తెలుగు చిత్రపరిశ్రమలో మన సామాజిక వర్గానికి చెందిన సంగీత దర్శకులలో టాప్ చెయిర్ కొమ్మినేని అప్పారావు (చక్రవర్తి)కే దక్కుతుంది. అతి తక్కువ సమయంలో వందలాది చిత్రాలకు సంగీతం సమకూర్చిన ఘనత చక్రవర్తిది. అప్పట్లో టాప్ స్టార్స్ మొదలు అప్ కమింగ్ హీరోస్ దాకా చక్రవర్తి బాణీలతోనే జైత్రయాత్ర చేశారు. ఈ నాడు అగ్రకథానాయకులుగా వెలుగొందుతున్న వారందరికీ చక్రవర్తి స్వరాలే తొలిరోజుల్లో అపూర్వ విజయాలను అందించాయంటే అతిశయోక్తి కాదు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన కోడూరి కీరవాణి కూడా ‘గురువుకు తగ్గ శిష్యుడు’ అనిపించుకున్నారు.
కీరవాణి పేరు వెనుక…
కీరవాణి పేరు ఈ తరానికి ప్రత్యేకించి పరిచయం చేయవలసిన పనిలేదు. ప్రపంచం దశదిశలా విజయశంఖారావం పూరించిన ‘బాహుబలి’ సీరీస్ కీరవాణి స్వరకల్పనలోనే ప్రాణం పోసుకున్నాయి. అంతకు ముందు టాప్ స్టార్స్ అందరికీ మరపురాని మధురమైన సంగీతాన్ని అందించి, వారి అభినయానికి తన బాణీలు జోడించి, వారి చిత్రాలను విజయతీరాలకు చేర్చిన ఘనత కీరవాణి సొంతం. ఆయన ఇంటిపేరు కోడూరు. పూర్తి పేరు మరకతమణి కీరవాణి. ఆయన తండ్రి శివశక్తిదత్తకు లలితకళలంటే ప్రాణం. చిత్రలేఖనంలో విశేషమైన ప్రావీణ్యం ఉన్న శివశక్తిదత్తకు మహానటుడు యన్టీఆర్ నటించిన ‘మల్లీశ్వరి’ చిత్రంలోని పాటలంటే ఎంతో అభిమానం. ఆ చిత్ర సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు బాణీలన్నా ఆయనకు ఎంతో ప్రాణం. రాజేశ్వరరావు స్వరకల్పన చేసిన ‘విప్రనారాయణ’ చిత్రంలోని “ఎందుకోయి తోటమాలీ…” పాటను విని పరవశించి పోయారు శివశక్తిదత్త. తరువాత కొంతకాలానికి రాజేశ్వరరావును కలసి, ఆ పాటంటే తనకెంతో అభిమానమని చెప్పారు. ‘అది కీరవాణి రాగంలో చేసిన పాట’ అని రాజేశ్వరరావు చెప్పారు. తనకు సంతానం కలిగితే ‘కీరవాణి’ అని పేరు పెడతానని అన్నారు శివశక్తిదత్త. అది విని రాజేశ్వరరావు నవ్వి, ‘అమ్మాయయితే ‘కీరవాణి’ పేరు బాగుంటుంది. మరి అబ్బాయి పుడితేనో!?’ అని సందేహం వెలిబుచ్చారు. ఎవరు పుట్టినా సరే, ‘కీరవాణి’ అనే పేరు పెడతానని శివశక్తిదత్త చెప్పారు. చెప్పడమే కాదు తన తొలి సంతానంగా జన్మించిన అబ్బాయికి కీరవాణి అని పేరు పెట్టారు. ఆ కీరవాణియే నేడు చలనచిత్ర సంగీత ప్రపంచంలో తనదైన బాణీ పలికిస్తూ జైత్రయాత్ర చేస్తున్నారు.
పినతండ్రియే కారణం…
కీరవాణిరాగం పేరును తనయునికి ఏ ముహూర్తాన పెట్టారో శివశక్తిదత్త, మూడేళ్ళ ప్రాయంలోనే కీరవాణి ఇంట్లోని గ్లాసులపై పెన్సిల్ తో జలతరంగిణి వాయించేవారట! ఆ తరువాత నుంచీ ఏవో కూని రాగాలు తీయడం, అందుకు తగ్గట్టుగా దరువులు వేయడం చేసేవారట. కీరవాణిలోని సంగీతాభిలాష గమనించిన తండ్రి తనకున్న పరిజ్ఞానంతో తనయునికి కొన్ని సంగీత పాఠాలు నేర్పారు. ఆ పైన నిష్ణాతులైన గురువుల వద్ద తనయుడు సాధన చేసేలా చూశారు శివశక్తిదత్త. కీరవాణిలోని సంగీతాభిలాషను గమనించి, ఆయన పినతండ్రి డాక్టర్ కోడూరి రామకృష్ణ (శివశక్తిదత్త తమ్ముడు) ఎంతగానో ప్రోత్సహించారు. కీరవాణి వారి స్వస్థలం పశ్చిమ గోదావరి లోని కొవ్వూరు. వారిది ఉమ్మడి కుటుంబం. పెద్ద కుటుంబం కావడం వల్ల శివశక్తిదత్త అన్నదమ్ములందరూ కలసి కర్ణాటకలో గంగావతి క్యాంపులో వ్యవసాయం సాగించారు. ఆ రోజుల్లో బస్తా వడ్లు వంద రూపాయలు. డాక్టర్ రామకృష్ణ తన అన్నకొడుకు కీరవాణి కోసం 45 బస్తాలు అమ్మేసి, ఆ రోజుల్లోనే రూ.4500 పెట్టి ఓ పెద్ద టేప్ రికార్డర్ కొన్నారు. ఆ టేప్ రికార్డర్, అంతకుముందున్న టేప్ రికార్డర్ రెండింటితోనే కీరవాణి స్వరప్రయోగాలు చేసేవారట. ఇంటర్ పూర్తయ్యాక, ఇంజనీరింగ్ లో చేర్పించాలని ఇంట్లోని చాలామంది భావించినా, డాక్టర్ రామకృష్ణ ప్రోత్సాహంతోనే కీరవాణి సంగీతప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత సినిమా సంగీతంలో రాణించాలని, చక్రవర్తి వద్ద అసోసియేట్ గా చేరారు. ఆయన వద్ద మూడేళ్ళు పనిచేసిన తరువాత కీరవాణి సొంతగా బాణీలు కట్టాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. కృష్ణంరాజు సోదరుడు యు.సూర్యనారాయణరాజు తమ ‘కల్కి’ చిత్రం కోసం కీరవాణితో బాణీలు కట్టించారు. ఆ తరువాత ఎందుకనో, ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. రామోజీరావు నిర్మించిన ‘మనసు-మమత’ చిత్రంతో కీరవాణి సంగీత దర్శకునిగా జనం ముందు నిలిచారు. 1990 జూన్ 29న ‘మనసు-మమత’ చిత్రం విడుదలయింది.
రామోజీరావు చేతి చలువ…
రామోజీరావు తరువాత, కీరవాణికి నిర్మాత భోగవల్లి ప్రసాద్ తమ ‘దాగుడు మూతల దాంపత్యం’ చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం అందించారు. (తరువాతి రోజుల్లో ఈ భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ‘ఛత్రపతి’కి కూడా కీరవాణి స్వరరచన చేశారు. ప్రస్తుతం అందరూ ఆయనను ‘ఛత్రపతి’ ప్రసాద్ అని పిలుస్తున్నారు) ఆ తరువాత క్రాంతికుమార్ తాను తెరకెక్కించిన ‘సీతారామయ్యగారి మనవరాలు’కు స్వరకల్పన చేసేందుకు కీరవాణిని ఎంచుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో కీరవాణి పేరు సంగీతాభిమానులకు పరిచయమయింది. రామోజీరావు తమ “అమ్మ, పీపుల్స్ ఎన్ కౌంటర్, అశ్విని” చిత్రాలకు కూడా కీరవాణి సంగీతానికి అవకాశం కల్పించారు. ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ ‘క్షణ క్షణం’కు కూడా కీరవాణి స్వరరచన చేశారు. ఈ సినిమాతో కీరవాణి సంగీతానికి మరింత మంచి పేరు లభించింది. ఆపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘరానామొగుడు’ చిత్రానికి కీరవాణి స్వరకల్పన చేసిన బాణీలు విశేషాదరణ పొందాయి. ఇక కీరవాణి మరి వెనుదిరిగి చూసుకోలేదు. వందలాది చిత్రాలకు సంగీతం సమకూర్చి ఈ నాటికీ సంగీతప్రియులకు ఆనందం పంచుతూనే ఉన్నారు కీరవాణి.
యన్టీఆర్ పై వీరాభిమానం..
కీరవాణి ఇంట్లోని వారందరికీ మహానటుడు యన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. వారికి యన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించిన ‘శ్రీక్రిష్ణపాండవీయం’ అంటే మరింత అభిమానం. తన అభిమాన నటుడు యన్టీఆర్ చిత్రానికి స్వరకల్పన చేయాలన్నది కీరవాణి అభిలాష. ఆ కోరిక యన్టీఆర్ చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’తో తీరింది. ఈ చిత్రంలోని “పుణ్యభూమి నా దేశం…” పాట ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉండడం విశేషం. ఇక యన్టీఆర్ తనయుడు బాలకృష్ణ నటించిన పలు చిత్రాలకు కీరవాణి స్వరకల్పన చేశారు. వాటిలో ‘బొబ్బిలిసింహం’ ఘనవిజయం సాధించింది. యన్టీఆర్ బయోపిక్ గా బాలకృష్ణ నిర్మించి, నటించిన ‘కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాలకు కూడా కీరవాణి స్వరకల్పన చేయడం విశేషం. ఇక యన్టీఆర్ మరో తనయుడు హరికృష్ణ నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య’ చిత్రాలకు కూడా కీరవాణి సంగీతం సమకూర్చారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, తారకరామ్ (జూ.యన్టీఆర్) చిత్రాలకు కూడా కీరవాణి వినసొంపైన సంగీతం అందించారు. నందమూరి వంశం నుండే వచ్చిన తారకరత్న చిత్రాలకు కూడా కీరవాణి మంచి సంగీతం రూపొందించారు. ఇలా యన్టీఆర్ కుటుంబంలోని నటులకు కీరవాణి బాణీలు మ్యూజికల్ హిట్స్ అందించడం విశేషం.
అక్కినేని ప్యామిలీతో…
కీరవాణికి సంగీత దర్శకునిగా మంచి పేరు సంపాదించి పెట్టిన తొలి చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఆయన నటించిన పలు చిత్రాలకు కూడా కీరవాణి స్వరరచన చేశారు. ఏయన్నార్ నటవారసుడైన నాగార్జున నటించిన చిత్రాలకు సైతం కీరవాణి మరపురాని సంగీతం సమకూర్చారు. నాగార్జునతో కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘అన్నమయ్య’ చిత్రంతోనే కీరవాణికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు లభించడం మరపురాని అంశం.
కె.రాఘవేంద్రరావుతో అనుబంధం…
కీరవాణికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ స్టేటస్ సంపాదించి పెట్టిన ఘనత కె.రాఘవేంద్రరావుకే దక్కుతుంది. కె.రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రం ‘ఘరానామొగుడు’ ఆ సినిమా అద్భుత విజయం తరువాత, వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నెన్నో మ్యూజికల్ హిట్స్ రూపొందాయి. “అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, మేజర్ చంద్రకాంత్, ముద్దుల ప్రియుడు, పెళ్ళిసందడి, సాహసవీరుడు – సాగరకన్య, బొంబాయి ప్రియుడు, అన్నమయ్య, గంగోత్రి (రాఘవేంద్రరావు 100వ చిత్రం), శ్రీరామదాసు, పాండురంగడు, ఝుమ్మంది నాదం, శిరిడి సాయి” వంటి చిత్రాల్లోని పాటలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. వీటిలో అనేక చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
జయాపజయాలతో పనిలేదు…
కీరవాణి బాణీల్లో రూపొందిన చిత్రాలన్నీ విజయకేతనం ఎగురవేయక పోయి ఉండవచ్చు. ఆ యా చిత్రాలకు ఆయన స్వరకల్పనలో రూపొందిన పాటలు మాత్రం జనాన్ని ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అనేక మ్యూజికల్ హిట్స్ సమకూర్చిన కీరవాణి పాటల్లో ఆయన తండ్రి శివశక్తిదత్తకు ఎంతగానో నచ్చిన పాట – జగపతిబాబు హీరోగా రూపొందిన ‘అల్లుడుగారు వచ్చారు’ చిత్రంలోనిది. “మరుగేల…” అంటూ సాగే ఈ పాటను తాను వేలసార్లు వినిఉంటానని శివశక్తిదత్త చెబుతారు. కీరవాణి స్వరరచనలో ఎన్నెన్నో హిట్ సాంగ్స్ ఉన్నా, ఆయన తండ్రికి ఆ పాటనే ఎందుకు నచ్చిందంటే – అందులో ఎక్కడా హెచ్చుతగ్గులు లేకుండా కీరవాణి స్వరరచన చేశారని దత్త అంటారు. అంతేకాదు ఆ పాటకు కీ-బోర్డ్ లేకుండా, లైవ్ ఇన్ స్ట్రుమెంట్స్ తోనే స్వరాలు సమకూర్చడం మరింత విశేషం. ఇలా కీరవాణి పాటల్లో అభిమానులకు సైతం ఎన్నెన్నో మరపురాని గీతాలు ఉన్నాయి. కీరవాణి ఈ యేడాదితో మూడు పదుల స్వరప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన బాణీలతో రూపొందే పాటలను వినాలని సంగీతాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. తమిళనాట మరకతమణి పేరుతోనూ, బాలీవుడ్ లో క్రీమ్ పేరుతోనూ సంగీతం సమకూర్చారు. అక్కడా ఆయన అభిమానులు కీరవాణి కొత్త చిత్రాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కీరవాణి పినతండ్రి విజయేంద్ర ప్రసాద్ తనయుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పటి దాకా తాను రూపొందించిన అన్ని చిత్రాలకూ అన్న కీరవాణితోనే సంగీతం చేయించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో జూ.యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రానికి కూడా కీరవాణి స్వరకల్పన చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తితోనే అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రంలో కీరవాణి స్వరరచన ఏ తీరున అలరిస్తుందో చూద్దాం.