నిర్లక్ష్యానికి నిలువుటద్దం!

MD

నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు దేశ ప్రజలకు అర్థమవుతోంది. దేశం నుంచి కరోనా మహమ్మారిని దాదాపు వెళ్లగొట్టామని, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచామని సంబరాలు చేసుకుంటున్న తరుణంలో వైరస్ మరోమారు చెలరేగిపోతోంది. మునుపటిలానే మళ్లీ యథేచ్ఛగా చెలరేగిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై సహా దేశవ్యాప్తంగా కరోనా భూతం రెండోసారి జడలు విప్పుతోంది. ఫలితంగా ప్రభుత్వాలు మరోమారు కన్నెర్ర చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

మహమ్మారి పీడ ఇంకా పూర్తిగా విరగడవలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలంటూ ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలు, సూచనలను ప్రజలు బేఖాతరు చేస్తుండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ప్రజలు ఎంత చెప్పినా వినడం లేదని, కాబట్టి సంపూర్ణ లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరస్ విషయంలో ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఉదాహరణ. రేపో, మాపో అక్కడ లాక్‌డౌన్ ప్రకటించే అవకాశం ఉంది.

ఇక, గతంలోలానే పలు రాష్ట్రాల్లో ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించకుంటే మరోమారు ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రజలు అప్రమత్తవుతారని ఆశిద్దాం.

వ్యాక్సిన్ విషయంలో అయోమయం
మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అర్హులైన వారికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను వేస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. త్వరలో 45 ఏళ్లు పైబడిన అందరికీ టీకా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా వైరస్ సోకుతుండడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, అక్కడక్కడ మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయితే, ఈ మరణాలకు వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంలో విఫలమవుతోంది. దీంతో టీకా వేయించుకోవాలా? వద్దా? అన్న డోలాయమానంలో ప్రజలు చిక్కుకున్నారు.

గంగలో ఏపీ భవిష్యత్

ఇక ఏపీలో ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాయి. ముఖ్యంగా తమ కోసం, తమ బాగు కోసం రాజకీయ పార్టీలు పోరాటాలు చేయడం వల్ల లేశమాత్రమైనా ప్రయోజనం లేదని, ఇప్పుడున్న బతుకులతోనే సరిపెట్టుకుంటామని స్పష్టంగా చెప్పేశారు. తమ పిల్లల భవిష్యత్ ఏమైపోతే తమకెందుకన్న రీతిలో వ్యవహరించారు. కాళ్ల వద్దకు వస్తున్న ఉచిత పథకాలకు అలవాటు పడి భవిష్యత్తును పణంగా పెట్టేశారు. విశాఖ ఉక్కు తరలిపోతే మాకేంటి? అమరావతి నాశనమైతే మాకొచ్చే ఇబ్బంది ఏంటి? అన్నట్టుగా ఆలోచించి భావోద్వేగాలను గంగలో కలిపేశారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పేరుకే రాష్ట్రం. ప్రజలెప్పుడో ప్రాంతాల వారీగా విడిపోయారు. అయితే, ఈ విషయంలో ప్రజలను తప్పుబట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అలాగని తమ స్వప్రయోజనాల కోసం ప్రజలను ఎగరడం మానేసిన పక్షుల్లా తయారు చేస్తున్న రాజకీయ నాయకులనూ నిందించలేం. ఇక్కడ ఎవరి వలలో ఎవరు చిక్కుకుంటున్నారన్నదే ప్రశ్న. ఆ ప్రశ్నకు సరైన సమాధానం దొరికే వరకు ఏపీ పరిస్థితి ఇలానే ఉంటుందనడం అతిశయోక్తి కాదేమో!

Share: