కృష్ణా జిల్లా జాతీయవాదుల సభ – పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

G

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య జీవిత చరిత్ర ‘ నా జీవన నౌక’ నుంచి ప్రతి నెల ఓ అధ్యాయాన్ని ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. దేశహితం కోరే ఆయన దేశ శ్రేయస్సు కోసం అవిరళ కృషి చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఆయన ప్రతీ ఆలోచన, ప్రతీ అడుగు భరతమాత కోసమే. బ్రహ్మయ్య జీవితం నేటి యువతకు చక్కని స్ఫూర్తి కాగలదన్న ఉద్దేశంతో ఆయన స్వీయకథను ఒక్కో అధ్యాయంగా ప్రచురిస్తున్నాం.
—————–

1920 ఆగస్టు ఒకటవ తేదీన బెజవాడలో శ్రీ మాడపాటి వెంకటేశ్వరరావు టౌన్ హాలులో కృష్ణా జిల్లా జాతీయవాదుల సభ జరిగింది. నేటి పశ్చిమ గోదావరి జిల్లా ఆనాటి కృష్ణా జిల్లాలోనే కలిసి ఉండేది. ప్రజాప్రతినిధిగా నేను సభకు హాజరయ్యాను.

మేమందరం హాలులో సమావేశమయ్యే సరికి భారత రాజకీయ రథ చోదకుడు, పరమ పూజ్యుడు, భారత ప్రజల ఆశాజ్యోతి అయిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అస్తమించినట్టు పత్రిక ద్వారా తెలుసుకొని, నిస్పృహ, నిరుత్సాహపూరిత హృదయాలతో సభను మరుసటికి వాయిదా వేసుకుని దుఃఖాశ్రువులతో అక్కడి నుంచి నిష్కృమించాము.

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ గారు తమ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి నిర్ణయించిన తేదీ కూడా ఆగస్టు ఒకటే, గాంధీగారు తిలక్‌గారి స్థానే ప్రధాన నాయకుడవుతాడనే అభిప్రాయం ఆనాటికి ప్రజలలో లేదు.

1920లో జరిగే మద్రాసు చట్టసభకు అభ్యర్థులను నిర్ణయించడానికై ఆ సమావేశం జరిగింది. బారిష్టర్ కందుల వీరరాఘవస్వామి నాయుడు గారు ఆ సభకు అధ్యక్షత వహించారు. వారి ముఖ్య సలహాదారు బులుసు సాంబమూర్తిగారు, బారిష్టరు టంగుటూరి ప్రకాశం పంతులుగారు కూడా ఆ సభకు హాజరయ్యారు.

ఆ నాడు వీరందరు సిల్కు సూట్లలో ఉన్నారు. అప్పటికి ఖద్దరు ఇంకా జాతీయ దుస్తులుగా మారలేదు. ఆనాటి జాతీయవాదుల వస్త్రధారణ స్వదేశీ మిల్లు వస్త్రాలతో కూడినదే.

కృష్ణా జిల్లాకు చెందిన అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు, కానూరి వెంకటా చలపతయ్య, గంపలగూడెం కుమార రాజా, పింగళి లక్ష్మీనారాయణగార్లు ప్రధాన వక్తలుగా వున్నారు.

మోచర్ల రామచంద్రరావు పంతులుగారు

1906కు పూర్వమే ‘ఆంధ్ర భీష్మ’ న్యాపతి సుబ్బారావు పంతులు, బయ్యా నరసింహేశ్వరశర్మ, మోచర్ల రామచంద్రరావు పంతులు గారలు ఆంధ్ర నాయకత్రయంగా అఖిల భారత వర్గంలో ప్రసిద్ధిగన్నవారు.

కేంద్ర, రాష్ట్ర (ఢిల్లీ, మద్రాసు) శసనసభల చర్చలలో చురుకుగా పాల్గొంటూ అనేక అంకెలను క్రోడీకరిస్తూ, ప్రభుత్వ వాదనలను ఖండిస్తూ రైతు సమస్యలకు ప్రాముఖ్యతనిస్తూ-ఆంధ్ర ప్రజల ప్రశంసలను శ్రీ రామచంద్రరావు పంతులు అందుకున్నారు. ఈయన శాంతమూర్తి, నిరాడంబరులు. చిన్నవాళ్లను సయితం చాలా ఆప్యాయతతో ప్రేమతో గౌరవించి సంభాషించే సౌమ్యుడు.

వీరు దక్షిణ దేశ గోఖలేగా ప్రతిష్ఠనార్జించుకున్నారు. రైతు సమస్యలను కూలంకషంగా చర్చించడం చేత ‘రైతు బాంధవుడు’గా ప్రజలు గౌరవించారు. 1920 నాటికి ఈయన కాంగ్రెసులో మితవాద శ్రేణికి చెందినవారు. ఈనాటికి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు 1927 నాటికి పూర్వం స్థానిక సంస్థల వ్యవహారాలలో కృష్ణా జిల్లాగా పరిగణించబడేవి. ఆనాటి కృష్ణా జిల్లా బోర్డుకు ప్రథమ ప్రజాప్రతినిధి అయిన అదృష్టవంతుడు వీరే. ఆనాటి మదరాసు ప్రభుత్వం, ఈయనను ఒక రాయబార వర్గంలో సభ్యునిగా ఇంగ్లండుకు పంపి, మూడు మీటింగులకు హాజరు కాలేదనే నెపంతో ఆ ప్రభుత్వమే ఈయన సభ్యత్వాన్ని రద్దు చేసి తిక్కాజి బాలాజీరావు నాయుడుగారిని ఈయన స్థానే అధ్యక్షునిగా నియమించింది. కాంగ్రెస్ కార్యకలాపాలలో ఈయన మితవాదే అయినా ప్రభుత్వం వీరి విమర్శల్ని హర్షించక ఈయనను బాధ్యతగల పదవుల నుంచి తప్పించడానికి ప్రయత్నించేదనడానికి ఇది నిదర్శనం.

1920 సవంత్సరపు చట్టసభ అభ్యర్థుల ఎన్నికలకు ప్రచారం ప్రారంభమైనది. మోచర్ల రామచంద్రరావు పంతులుగారు తాము అభ్యర్థిగా నిలుస్తున్నట్టు ఓట్లు ఇప్పించవలసినదిగా నాకు ఉత్తరం రాశారు. దానికి సమాధానంగా మాంటుఫర్డు సంస్కరణలను గురించి కాంగ్రెసు తీర్మానం, దానికి భిన్నంగా మితవాదుల తీర్మానం-ఈ పరిస్థితుల్లో మీ భావాలేమిటో విశదపరచవలసినదిగా ఉత్తరం రాశాను. మా ప్రాంతానికి వచ్చినపుడు నన్ను కలుసుకుని నా సందేహాలు తీర్చగలమని వారు సమాధానం రాశారు.

పింగళి వెంకయ్య

వారు దివితాలూకా పర్యటనకు వచ్చినప్పుడు పింగళి వెంకయ్యగారిని, నన్ను చల్లపల్లికి పిలుచుకు రావలసినదిగా ఘంటసాలకు పంపారు.

మాకు నాలుగు మైళ్ల దూరంలో వున్న యార్లగడ్డ కరణం హనుమంతరావు గారి కుమారుడు ఈ వెంకయ్యగారు. వీరు అతివాదులలో ఒకరు. 1916లో భారతదేశానికి ప్రత్యేకంగా ఒక జెండా ఆవశ్యకత గురించి పుస్తకం వ్రాసి ప్రచురించారు. (A National Flag of India) ఈ విషయమై 1917లో కలకత్తాలో శ్రీమతి అనిబిసెంటుగారి అధ్యక్షతన జరిగిన సభలో ఉపన్యసించారు.

వారితో కలిసి చల్లపల్లి వెళ్లి రామచంద్రరావుగారికి నమస్కరించాను. వారు నన్ను చూసి వెంకయ్యగారితో బ్రహ్మయ్యగారు ఏరి? అని అడిగారు. ‘‘వీరే బ్రహ్మయ్యగారు’’ అని నన్ను చూసి పరిచయం చేశారు వెంకయ్యగారు. ‘‘మీ వూళ్లో మరొక బ్రహ్మయ్య గారున్నారా?’’ అన్నారు. అందుకు నేను నవ్వి ‘‘మీకు ఉత్తరం వ్రాసింది. సమాధానం అందుకున్నది నేనే. రాజకీయాలలో మరొక బ్రహ్మయ్య లేడు’’ అన్నాను. అప్పుడు వారు ‘‘మీరు అన్యదా భావించవద్దు. నా ఉత్తరానికి మీరు వ్రాసిన సమాధానాన్ని నేను శ్రద్ధగా చదువుకున్నాను. ఈ ఉత్తరాన్నిబట్టి మీకు ముప్పయి, ముప్పయి అయిదేండ్ల వయసు వుంటుందని అంచనా వేశాను. మీరు ఇత చిన్నవారని నేను అనుకోలేదు’’ అని ఆప్యాయతతో సంభాషణ సాగించారు.

కొంతసేపయిన తర్వాత వారిని మా వూరుకు రమ్మనమని ఆహ్వానించాను. వారితో బందరు తాలూకాబోర్డు అధ్యక్షులు శెజింబి హనుమంతరావు పంతులుగారు కూడా ఉన్నారు. అది వర్షాకాలం. మా ఊరికి మట్టి రోడ్డు కూడా లేదు. బళ్లు రావడానికి కూడా సరయిన సౌకర్యం లేదు. వారు వస్తామని నిర్ణయించిన రోజున రెండు మేనాలు పంపాను. ఎదురేగి వారికి స్వాగతం ఇచ్చాను. మూడువేల మంది చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా సభకు హాజరయ్యేట్టు చేశాను. స్వాగత పత్రం సమర్పించి చాలా గౌరవించాను.

మా ఊరికి చప్టా

తర్వాత మా స్వాగత సన్మానాలకు ఆనందం వెల్లడిస్తూ, తాను జిల్లాబోర్డు అధ్యక్షులైన కారణం చేత మా వూరికి కావాలసిన సౌకర్యాల గురించి నన్ను ప్రశ్నించారు. మా వూరికి తూర్పున గంజికాలువకు సత్తులు దిబ్బ వద్ద ఒక చప్టా కట్టించవలసినదిగా మా నాయనగారు డిప్యూటీ కలెక్టరుకు పెట్టిన మహజర్ అర్జి నాకు గుర్తుకు వచ్చింది. వెంటనే వారికి ఆ చప్టా నిర్మాణాన్ని గురించి అడిగాను. ‘‘అందుకు అయ్యే ఖర్చులో సగం వంతు మీరు ఇవ్వగలరా’’ అని వారన్నారు. నాలుగవ వంతు ఇవ్వగలమని నేను చెప్పాను. అప్పటికప్పుడే వారు వెంటనున్న అసిస్టెంటు ఇంజనీరు తంగిరాల సూర్యనారాయణగారిని పిలిచి సుమారు ఎంతవుతుందన్నారు. ఆరు వేలు కావచ్చని వారు చెప్పారు. సరే, 1,500 రూపాయలు మీరు కట్టండి, జిల్లా బోర్డు తరపున ఆ చప్టా వేయిస్తామని వారు అన్నారు. కంట్రిబ్యూషన్ కట్టి పనులు చేయించుకోవడం అదివరలో మా గ్రామానికి అలవాటు లేదు. మా గ్రామానికే కాదు, పల్లెటూళ్లకే లేదు. ఇదే ప్రథమం.

ఈ అవకాశం నా ద్వారా కలిగినందుకు నా సమయస్ఫూర్తికి మా వూరి పెద్దలు నన్ను మిక్కిలిగా ప్రశంసించారు. వెంటనే మా గ్రామస్థులకు చెందిన చిట్టూరు, బోళ్లపాడు భూములపై చందాలు వేసి జిల్లా బోర్డు ఆఫీసులో పైకం జమకట్టడం జరిగింది. చప్టాకు కావలసిన కొండరాయి, కంకర గ్రామస్థుల సొంత బళ్లతో తోలుకు వచ్చినందున వేరే కాంట్రాక్టరుతో నిమిత్తం లేకుండా గ్రామస్థులు ఈ చప్టాను సమష్టిగా నిర్మాణం చేయడానికి అంగీకారం కుదుర్చుకున్నాము. దీనిలో చైర్మన్ వెంకయ్యగారు, వారి తమ్ముడు గోపాలుడు, సుబ్బయ్య, లక్ష్మయ్యగార్లు నాకు హెచ్చుగా తోడ్పడినారు. గ్రామంలో అది వరకు కుర్రవానిగా చూడబడిన నేను కొంత దక్షత గల వ్యక్తిగా గుర్తింపబడ్డాను. నాకు పలుకుబడి పెరిగింది.

మరొక చప్టా గంజి కాలువమీద బోయీల కట్టవద్ద అక్కడ భూముల కలవారు నన్ను కోరడం, బందరు తాలూకా బోర్డు అధ్యక్షులగు శెడింబి హనుమంతరావు పంతులుగారితో నేను మాట్లాడి మూడవవంతు డబ్బును ఇచ్చి, రెండవ చప్టాను నిర్మించడం జరిగింది. ఇది కూడా కాంట్రాక్టరుతో నిమిత్తం లేకుండా ఆ భూములు గల రైతులు గొర్రెపాటి నరసన్నగారి కుమారుడు వెంకయ్య, రంగన్నగారి కుమారులు గోపాలకృష్ణయ్య, తలసిల బసవన్న, నా సహచరులు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, చిన నరసింహం మొదలయిన వారు బాధ్యత వహించి పనిచేశారు. ఇది 1923లో జరిగింది.

1920వ సంవత్సరములో మా గ్రామంలోని బోర్డు ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా లేదని, మా గ్రామపెద్దలు భావించి, నన్ను, పండిత గొర్రెపాటి వెంకట సుబ్బన్నగారిని ఉపాధ్యాయులుగా చేరమని ప్రోత్సహించారు. అప్పుడు బందరు దివి తాలూకాకు ఒకే తాలూకాబోర్డు, అధ్యక్షుడు శెడింబి హనుంతరావు పంతులుగారు, మేమిద్దరం ఉద్యోగాలకు దరఖాస్తులు పంపాము. మోచర్ల రామచంద్రరావు పంతులుగారితో కలిసి హనుమంతరావు పంతులుగారు నన్ను ‘‘మంచి ఆర్గనైజరు, అభివృద్ధికి రాగల సూచనలు గలవాడు’’ అని ప్రశంసించగా ‘‘ఆయన స్కూలు మాస్టరుకు దరఖాస్తు చేశాడు. నేను ఇవ్వాలనుకుంటున్నాను’’ అని హనుమంతరావుగారు చెప్పారు. ‘‘భవిష్యత్తులో అక్కరకొచ్చే కుర్రవాణ్ణి ఉపాధ్యాయ వృత్తిలో పెట్టి పైకి రాకుండా చెగడొట్టడం అవుతుందని’’ పింగళి వెంకయ్యగారన్నారు.

వారికి వడ్డన చేస్తున్న ఉపాధ్యాయులు ఈ విషయమంతా విపులంగా మాతో చెప్పారు. నేను, పండిత వెంకట సుబ్బయ్య బాగా ఆలోచించుకుని ఈ ఉపాధ్యాయ వృత్తిలో చేరడం మంచిది కాదని నిర్ణయానికి వెంటనే వచ్చాము.

రామచంద్రరావు పంతులుగారితో మా గ్రామ చప్టాను గురించి సంభాషణ జరుపుతున్నప్పుడే హనుమంతరావు పంతులుగారు ‘‘నీవు స్కూలు మాస్టరుకు దరఖాస్తు చేశావు కదా-నీకివ్వ నిశ్చయించుకున్నాను. ఎప్పుడు చేరతావు?’’ అని అడిగారు. అప్పుడు నేను మా స్కూలు పరిస్థితులు వారికి వివరించి, స్కూలు మాస్టారుగా చేరకుండా వుండడానికే వచ్చిన నా నిర్ణయాన్ని తెలుపుతూ సరయిన ఉపాధ్యాయులను నియమించి స్కూలు పరిస్థితులను చక్కదిద్దవలసిందిగా అర్థించాను. అట్లుగా వారు చేరారు.

వల్లూరి సూర్యనారాయణగారు

ఈయన మొదట ఉపాధ్యాయవృత్తిలో వుండి తరువాత ప్లీడరీవృత్తికి మారినారు. చాలా నిరుపేద కుటుంబంలో వుండి, ఈయన స్వయంకృషివల్ల ఉన్నత స్థితికి వచ్చిన ప్రముఖుడు. మహా సమర్థుడైన న్యాయవాది. ఆయన వృత్తి ప్రారంభించిన నాటి నుంచి న్యాయ నిర్ణయానికే కంకణధారియై న్యాయాధిపతులను సయితం లెక్కపెట్టకుండా విమర్శించేవారు. ధర్మసంస్థల సంబంధంలో ఉచితంగానే వాదన చేసేశారు. మా ఘంటసాల ధర్మగోటక వ్యాజ్యం ప్రారంభమయ్యేనాటికి ఆయన ప్రాక్టీసు ప్రారంభ దశలోనే ఉన్నది. చాలాకాలం ఆయన చాలా కష్టపడి కేసులో జయం పొందడానికి సర్వశక్తులను వినియోగించారు. అప్పుడు మా నాయనగారు ఫీజును గురించి అడుగగా ‘‘అప్పుడు నేను చిన్న ప్లీడర్ని. ఇప్పుడు పెద్ద ప్లీడర్ని అయ్యాను. నా రాబడి కూడా చాలా పెరిగింది. మీరేమీ ఇవ్వనక్కర్లేదు. మీరూ ఈ ధర్మకార్య నిర్వహణకు చాలా కష్టనష్టాలు పడ్డారని నాకు తెలుసు’’ అని చెప్పారు. కానీ ఏదో కొంత చిన్నమొత్తమైనా తీసుకోవలసిందిగా కోరి వంద రూపాయలను బలవంతాన ఇవ్వడం జరిగింది.

ధనార్జన ఎక్కువైనా ఆయన కుటుంబ ఖర్చులు, సొంత ఖర్చులు చాలా మితంగా వుండేవి. గుర్రపు బండి ఎక్కువ ఖర్చు అవుతుందని, మనిషి లాగే రిక్షా పెట్టుకున్నారు. అదే బందరులోని మొదటి రిక్షా, మేము ప్రతి రోజూ నోబుల్ హైస్కూలుకు వెళ్లేది. వారింటి ముందు నుంచే అవడం చేత ప్రతినిత్యం వారి దర్శనభాగ్యం మాకు సిద్ధించేది ఈయన లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌ను తన రాజకీయ గురువుగా పరిగణించి, ఆయన అడుగు జాడలలో నడిచేవారు. ఈయన సూరత్ కాంగ్రెసులో తిలక్ గారి అతివాద శిబిరంలోనే వున్నారు. ‘కృష్ణాపత్రిక’ నిర్వహణలోను, ‘ఆంధ్ర జాతీయ కళాశాల’ పరిపాలనలోను తూర్పు కృష్ణా జిల్లా కాంగ్రెసు నిర్వహణలోను వారు గుప్తంగా దానాలు చేసేవారు. ప్రథమంలో కాంగ్రెసు ప్రచారకుని నెలకు యాభై రూపాయల వేతనం మీద నియమించడానికి ఈయన ఆర్థిక సహాయం చేశారు. ఈయన నిర్మొహమాటంగా ఏ విషయం మీద అయినా సరే తన భావాలను వెల్లడించేవారు.

ఒకప్పుడు ఒక డిప్యూటీ మేజిస్ట్రేటును గురించి లంచగొండితనం ఆరోపించబడ్డ ‘అఫిడవిట్టును’ దాఖలు చేయడానికి ఎవ్వరు ముందుకు రానప్పుడు, ఈయన దాఖలు చేసి కొన్ని కష్టనష్టాలకు లోనయ్యారు. ఈయన మీద పెట్టబడిన కేసు ఈయనకు అనుకూలంగానే తీర్పు చెప్పబడింది.

డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు అంటూ వుండేవారు. ‘‘నేను ఎవరికీ జడవను-ఒక్క వల్లూరి సూర్యనారాయణగారికే జడుస్తాను. ఏదైనా లోపం నాలో వుందని ఆయన తలిస్తే నా ముఖం ఎదుటే నా సమాధానాన్ని కోరతాడు. ఆయన్నెప్పుడు దృష్టిలో వుంచుకొని మాట్లాడతాను’’

ఈయన దేవాలయ, ధర్మాదాయ సంస్థలకు సంబంధించిన వ్యవహారాలను ఏమీ డబ్బు పుచ్చుకొనకుండానే ఉచితంగా వాదన చేసేవారు. అట్టి సంస్థ గురించి న్యాయం కోసం వేసే దావాలకు ఆర్థిక సహాయం కూడా చేసేవారు. దేవాలయ, ధర్మాదాయ బిల్లు నిర్మాణానికి ఈయన కృషి చాలా అమూల్యమైనట్టిది. మహాత్ముని కోర్టుల బహిష్కరణకు ఈయన వ్యతిరేకి. ఈయన చెప్పిన కారణం ‘‘ఈ ధర్మాలయ సంస్థలకు నాబోటి న్యాయవాది అవసరం’’.

తన వృద్ధాప్యంలో తన కుమాళ్లను పిలిచి ‘‘నా తండ్రి నాకు చెప్పించిన విద్యకంటే నేను మీకు విద్యాబుద్ధులు చెప్పించడంలో, మంచి సంబంధాలను తీసుకురావడంలో మంచి ఉద్యోగాలలో మిమ్మల్ని నిలపడంలో హెచ్చు శ్రమపడ్డాను. మీరు ఉన్నతమైన స్థితిలోనే నేడు ఉన్నారు. నా తండ్రి నాకేమి ఆస్తి ఇవ్వలేదు. నా ఆస్తిని కూడా మీరు ఆశించడం న్యాయం కాదు. నాకువున్న యావదాస్తినీ (ఆ రోజులలో లక్ష రూపాయల విలువగలదాన్ని) కొవ్వూరులోని ‘‘ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠానికి దానం చేస్తున్నాను మీరు ఆనందించండి’’ అని చెప్పారు.

కొవ్వూరులోని తాను నివసించడానికి నిర్మించుకున్న డాబాలో, తాను తన భార్య నివసించి వున్నంతకాలం తన బిడ్డలు వచ్చి వుండవచ్చునని, తమ ఇరువురి అనంతరం ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠానికి చెందేటట్లు విల్లు వ్రాశారు. అది చెల్లుబడి అయింది. ఆయన జ్యేష్ట కుమారుడు చిన్నతనంలోనే చనిపోవడం తటస్థించింది. ఆయన కోడల్ని పిలిచి, ‘‘నీవు పునర్వివాహం చేసుకోవడానికి నేను అనుమతిస్తున్నాను. చేసుకోవలసింద’’ని కోరగా ఆవిడ అందుకు అంగీకరిచలేదు. ఈ కారణాన ఆవిడకు బి.ఎ.ఎల్.టి. వరకు చదువు చెప్పించి, ఉపాధ్యాయవృత్తిలో పెట్టి తన ధర్మం నెరవేర్చుకున్నారు.

ఆయన ధనాన్ని రెండు చేతులతో ఆర్జిస్తూ ధర్మ సంస్థల నిర్వహణను అసిధారా వ్రతంగా పాలిస్తూ, దేశాన్ని ప్రేమిస్తూ, జాతీయ సంస్థలకు భూరి విరాళాలను ఇస్తూ స్వరాజ్య సంరంభానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహాయం చేస్తూ ఆదర్శప్రాయుడైన వ్యక్తిగా ప్రశంసింపబడ్డారు.

ఈ వల్లూరి సూర్యనారాయణరావుగారు కాంగ్రెసు ఆదేశానుసారం, ‘‘తిలక్ స్వరాజ్య నిధి’’ వసూళ్లకు వేమూరి రామచంద్రరావుగారితో మా గ్రామం వచ్చారు. ఆనాడే మా జమీందారుకు వ్యతిరేకంగా తాను వ్యవహరించి ధర్మసొత్తుగా నిలిపిన గోటకాన్ని వెళ్లి చూచి దాన్ని పొరుగు రైతులు ఆక్రమించుకొనకుండా జమీందారు మళ్లీ దీని ఆక్రమణకు పునఃప్రయత్నాలు చేయకుండా ఒక సంస్థ నిర్మాణం అవసరమని భావించి, ఘంటసాల ప్రజలందరిని బహిరంగంగా సమావేశపరచి ఘంటసాలలో గోటక సంఘ నిర్మాణం చేశారు. దీని ప్రథమాధ్యక్షుడు గొర్రెపాటి గోపాలకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి వానపాముల లక్ష్మీనారాయణగార్లు తర్వాత ఈ సంఘానికి నేను కార్యదర్శిగా, అధ్యక్షుడుగా వ్యవహరించాను.

చల్లపల్లి ఎస్టేట్ దివాన్ ధర్మగోటకాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించడంలో మా గ్రామ పెద్దలను తీసుకొని నేను కొవ్వూరు వెళ్లి సూర్యనారాయణ పంతులుగారి అతిథిగా వుండి వారి సలహా సంప్రతింపులను పొందాను.

Share: