అమర రాజా లాభం రూ.189 కోట్లు

am

అమర రాజా బ్యాటరీస్‌.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం ఏకంగా 36 శాతం వృద్ధి చెంది రూ.189 కోట్లుగా నమోదైంది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నికర లాభం రూ.137 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,581 కోట్ల నుంచి రూ.2,103 కోట్లకు పెరిగింది. మార్చి త్రైమాసికంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ అన్ని వ్యాపార విభాగాల్లో అమ్మకాలు గణనీయంగా పెరగటం ఎంతగానో కలిసివచ్చిందని అమర రాజా బ్యాటరీస్‌ వైస్‌ చైర్మన్‌, ఎండీ జయదేవ్‌ గల్లా అన్నారు. కాగా మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.7,150 కోట్ల ఆదాయంపై రూ.647 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.6 తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.
కొవిడ్‌ రెండో దశ కారణంగా విధించిన లాక్‌డౌన్లతో ఉత్పత్తికి అనుకోని విఘాతం ఏర్పడిందని, అయితే అన్ని మార్కెట్లలో కంపెనీ ఉత్పత్తులు ఉండేలా చర్యలు తీసుకోవటమే కాకుండా సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా సమీప భవిష్యత్తులో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయనే అంచనాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జయదేవ్‌ తెలిపారు. రెండో దశ కొవిడ కారణంగా స్వల్పకాలంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఎనర్జీ స్టోరేజ్‌, మొబిలిటీ ఎనర్జీ అప్లికేషన్‌, అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ వంటి వాటిపై ప్రధానంగా కంపెనీ దృష్టి సారించనుందన్నారు.

Share: