారికి 400 ఎకరాల భూవసతి వుండేది.

మా తాతగారితోపాటు, మా నాన్న దశరథరామయ్యగారే ఆ ఆస్తి వ్యవహారాలన్నీ చూసేవారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. ఆయన చదువుకోకపోయినా సర్వే వ్యవహారాలు, దస్తావేజులు రాయడం, లెక్కపత్రాలు చూడడం వంటి విషయాలలోనూ, ఊళ్లో తగాదాల పరిష్కారం విషయంలోనూ ఎంతో దక్షతగా వుండేవారు. వృత్తిలో మా తాతగారి మార్గాన్నే అనుసరించారు.

వెంకటరత్నంగారు మా కుటుంబం నివాసం కోసం చిన్న ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆయన కేకవేస్తే ఆ పిలుపు అందుకుని మా తాతగారో, నాన్నగారో వెళ్లేటంత దగ్గర ఇళ్లుమావి. మా వాళ్లు ఆయన వ్యవసాయాన్ని రాత్రింబవళ్లు శ్రమించి బాగా వృద్ధి చేశారు. మా తాతగారికి సంతానం ముగ్గురు మగపిల్లలు, ఇద్దరాడపిల్లలు.

వెంకటరత్నం గారి పిల్లలు వేరుపడిన సందర్భంలోనే మా తాతగారు కూడా ఆయనకు ఇచ్చిన కొద్దిపాటి పొలంతో విడిగా జీవనం గడపడం ప్రారంభించారు. మా తాతగారి ఆశలు, శ్రమ ఒకతీరై, మా కుటుంబం మధ్యతరగతి కుటుంబంగానే మిగిలింది. వ్యవసాయం మా నాన్నగారే చూసేవారు. ఆ వాతావరణంలో ఎవరికీ చదువులు చెప్పించే పరిస్థితులు లేవు.

మా నాన్నగారు చిన్న తరగతులనాడే చదువు ముగించారు. మా బాబాయిలు సుబ్రహ్మణ్యంగారు, నరసింహారావుగారు కూడా వానాకాలం చదువులతోనే సరిపెట్టుకున్నారు. మా పోతునూరు గ్రామం మొత్తం మీదనే చదువులు తక్కువ. అన్నీ రైతు కుటుంబాలే. అంతా నేలతల్లిని నమ్మకు బతికినవాళ్లే. ఏ అయిదారుగురో మాత్రం పెద్ద చదువులు చదివి, వైద్యులూ, ప్రభుత్వోద్యోగులూ అయ్యారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు.

మా ఇంట్లో మా నాన్నగారు కాంగ్రెస్ అభిమాని. మా బాబాయిలు, మా బావ చెన్నకేశవరావుగారు కమ్యూనిస్టు ఉద్యమాభిమానులు. చిత్రంగా మా ఇంట్లో రెండు విధాల రాజకీయ సిద్ధాంత సంస్కారాలు ఉండేవి. మా కుటుంబం నుంచి మా బాబాయిలిద్దరూ వేరుపడేనాటికి మేం చిన్నపిల్లలం. మా నాన్నగారికి నేను పెద్ద కొడుకుని. మా అక్క హేమలత. సత్యానారయణ వరప్రసాదరావు నా తమ్మడు. అన్నపూర్ణ చెల్లెలు.

చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలమీద ఆసక్తి కలగడానికి కారణం మా ఊరి వాతావరణం గనక, దాని గురించి ఇక్కడ మరికొంచెం చెప్పి, తరవాత నా చదువు సంధ్యల విషయానికొస్తాను. మా పోతునూరులో రాజకీయ వాతావరణం రసవత్తరంగా ఉండేది. కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఎక్కువగా వుండేది. విచిత్రమేమిటంటే ఊళ్లో మోతుబరి రైతులంతా కమ్యూనిస్టులే. కేవలం సిద్ధాంతరీత్యా అభిమానులే కాదు, కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల సభ్యులు కూడా. మధ్యతరగతి కుటుంబాలలో మాత్రం చాలామంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు.

మా పెదనాన్న (వెంకటరత్నంగారి పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం) గారికి రాజకీయాలమీద అభిరుచి ఎక్కువ. ఆయన ఇల్లే అన్ని రాజకీయ చర్చలకు కేంద్రం. ఆ రోజుల్లో ప్రకాశం – రంగా వర్గం అనీ, సంజీవరెడ్డి వర్గం అనీ, కాంగ్రెస్‌లో రెండు బలమైన వర్గాలుండేవి. ప్రకాశం-రంగా వర్గానికి మావూరు పట్టుకొమ్మ. జిల్లాలో వుండే కాంగ్రెస్ వర్గీయులంతా కొమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం గారింటికి చేరుతూండేవారు. చర్చలు, పథకాలు, సంప్రదింపులు, తర్జన భర్జనలు.. వాతావరణం మాంచి రసకందాయంలో వుండేది.

అప్పటికి నా వయసు ప్నెండేళ్లలోపే. వాళ్ల చర్చల్ని ఏమూలనో నక్కి ఆసక్తిగా వింటూండేవాడిని. ఎప్పుడో, ఏమరుపాటుగా మా సుబ్రహ్మణ్యం పెదనాన్న గారి కళ్లలో పడితినట్టాయెనా! – ‘‘ఏరా, వేలెడులేవు! నీకప్పుడే రాజకీయాలా? అంత ఇష్టంగా వుందా?’’ అని అభిమానంగా మేలమాడడమో, లేదా, – ‘‘పోరా, పో – నీకెందుకివన్నీ పెద్దవాళ్లు మాట్లాడుకుంటూంటే..?’’ అని కసురుకోవడమో చేసేవారు.

ఆనాటి నా పసిమనసును ఆకర్షించిన రాజకీయ చైతన్యం అంతటితో నన్ను వదిలిపోలేదు. విద్యార్థి దశలోనికంటా నన్ను అనుసరించి, ప్రభావితం చేసి,నా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవడానికి ఎంతో దోహదం చేసింది.

ma uru3

Share: