నిర్మాత కోవెలముడి కృష్ణమోహనరావు ఇకలేరు!

km

ప్రముఖ నిర్మాత, ఆర్.కె.అసోసియేట్స్ అధినేత కోవెలముడి కృష్ణ మోహనరావు మార్చి 24న కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు స్వయానా అన్న కృష్ణమోహనరావు. వీరి తండ్రి సుప్రసిద్ధ దర్శకులు, నిర్మాత, నటులు కె.ఎస్.ప్రకాశరావు…. కృష్ణమోహనరావు, రాఘవేంద్రరావు సొంత అన్నదమ్ములే అయినా, స్నేహితుల్లా మసలేవారు. పట్టా పుచ్చుకోగానే రాఘవేంద్రరావు తన తండ్రి దర్శకత్వంలో రూపొందిన చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు. తరువాత కమలాకర కామేశ్వరరావు, వి.మధుసూదనరావు వంటి దర్శకుల వద్ద కూడా రాఘవేంద్రరావు అసోసియేట్ గా ఉన్నారు. అయితే కృస్ణమోహనరావు మాత్రం తన తండ్రి నిర్మించే చిత్రాలకు నిర్మాణవ్యవహారాలు చూసుకొనేవారు. తరువాత తమ్ముడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘భలేకృష్ణుడు’ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు కృష్ణమోహనరావు. తండ్రి కె.ఎస్. ప్రకాశరావు తెరకెక్కించిన ‘కొత్తనీరు’ చిత్రానికి కూడా కృష్ణ మోహనరావు భాగస్వామి.

అన్నదమ్ముల జైత్రయాత్ర

కృష్ణమోహనరావు, తమ్ముడు రాఘవేంద్రరావుతో కలసి ఆర్.కె. అసోసియేట్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు. అందులో ఆర్ అంటే రాఘవేంద్రరావు, కె అంటే కృష్ణమోహనరావు. ఈ బ్యానర్ పై రూపొందిన మొదటి చిత్రం ‘అపూర్వ సహోదరులు’. బాలకృష్ణకు ఇదే తొలి ద్విపాత్రాభినయ చిత్రం కావడం విశేషం. ఈ తొలి చిత్రం వసూళ్ళ వర్షం కురిపించింది. తరువాత చిరంజీవితో ‘యుద్ధభూమి’ తెరకెక్కించారు కోవెలముడి సోదరులు. ఆపై మోహన్ బాబు హీరోగా ‘అల్లరి మొగుడు’ నిర్మించారు. ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలచింది. అంతేకాదు, పోటీ చిత్రాలను పక్కకు నెట్టి హిట్ మూవీగా జేజేలు అందుకుంది. ఈ సినిమా తరువాత రాఘవేంద్రరావు, కృష్ణమోహనరావు సోదరులు రాజశేఖర్ హీరోగా ‘అల్లరి ప్రియుడు’ తెరకెక్కించారు. ఈ మూవీ కూడా మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాదు, రాజశేఖర్ కు ఉన్న యాంగ్రీ మేన్ ఇమేజ్ ను చెరిపేసింది. రాజశేఖర్ ను సరికొత్తగా చూపించింది. ఈ రెండు చిత్రాల ఘనవిజయంతో ఆర్.కె. ఫిలిమ్ అసోసియేట్స్ బ్యానర్ పేరు మారుమోగింది. వెంకటేశ్ హీరోగా ‘ముద్దుల ప్రియుడు’, నాగార్జునతో ‘ఘరానాబుల్లోడు’ చిత్రాలను నిర్మించీ అలరించారు కృష్ణమోహనరావు. అంతకు ముందు నాగార్జున హీరోగా చిన్న తమ్ముడు కె.ఎస్.ప్రకాశ్ నిర్మించిన చిత్రానికీ కృష్ణమోహనరావు నిర్మాణబాధ్యతలు నిర్వర్తించారు.
ఈ సినిమాల తరువాత రాఘవేంద్రరావు తన మిత్రులతో కలసి నిర్మించిన ‘పెళ్ళిసందడి’ ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం తరువాత అదే పంథాలో తమ సొంత బేనర్ లో జె.డి.చక్రవర్తి, రంభ జంటగా రాఘవేంద్రరావు, తన అన్న కృష్ణమోహనరావుతో కలసి ‘బొంబాయి ప్రియుడు’ నిర్మించారు. ఈ సినిమా కూడా పాటలలో సందడి చేసింది. ఆ తరువాత చిరంజీవి, సాక్షి శివానంద్ తో ‘ఇద్దరు మిత్రులు’ తెరకెక్కించారు.

సినీప్రముఖుల సంతాపం!

మహేశ్ బాబు హీరోగా రాఘవేంద్రరావు సమర్పణలో శోభన్ దర్శకత్వంలో కృష్ణమోహనరావు ‘బాబీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తన సోదరుని తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో ‘బొమ్మలాట’ చిత్రాన్ని గుణ్ణం గంగరాజుతో కలసి నిర్మించారు. ఈ సినిమాకు మంచి పేరు లభించింది. తరువాత బాలకృష్ణ హీరోగా తమ్ముడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పాండురంగడు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలోని పాటలు కూడా అలరించాయి. కానీ, చిత్రం అంతగా మురిపించలేకపోయింది. తాజాగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ‘పెళ్ళిసందడి’ చిత్రానికి కృష్ణమోహనరావు సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మరణవార్త విని పలువురు సినీప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందరికీ సన్నిహితునిగా ఉంటూ ఆప్యాయంగా పలకరించే కృష్ణమోహనరావు ఇక లేరన్న వార్తను చాలామంది జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు పలువురు చిత్రప్రముఖులు.

km1

Share: