మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అభినయ పర్వంలో ‘ప్రేమాభిషేకం’ చిత్రం మరపురానిది, మరచిపోలేనిది. ఓ విషాదాంత ప్రేమకథ అంతటి ఘనవిజయం సాధించడం అభిమానులకు ఓ మధురానుభూతిగా మిగిలింది. ఆరంభంలో జానపద కథానాయకునిగా సాగిన ఏయన్నార్ కు నటనే రాదన్న వారు ఉన్నారు. అలాంటి ఏయన్నార్ కు వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య , డి.ఎల్.నారాయణ అందించిన అపూర్వ కానుక ‘దేవదాసు’ (1953).ఆ సినిమాతో నాగేశ్వరరావు తానూ నటుడినే అని నిరూపించుకున్నారు. ఆ విషాదాంత ప్రేమకథ ఆ రోజుల్లో మంచి విజయం సాదించింది. ఏయన్నార్ ను ‘ట్రాజెడీ కింగ్’ గా నిలిపింది. ఆ తరువాత నుంచీ ఏయన్నార్ పలు చిత్రాలలో భగ్నప్రేమికునిగా నటించి మెప్పించారు. అలా తెలుగునాట విషాదాంత ప్రేమకథల నాయకునిగా ఏయన్నార్ మంచి పేరు సంపాదించారు. ‘దేవదాసు’ కంటే ముందు ‘లైలా-మజ్ను’లో మజ్నుగానూ, తరువాత ‘అనార్కలి’లో సలీమ్ గానూ నటించారు అక్కినేని. అలా సుప్రసిద్ధమైన విషాదాంత ప్రేమకథల్లో కథానాయకునిగా నటించడం వల్ల ఏయన్నార్ జనానికి మరింత చేరువయ్యారు. ‘ట్రాజెడీ కింగ్’గా ఆయనకు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే అక్కినేని వీరాభిమాని అయిన దర్శకుడు దాసరి నారాయణరావు ‘ప్రేమాభిషేకం’ కథను రూపొందించారు. మొన్నటి ఫిబ్రవరి 18తో ‘ప్రేమాభిషేకం’ 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా పలు పత్రికలు, టీవీల్లో ‘ప్రేమాభిషేకం’ చిత్రంపై ప్రసారమైన ప్రత్యేక కథనాలు అక్కినేని అభిమానులను పులకింపచేశాయి. నలభై ఏళ్ళ క్రితం ‘ప్రేమాభిషేకం’ నెలకొల్పిన రికార్డులు కొన్ని ఈ నాటికీ చెక్కుచెదరక నిలచే ఉన్నాయి. వాటిని తలచుకొంటూ అక్కినేని అభిమానులు పులకించిపోతున్నారు.
పదేళ్ళ తరువాత…
నటరత్న యన్టీఆర్ ఆగమనంతో నటసమ్రాట్ ఏయన్నార్ తనకు పేరు సంపాదించి పెట్టిన జానపదాలకు స్వస్తి పలికి, సాంఘికాలనే ఎంచుకున్నారు. స్వతహాగా స్ఫురద్రూపి అయిన యన్టీఆర్ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ముందుకు సాగారు. యన్టీఆర్ స్టార్ గా ఎదిగిన తొలి దశకంలో ఏయన్నార్ చిత్రాలు సైతం పోటీగా సాగాయి. అయితే తరువాతి రెండు దశాబ్దాలు (1961-1980) ఏయన్నార్ చిత్రాలు ఘనవిజయాలు సాధించినవి ఉన్నా, యన్టీఆర్ దే పైచేయిగా సాగింది. ఆ సమయంలో 1971లో ఏయన్నార్ నటించిన ‘దసరాబుల్లోడు’ అనూహ్య విజయం సాదించింది. వి.బి.రాజేంద్రప్రసాద్ కు దర్శకునిగా ఇదే తొలి చిత్రం. అప్పట్లో కలర్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉండేది. దాంతో ‘దసరాబుల్లోడు’ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకొని 22 కేంద్రాలలో శతదినోత్సవం చూసి, హైదరాబాద్ లో సంవత్సరం పాటు ప్రదర్శితమైంది. ఏయన్నార్ నటజీవితంలో తొలి గోల్డెన్ జూబ్లీగా ‘దసరాబుల్లోడు’ నిలచింది. ఆ తరువాత కూడా కొన్ని సినిమాలు ఏయన్నార్ కు ఘనవిజయాలను అందించినా, అవేవీ ‘దసరాబుల్లోడు’ స్థాయిలో ఆకట్టుకోలేదు. మరోవైపు యన్టీఆర్ నటించిన పలు చిత్రాలు ఒకదానిని మించి మరోటి విజయభేరీమోగిస్తూ సాగాయి. ఈ నేపథ్యంలో నిరాశ చెందిన అక్కినేని అభిమానులకు దాసరి దర్శకత్వంలో రూపొందిన కొన్ని చిత్రాలు ఊరట నిచ్చాయి. అయితే 1971 తరువాత మళ్ళీ పదేళ్లకు ‘దసరాబుల్లోడు’ ను మించిన ఆనందాన్ని సొంతం చేసిన చిత్రంగా ‘ప్రేమాభిషేకం’ నిలచింది.
రెండింటా అదే…
ఇక్కడ మరో విశేషం ఉంది. ‘దసరాబుల్లోడు’లో ఇద్దరు నాయికలు. అందులో చంద్రకళకు క్యాన్సర్ ఉంటుంది. చివరలో ఏయన్నార్ ను, వాణిశ్రీని కలిపి కన్నుమూస్తుంది. పదేళ్ల తరువాత అంతటి విజయానికి కారణమైన ‘ప్రేమాభిషేకం’లో హీరోకు అదే వ్యాధి ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి జీవితం బాగుండాలని, తనను తాను కించపరచుకుంటూ, ఆమె మరొకరిని పెళ్లి చేసుకొనేలా చేస్తాడు హీరో. చివరకు వారి ని దీవిస్తూ కన్నుమూస్తాడు. ఇలా ఈ రెండు సూపర్ హిట్స్ కు ఒకే వ్యాధి ప్రధాన పాత్ర పోషించింది. ‘ప్రేమాభిషేకం’ చిత్రం సమయానికి ఏయన్నార్ వయసు 57 సంవత్సరాలు. ఆయన ముఖంలో బాగా ముడతలు కనిపించేవి. దాంతో అక్కినేని పని అయపోయిందని వేరే హీరోల అభిమానులు అనేవారు. ఆ ముఖానికి తగ్గ కథను తయారు చేసి, రక్తి కట్టించారు దాసరి. తన అభిమాన హీరోకు ఏ కథ అయితే బాగుంటుందోనని దాసరి పదే పదే ఆలోచించేవారు. అలా ఏయన్నార్ తోనే ఆయన రూపొందిస్తున్న ‘శ్రీవారి ముచ్చట్లు’ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతూ ఉండగా దాసరి మదిలో ‘ప్రేమాభిషేకం’ కథ మెదిలింది. ఆ విషయం అక్కినేనికి అక్కడే చెప్పారు. ఏయన్నార్ కూడా విషాదాంత ప్రేమకథల్లో నటిస్తే బాగుంటుందని భావించి, ఆ సినిమాను తానే నిర్మిస్తానని అన్నారు. అలా ‘అన్నపూర్ణ సినీస్టూడియోస్’ పతాకంపై ‘ప్రేమాభిషేకం’ రూపొందింది.
బర్త్ డే టు మ్యారేజ్ డే!
‘ప్రేమాభిషేకం’ చిత్రం 1980 సెప్టెంబర్ 20న అక్కినేని జన్మదినోత్సవాన షూటింగ్ మొదలు పెట్టుకుంది. సినిమాలో ఏయన్నార్ పుష్పగుచ్ఛం తీసుకు వెళ్ళి హీరోయిన్ శ్రీదేవికి బర్త్ డే విషెస్ చెప్పడం, ఆ రోజు తన పుట్టినరోజుకూడా అని చెప్పి ‘విష్ మి ద సేమ్’ అనడం ముహూర్తపు సన్నివేశంగా చిత్రీకరించారు. మధ్యలో కథలో కొన్ని మార్పులు చేయమని అక్కినేని కోరారు. అయితే దాసరి అందుకు ససేమిరా అన్నారు. దీంతో షూటింగ్ కు అంతరాయం కలిగింది. అప్పుడు అన్నపూర్ణమ్మ కలుగజేసుకోవడంతో దాసరి మళ్ళీ చిత్రీకరణ ఆరంభించారు. అలా కాసింత ఆలస్యమైంది. అయినా, ఫిబ్రవరి 18న ఏయన్నార్, అన్నపూర్ణమ్మ మ్యారేజ్ డే. అందువల్ల ఆ తేదీన విడుదల చేద్దామని దాసరి సూచించారు. అలా అక్కినేని బర్త్ డేకు ఆరంభమైన ‘ప్రేమాభిషేకం’, ఆయన మ్యారేజ్ డేకు విడుదల కావడం విశేషం!
విజయపరంపర
‘ప్రేమాభిషేకం’ చిత్రం 33 కేంద్రాలలో విడుదలయింది. మొదటి రెండు వారాలు సాధారణ టాక్ తోనే నడించింది. తరువాత ఈ చిత్రంలోని పాటలు జనానికి భలేగా పట్టేశాయి. ఈ సినిమాకు మాటలు, పాటలు కూడా దాసరి రాశారు. ఇక చక్రవర్తి స్వరకల్పనలో ఇందులోని ఏడు పాటలూ ఉర్రూతలూగించాయి. ప్రస్తుతం సినిమాలో కనిపించే ఏడు పాటలూ కాకుండా “జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో…మారుతుందీ చూడు వింత వింత రూపుల్లో…” సాంగ్ ను కూడా రికార్డు చేశారు. మొదట్లో ఆ పాట కూడా రికార్డుల్లోనూ , కేసెట్లలోనూ ఉండేది. సినిమాలో ‘వందనం అభివందనం…’ పాట స్థానంలోనే ఈ పాట రావలసి ఉంది. అందువల్ల దానిని చిత్రీకరించలేదు. ఇక ‘ప్రేమాభిషేకం’కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతూ ఉండడంతో అభిమానులు ప్రత్యేక బస్సులు వేసుకొని వచ్చి, ఏయన్నార్ ను అభినందించ సాగారు. అంతకు ముందు ఒకే రీలీజ్ లో 32 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా యన్టీఆర్ ‘అడవిరాముడు’ రికార్డుగా నిలచి ఉంది. దాంతో ‘ప్రేమాభిషేకం’ కూడా అన్ని కేంద్రాలలో వంద రోజులు వేయాలని భావించారు. అయితే మూడు కేంద్రాలలో ఈ చిత్రాన్ని యాభై రోజులకు ఎత్తివేశారు. అలా 30 కేంద్రాలలోనే ‘ప్రేమాభిషేకం’ తొలి విడతలో శతదినోత్సవం చూసింది. మరో విశేషమేమంటే ఏయన్నార్ మ్యారేజ్ డేన విడుదలయిన ఈ చిత్రం యన్టీఆర్ బర్త్ డే అయిన మే 28న శతదినోత్సవం పూర్తిచేసుకుంది. అదే రోజున 1981లో యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా నటించిన ‘సత్యం-శివం’ విడుదలయింది.
రజతోత్సవంలో రికార్డ్!
శతదినోత్సవాలలో రికార్డు నెలకొల్పలేకపోయిన ‘ప్రేమాభిషేకం’ రజతోత్సవాలలో ఆ పట్టు సాధించింది. 16 కేంద్రాలలో నేరుగా, మూడు కేంద్రాలలో షిఫ్ట్ పై, పది కేంద్రాలలో నూన్ షోస్ తో మొత్తం 29 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ చేసుకుంది ప్రేమాభిషేకం. అంతకు ముందు అంతకు ముందు యన్టీఆర్ చిత్రాలు ‘లవకుశ’ 18 కేంద్రాలలోనూ, ‘అడవిరాముడు’ 16 కేంద్రాలలోనూ రజతోత్సవం జరుపుకొన్నాయి. డబుల్ డిజిట్ లో ఏయన్నార్ నటించిన ఏ సినిమా కూడా సిల్వర్ జూబ్లీ చేసుకోలేదు. ఆ రికార్డును ‘ప్రేమాభిషేకం’ సాధించింది. ఆ తరువాత మరో 11 కేంద్రాలలో వందరోజులు, మరో రెండు కేంద్రాలలో రజతోత్సవం చూసింది. అలా మొత్తం 41 కేంద్రాలలో శతదినోత్సవాలు చేసుకున్న ఈ చిత్రం 31 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. నాలుగు రేంద్రాలలో డైరెక్టుగా, ఐదు కేంద్రాలలో షిష్ట్ పై సంవత్సరం పాటు ప్రదర్శితమైంది. హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలో 75 వారాలు ప్రదర్శితమై తెలుగునేలపై ప్లాటినమ్ జూబ్లీ జరుపుకున్న తొలి చిత్రంగా రికార్డు నమోదు చేసింది. అదీగాక, గుంటూరు విజయాటాకీస్ లో ఏకధాటిగా 380రోజులు ఆడి, డైరెక్టుగా స్వర్ణోత్సవం చూసిన తెలుగు చిత్రంగానూ నిలిచింది.
ఏయన్నార్ కు తొలి కోటి…
అంతకు ముందు ఏయన్నార్ కు కోటి రూపాయలు చూసిన సినిమా లేదు. అప్పటికే యన్టీఆర్ కు “లవకుశ, దానవీరశూర కర్ణ, అడవిరాముడు, యమగోల, డ్రైవర్ రాముడు, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, గజదొంగ” వంటివి కోటి రూపాయలు చూసిన చిత్రాలుగా నిలిచాయి. యన్టీఆర్ సినిమాల తరువాత కోటి రూపాయలు చూసిన సినిమాగా ‘శంకరాభరణం’ (1980) ఉండేది. ‘ప్రేమాభిషేకం’ చిత్రం ఏయన్నార్ కు తొలి కోటి రూపాయల చిత్రంగా నిలచింది. ఈ సినిమా గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ లో ఈ చిత్రం కోటి రూపాయల ముప్పై లక్షలు సాధించిందని ఏయన్నార్ స్వయంగా తెలిపారు. ఆ తరువాత కూడా టోటల్ రన్ లో మరో కోటి రూపాయలు వసూలు చేసిందని అభిమానుల మాట. మొత్తం రెండు కోట్ల ముప్పయి లక్షలు పోగేసిందని చెప్పవచ్చు. అలా ఏయన్నార్ కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గానూ ‘ప్రేమాభిషేకం’ నిలచింది. ఓ విషాదాంత ప్రేమకథ ఇంతటి విజయం సాధించడం అరుదైన విషయమనే చెప్పాలి.
అభిమానుల గోల!
‘ప్రేమాభిషేకం’ చిత్రం రన్నింగ్ పరంగానూ పలు రికార్డులు నమోదు చేసింది. దాంతో ఏయన్నార్ అభిమానులు కాలర్ ఎగరేసి తిరిగేవారు. యన్టీఆర్ అభిమానులు ఈ రికార్డులు కొట్టాలని ఆశించేవారు. యన్టీఆర్ ను స్వయంగా కలసి ‘కొండవీటి సింహం’తో ఆ రికార్డులు బద్దలు కొట్టాలని చెప్పారు. ఓ సినిమా ఏ రేంజ్ లో ఆడితే, అంతవరకే ఆడాలి తప్ప నిర్మాతలు, పంపిణీదారులపై భారం మోపరాదని యన్టీఆర్ అభిమానులకు హితబోధ చేసి పంపారు. అయితే 1981 అక్టోబర్ 7న దసరా కానుకగా వచ్చిన ‘కొండవీటి సింహం’ చిత్రం యాభై రోజులకే కోటిన్నర వసూలు చేసింది. తరువాత మరో కోటి రూపాయలు పోగేసింది. అలా వసూళ్ళలో ‘ప్రేమాభిషేకం’ టోటల్ రన్ లో సాధించిన మొత్తాన్ని కేవలం కొద్ది రోజుల్లోనే ‘కొండవీటి సింహం’ పోగేయగలిగింది. అయితే, ఇవేవీ పట్టించుకోని అభిమానులు మాత్రం అన్ని సిల్వర్ జూబ్లీస్, ఇన్ని గోల్డెన్ జూబ్లీస్ కావాలని ఆరాటపడ్డారు. ‘కొండవీటి సింహం’ 15 కేంద్రాలలోనే రజతోత్సవం జరుపుకుంది. కానీ, వసూళ్లు మాత్రం భలేగా రాబట్టింది. అప్పటి నుంచే ఓ సినిమా సక్సెస్ కు రన్నింగ్ కంటే ఆ చిత్రం సాధించే వసూళ్ళే ప్రామాణికంగా మారాయి. అంతకు ముందు అమాయకపు అభిమానులు వంద రోజులు ఆడితేనే విజయం సాధించినట్టుగా భావించేవారు. నిజానికి ఓ సినిమాకు పెట్టిన పెట్టుబడి, వచ్చిన రాబడినే బేరీజు వేసుకోవాలని యన్టీఆర్ అభిమానులకు పలుమార్లు బోధ చేశారు. ఆయన చెప్పిన మాటే వేదవాక్కుగా ఈ రోజున అందరూ రన్నింగ్ కంటే కలెక్షన్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ఏది ఏమైనా ‘ప్రేమాభిషేకం’ చిత్రాన్ని యన్టీఆర్ కూ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆయన ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని చెప్పారు. ”ప్రేమాభిషేకం’ శతదినోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరయిన యన్టీఆర్ ఈ విషయాన్ని అందరి ముందు గుర్తు చేశారు. ఈ సినిమా విజయోత్సవాలలో యన్టీఆర్ కూడా రెండు సార్లు పాల్గొని సోదరుడు అక్కినేనిని అభినందించిన తీరును ఇప్పటికీ ఇరువురి అభిమానులూ గుర్తు చేసుకుంటారు.
ఏది ఏమైనా,’ప్రేమాభిషేకం’ చిత్రం విషాదాంత ప్రేమకథల్లో ఓ మరపురానిదిగా మిగిలింది. అలాగే అక్కినేని అభినయపర్వంలో ఓ ప్రత్యేక అధ్యాయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత ఏయన్నార్ కు మళ్ళీ ఇంతటి విజయం లభించలేదు. ఆపైన ఆయన కూడా తన వయసుకు తగ్గ పాత్రలకు మరలిపోయారు. కేరెక్టర్ యాక్టర్ గానూ రాణించారు.