కరోనా కల్లోలం కారణంగా యావత్ ప్రపంచ చలనచిత్ర పరిశ్రమనే అతలాకుతలమై పోయింది. ప్రపంచంలో అత్యధికంగా చిత్రాలను నిర్మించే హాలీవుడ్ తరువాత భారతదేశానిదే ఆ స్థానం. మన భారతదేశంలో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. టాప్ స్టార్స్ సినిమాలు సైతం థియేటర్లలో విడుదల చేసినా, జనం రావడం లేదు. టాప్ స్టార్స్ సినిమాలకు మొదటి రోజు మాత్రం హంగామా కనిపిస్తోంది. తరువాత ఎంచక్కా ఓటీటీల్లో వస్తుంది కదా అనే నమ్మకంతో జనం థియేటర్ల వైపు వెళ్ళడం లేదు. ప్యాండమిక్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ లో ఎంతోమంది సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. దాంతో సినిమా టాక్ బాగుంటేనే థియేటర్లకు వెళ్లడానికి వారు ఇష్టపడుతున్నారు. పైగా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఒకటి అర మాత్రమే గుడ్ టాక్ సంపాదిస్తున్నాయి తప్ప మిగిలినవేవీ రాబడి చూడడం లేదు. ఇక మన తెలుగు రాష్ట్రాల సినిమా రంగం విషయానికి వస్తే- మునుపటి ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకొని భారీ చిత్రాలను రూపొందించారు స్టార్స్ . దాంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని థియేటర్లలో విడుదల చేసినా, నష్టాలు తప్పవనే విషయాన్ని సినీజనం జీర్ణించుకోలేక పోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పరిస్థితి నుండి ఎలాగైనా భారీ చిత్రాలను బయట పడేయాలని భావిస్తున్నారు. సినిమా పెద్దలు టాప్ స్టార్స్ చిత్రాలు భారీ వ్యయంతో రూపొందినందువల్ల టిక్కెట్ రేట్లు పెంచుకొనే వెసులుబాటు కల్పించాలని ఆశిస్తున్నారు. అయితే మన తెలుగు సినిమా పెద్దల ఆశలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎలాగంటే, గతంలో మొదటి రెండు వారాలు సినిమా ఆడితే చాలు, తాము బయటపడిపోతాం అనే నమ్మకం కొనుగోలు దారుల్లో ఉండేది. దాంతో మొదటి రెండు వారాలకు కోర్టు ద్వారా అనుమతి తీసుకువచ్చి టిక్కెట్ రేట్లు 30 నుండి 50 శాతం పెంచుకొనేవారు. ఆ రీతిన సాగినా, ఇప్పుడు రెండు వారాలు ఆడే సినిమాలు కనిపించడం లేదు. దాంతో పెద్ద సినిమాల వారు మొదటిరోజునే ప్రేక్షకుడి జేబు ఖాళీ చేయించే ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం ఏ సెంటర్స్ లో ఫ్లాట్ రేటు రూ.500 పెట్టాలని, బి,సి కేంద్రాలలో టిక్కెట్ రేటును రూ.250-300 పెడితే బాగుంటుందని ఆశిస్తున్నారు. మరి ప్రేక్షకుడి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని టిక్కెట్ రేట్లు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కేవలం 50 శాతం కెపాసిటీనే థియేటర్లలో ఆమోదించిన ఏపీ గవర్నమెంట్ టిక్కెట్ రేట్లు పెంచరాదనే భావించింది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోల భారీ బడ్జెట్ మూవీస్ కు ఏ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుందో చూడాలి.
కిం కర్తవ్యం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం సినీపెద్దలకు రుచించడం లేదు. కానీ, వాస్తవానికి కరోనా కల్లోలంలో అందరికంటే సామాన్యులే చితికి పోయారు. మొదటి నుంచీ సినిమాకు ఆదరణ కర్తలు మధ్యతరగతి కుటుంబీకులే. చితికిన సామాన్యుల నుండి వినోదం పేరిట మరింత వసూలు చేయడం భావ్యం కాదని ఏపీ ప్రభుత్వం విశ్వసించింది. అందువల్లే టిక్కెట్ రేట్లు పెంచుకోకుండానే, యాభై శాతం కెపాసిటీతోనే సినిమాలు నడపాలని సూచించింది. దాంతో ఏపీలో దాదాపు 40 శాతం థియేటర్లు తెరచుకోలేదు. కానీ, థియేటర్లకు జనాన్ని రప్పించడానికి కష్టమో, నష్టమో సినిమా హాళ్లు తెరిస్తేనే మంచిదని భావించినవారు తమ ప్రదర్శన శాలలలో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. అయితే వారికి ఏ మాత్రం ఇది లాభసాటిగా లేదు. అందువల్ల గతంలో అమలులో ఉన్న శ్లాబ్ సిస్టమ్ ను ఎత్తివేసి, పాత కాలంలో ఉన్న పర్సంటేజ్ సిస్టమ్ తో సినిమా హాళ్లు నడుపుతున్నారు. అందుకు అంగీకరించిన వారి సినిమాలను మాత్రమే ప్రదర్శిస్తున్నారు. అయినప్పటికీ రోజువారీ ఖర్చులు కూడా రావడం లేదని కొందరు థియేటర్ల వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలు తమ లైబ్రరీని పెంచుకోవడానికి పేరున్న నటులు నటించిన చిత్రాలకు మంచి రేటును ఆఫర్ చేస్తున్నారు. థియేటర్లలో విడుదల చేస్తేనే తమ అభిమానులు ఆనందిస్తారు అనే నమ్మకంతో ఉన్న టాప్ స్టార్స్ కొందరు సినిమా హాళ్లవైపే మొగ్గు చూపుతున్నారు. ముందుగా ఓటీటీల్లో విడుదల చేస్తే తరువాత థియేటర్లలో సదరు చిత్రాలను చూడరు. ఒకవేళ ముందుగా థియేటర్లలో విడుదల చేసి, తరువాత ఓటీటీల్లో ప్రదర్శిస్తే రేటు దాదాపు 75 శాతం తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్ వంటి టాప్ స్టార్ మూవీ `నారప్ప`ను ఓటీటీల్లోనే విడుదల చేశారు. ఆ సినిమాను రూ.20 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇక యంగ్ హీరో నాని తాజా చిత్రం `టక్ జగదీశ్` కూడా తొలుత థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం థియేటర్ల ద్వారా వస్తున్న వసూళ్లు తమ పెట్టుబడికి తగిన విధంగా రాకపోగా, 50 శాతానికి పైగా నష్టాలను వాటిల్ల చేస్తున్నాయని సినీజనం అంటున్నారు. అందువల్ల హీరో నానికి తన చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూడాలన్న అభిలాష ఉన్నా, చేసేదేమీ లేక నిర్మాతల శ్రేయస్సు కోసం అంటూ `టక్ జగదీశ్`ను ఓటీటీకి ఇచ్చేయడానికి అంగీకరించారు. ఈ సినిమాను కూడా అమెజాన్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చిత్రానికి రూ.40 కోట్లు అమెజాన్ నిర్మాతలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ మొత్తం నిజమే అయితే, ఖచ్చితంగా నిర్మాతల ఆలోచన సబబైనదే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేసినా, ఆ మొత్తాన్ని కాదు కదా, అందులో సగం కూడా వసూలు చేయలేదు. అందువల్ల `టక్ జగదీశ్` నిర్మాతల అభిప్రాయాన్ని చిన్న సినిమాల నిర్మాతలు గౌరవిస్తున్నారు. తాము కూడా తమ సినిమాలను ముందుగా ఓటీటీల్లో విడుదల చేయడానికే సై అంటున్నారు. అయితే అందరు తీసిన చిత్రాలకు ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్ ఇవ్వడం లేదు. ఓ మోస్తరు పేరున్న చిత్రాలకే మంచి రేటు ఇస్తున్నారు. ఈ మధ్య ఓ కుర్ర హీరో సినిమాకు పది కోట్లు ఆఫర్ చేశారట ఓటీటీవారు. అయితే సదరు కుర్రహీరో తన సినిమా థియేటర్ల ద్వారా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తుందని విడుదల చేశాడు. తీరా చూస్తే, ఓటీటీ వారు ఇచ్చిన ఆఫర్ లో సగం కూడా పోగేయలేకపోయింది ఆ సినిమా. పైగా వారిని ఒక సినిమా విడుదలయ్యే రోజులు కావివి. ఒకే రోజున మూడు నాలుగు చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మునుపటి పరిస్థితులు నెలకొన్నా, సినిమా థియేటర్లకు వెళ్ళి అన్ని సినిమాలు చూసేవారు లేరు. దాంతో ఓటీటీల్లో తమ చిత్రాలను విడుదల చేసుకోవడానికి చిన్న నిర్మాతలు పోటీ పడుతున్నారు. అదృష్టం బాగున్నవారి చిత్రాలకు మంచిరేట్లు లభిస్తున్నాయి.
టాప్ స్టార్స్ అయోమయం!
ఎవరు అవునన్నా, కాదన్నా థియేటర్లకు జనాన్ని రప్పించగల కెపాసిటీ ఉన్న హీరోలు ఎవరు అంటే చిరంజీవి, బాలకృష్ణ అనే చెప్పాలి. వారిద్దరి చిత్రాలు ఫ్లాప్ టాక్ వచ్చినా, కొనుగోలుదారులకు భారీ నష్టాలేమీ రావని నమ్మకం ఉండేది. ఇప్పుడు వారిద్దరూ రెండు భారీ చిత్రాలలో నటించారు. చిరంజీవి `ఆచార్య` ఎప్పుడో అయిపోయిందని, సంక్రాంతికే రావలసిందని అంటున్నారు. కానీ, ఇప్పుడు ఇంకా షూటింగ్ పూర్తి కాలేదనే చాటింపు జరుగుతోంది. ఇక బాలకృష్ణ `అఖండ` కూడా ఇంకా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది. ఈ రెండు చిత్రాలలో ఒకటి దసరా పండగకు వస్తుందని అంటున్నారు. కానీ, పరిశీలకులు చెబుతున్న దానిని బట్టి సెప్టెంబర్ లో మూడో వేవ్ వస్తుందని కొందరు నమ్ముతున్నారు. అదే వస్తే, మళ్ళీ థియేటర్లు మూత పడాల్సి వస్తుంది. ఒకవేళ 50 శాతం కెపాసిటీతో నడిపించినా, మునుపటిలా భారీ లాభాలేమీ రావు. దాంతో కొనుగోలుదారులు కూడా ముందుగా అంగీకరించిన మొత్తాలలో సగమే ఇస్తామని అంటున్నారు. ఈ రెండు చిత్రాల పరిస్థితి ఇలా ఉంటే, యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన `ట్రిపుల్ ఆర్` మరింత భారీగా తెరకెక్కింది. దాదాపు నాలుగువందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిత్రం రూపొందిందని అంటున్నారు. తెలుగులోనే కాకుండా దక్షిణాది అన్ని భాషల్లోనూ ఉత్తరాదిలో హిందీతో పాటు బెంగాలీ, మరాఠీలోనూ ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేయాలని రాజమౌళి అండ్ కో భావిస్తోంది. అయితే సల్మాన్ ఖాన్ వంటి మాస్ హీరో చిత్రానికే మొన్న ఆదరణ లభించలేదు. మరి `ట్రిపుల్ ఆర్` డబ్బింగ్ కు ఆ పాటి ఆదరణ ఉత్తరాదిన వస్తుందా అన్నది ప్రశ్న. సినిమా ఏమో `బాహుబలి` సీరీస్ లాభాలను చూసి, అదే నమ్మకంతో భారీగా రూపొందించారు. తీరా ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్నట్టు అక్టో్బర్ లో ఈ సినిమా వెలుగు చూడదని వినికిడి. ఒకవేళ కాదు,కూడదని విడుదల చేసినా, థియేటర్ల ద్వారా దేశం మొత్తం మీద కూడా ఆ సినిమాకు లాభాలు రావన్నది ట్రేడ్ పండిట్స్ మాట.
ట్రిపుల్ ఆర్ వైపు… ఓటీటీ చూపు…
రాజమౌళి భారీగా రూపొందించిన `ట్రిపుల్ ఆర్` చిత్రం వైపు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి పెద్ద ఓటీటీ సంస్థలు చూపు సారిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాను థియేటర్లలో కంటే ముందుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో విడుదల చేస్తే థియేటర్లలో ఎంత వస్తుందని భావిస్తున్నారో, అంత మొత్తం ఇవ్వడానికీ ఈ సంస్థలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదంతా రాజమౌళి `బాహుబలి` సీరీస్ చూపిన క్రేజ్ అని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ఒకవేళ రాజమౌళి నిర్మాత శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఓటీటీకి సై అంటే ఇన్నాళ్ళు ఈ సినిమాకోసం వేరే చిత్రాల్లో నటించకుండా ఉన్న హీరోలు నష్టపోయినట్టేననీ పరిశీలకుల భావన. ఈ నేపథ్యంలో `ట్రిపుల్ ఆర్` థియేటర్లకే వెళ్లినా, యంగ్ స్టార్స్ నటించిన మొట్టమొదటి మల్టీస్టారర్ కాబట్టి, ఓ వారం రోజులు వసూళ్ళు ఉండవచ్చునని భావిస్తున్నారు. నిర్మాతకు కానీ, కొనుగోలు దారులకు కానీ నష్టం వాటిల్ల కూడదు అని అనుకుంటే టిక్కెట్ రేట్లు పెంచక తప్పదు. గతంలో `బాహుబలి`, `యన్టీఆర్ బయోగ్రఫి` చిత్రాలకు ఆ వెసులుబాటు కల్పించారు. అలాగే కొన్ని భారీ చిత్రాలకు కొనగులోదారులు కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకొని మరీ రేట్లు పెంచి ప్రదర్శించారు. నష్టాల పాలు కాకుండా బయటపడ్డారు. కొన్నిసార్లు అనుకున్నట్టే లాభాలూ చూశారు. అయితే అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి రాజమౌళి సినిమాకు తెలుగునేలపైని అన్ని కేంద్రాలలోనూ మొదటి రోజున ఫ్లాట్ రేట్లు అమ్మితేనే సదరు చిత్రం బతికి బట్ట కడుతుందని అంచనా! మరి టిక్కెట్ రేట్లు ఏ మాత్రం పెంచడానికి సుముఖంగా లేని ఏపీ ప్రభుత్వం అందుకు అనుమతిస్తుందా!? ఇది మరో ప్రశ్న. ఇన్ని ప్రశ్నలతో సతమతమవుతున్న తెలుగు సినిమా భవిష్యత్ లో ఓటీటీనే శరణ్యమని భావిస్తుందా అన్నది ఇంకో సందేహం. ఏది ఏమైనా ఓటీటీవైపే చిన్న నిర్మాతల చూపు సాగుతోంది. స్టార్స్ కూడా అదే బాట పడుతున్నారు. టాప్ స్టార్స్ చిత్రాల మాటేమిటో చూడాలి.