రాజకీయాలంటే ఇంతేనా!?

R11

ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారు సిగ్గు, శరం, లజ్జ అన్నిటినీ వీడాల్సిందే! అవి వీడిన వారే రాజకీయాల్లో రాణిస్తారు అని నమ్మినవారే అక్కడకు చేరుకుంటున్నారు. ఈ పరిస్థితి కూడా దాటిపోయింది. రాజకీయనాయకుల నోళ్ళ నుండి వెలువడే పదాలు, వారి చేష్టలు సభ్యసమాజం తలదించుకొనేలా చేస్తున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల ఆవిర్భావంతో ఆ మాటలు మరింత ఘాటుగా, రాజకీయ నాయకుల కుటుంబాల్లోని మహిళలను కూడా కించపరిచి, వారి మనోభావాలను దెబ్బతీసి, రాజకీయాలంటేనే జుగుప్స కలిగేలా చేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఎలక్ట్రానిక్ మీడియాలో జరిగే చర్చావేదికల్లోనూ శ్రుతిమించిన రాగాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏబీయన్ టీవీ ఛానల్ లో వెంకటకృష్ణ నిర్వహిస్తున్న చర్చలో పాల్గొన్న కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని వాదోపవాదాలలో తీవ్ర ఆగ్రహంతో చెప్పుతో కొట్టారు. ఇది అమరావతి పరిరక్షణ కోసం పోరాడేవారికి ఆనందం కలిగించింది. మరికొందరికి ఆవేదననూ మిగిల్చింది. సామాన్యజనాన్ని ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అభినందనీయం కావు. అయితే వ్యాఖ్యాతలు సైతం ఇతరుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొనే మాట్లాడాలి అన్న సత్యాన్ని మరువరాదు. ఏది ఏమైనా ఓ బీజేపీ ప్రధాన నాయకుడు అమరావతిపై మాట్లాడిన తీరుకు ఈ ‘దెబ్బ’ ఓ సమాధానమని పలువురు భావిస్తున్నారు.

జనం గమనించాలి…

ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ చర్చ నిర్వహిస్తున్న వెంకటకృష్ణ, దానిని ఖండించారు. అంతేకాదు, ఇకపై ఆ శ్రీనివాసరావును తాను నిర్వహించే ఏ చర్చకూ ఆహ్వానించననీ ప్రకటించారు. కానీ, మరుసటి రోజునే ఆ శ్రీనివాసరావుతో ఆయన చర్చ సాగించారు. నిజానికి ఈ చర్చవల్ల విష్ణువర్ధన్ రెడ్డికి ఏ స్థానంలో అయితే అవమానం జరిగిందో అదే చోట ఆయనపై దాడి చేసిన వ్యక్తితో క్షమాపణ చెప్పించడం అన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది కూడా అభినందనీయమే! ఎందుకంటే ఏ మాధ్మమమైనా కొన్ని విలువలు పాటించి తీరుతుంది. ముఖ్యంగా ప్రజల గళాన్ని వినిపించడంలో మొదటి నుంచీ ‘ఆంధ్రజ్యోతి’ సంస్థ ఎవరికినీ వెరవక ధైర్యంగా ముందుకు సాగుతూనే ఉంది. ఆంధ్రజ్యోతి అంటే ఎల్లో మీడియా అంటూ ప్రచారం చేసేవారికి ఏది చెప్పినా అర్థం కాకపోవచ్చు. కానీ, చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగానే పలుమార్లు ప్రజల గొంతు వినిపించింది ఆంధ్రజ్యోతి. ఇక ఆ పత్రిక ఛానల్ ను కూడా ఏర్పాటు చేసిన తరువాత అనేక సార్లు ప్రజల పక్షమే నిలచింది. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సాగింది. తెలంగాణలో ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని ప్రగాఢంగా విశ్వసించి, వారి పక్షాన నిలచిన తొలి పత్రిక కూడా ఆంధ్రజ్యోతి అని మరచిపోరాదు. అలాగే అమరావతి ప్రజలకు అన్యాయం జరుగుతోందని భావించి, వారి పక్షాన నిలచింది. అమరావతి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసింది కాబట్టి, ఆయన పార్టీకి బాకా ఊదే ఆంధ్రజ్యోతి అక్కడి ప్రజల పక్షం నిలచిందని భావించేవారు గతాన్ని ఒక్కసారి మననం చేసుకోవాలి. ఆంధ్రజ్యోతి సంస్థ, ఆ సంస్థ యజమాని వేమూరి రాధాకృష్ణ ఇప్పటికీ జనం పక్షమేనని వారి రాతలు, చేతలే నిరూపిస్తున్నాయి. అవి సామాన్యజనం గమనిస్తే చాలు. అదే తీరున విష్ణువర్ధన్ రెడ్డికి క్షమాపణలు చెప్పించి, ఆయనపై దాడితో మనోభావాలు దెబ్బ తిన్నవారికి ఊరట కలిగించేందుకు మరుసటి రోజున శ్రీనివాసరావుతో చర్చ పెట్టి, అందులోనే క్షమాపణ కూడా చెప్పించారు. ఇందులో ఏమైనా తప్పుందేమో విజ్ఞులు ఆలోచించాలి.

ఏమిటీ వైనం!?

కానీ, అయినదానికీ, కానిదానికీ ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీ మాత్రం ప్రతిపక్షం టీడీపీపైనే కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు , తెలుగుదేశం పార్టీపైకి ఒంటికాలుతో వచ్చేస్తుంటారు. ఆయన ‘ఏబీయన్ ఛానల్’ ముందుగా ప్రకటించినట్టు శ్రీనివాసరావును మరో చర్చకు ఆహ్వానించమని ప్రకటించి, మరుసటి రోజునే ఆ వ్యక్తిని చర్చకు ఆహ్వానించడాన్ని తప్పు పట్టారు. అంతేకాదు, ఈ చర్చవల్ల బీజీపీని అవమానపరచిందనీ భావించారు. దాంతో ఇకపై బీజేపీ పత్రికా సమావేశాలకు కానీ, మాధ్యమ సమావేశాలకు గానీ ఆంధ్రజ్యోతి సంస్థను అనుమతించబోమని, ఆ మీడియా సంస్థపై నిషేధం విధించారు.

ఏమనుకోవాలి?

నిజానికి, తమ పార్టీ ప్రధాన కార్యదర్శిపై దాడి జరగగానే బీజేపీ శ్రేణులు ఎందుకని తీవ్రంగా స్పందించలేదు. దానిని విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తిగతమని ఎందుకు భావించారు? అంటే తమ నాయకునికి జరిగిన అవమానాన్ని తమదిగా భావించని నాయకత్వం ఎందుకు? అదే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో బీజేపీ నాయకునిపై దాడి చేయగానే, ఇక్కడి రాష్ట్ర అధ్యకులు బండి సంజయ్ ఏ తీరున ప్రవర్తించారో అందరికీ తెలుసు. స్వయంగా వెళ్ళి బాధిత నాయకుణ్ణి పరామర్శించడమే కాదు, శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అయితే సోమూ వీర్రాజు తీరువల్ల వారి పార్టీ శ్రేణుల్లోనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిజానికి చర్చకు వేదికైన మీడియా సంస్థపై నిషేధం విధించడాన్ని ఏమనుకోవాలో ఆ పార్టీ కార్యకర్తలకు అర్థం కావడం లేదు. అధ్యక్షుడు సోమూ వీర్రాజుకు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డికి మధ్య సఖ్యత లేదని పలువురు భావిస్తున్నారు. అందువల్లే ఈ దాడిని విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తిగతమని భావించారనీ చెబుతున్నారు. అంతేకాదు, గతంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి ప్రజలకు మద్దతు పలికారు. ఆయనను పార్టీ దూరంగా పెడుతూ వచ్చింది. ఆ సమయంలో కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలను కూడా పట్టించుకోలేదు. ఏ మాత్రం కన్నాకు అప్పట్లో రాష్ట్ర పార్టీ శ్రేణులు అండగా నిలవలేదు. తరువాత ఆయనను తప్పించి, ఆ స్థానంలో సోమూ వీర్రాజును నిలిపారు. ఒకవేళ ఈ దాడిపై స్పందిస్తే, పార్టీ తనను కూడా పక్కకు పెడుతుందేమోనని వీర్రాజుకు భయం ఉందా అన్న అనుమానం కూడా కొందరిలో ఉంది.

R12

రాజకీయ కోణం

సోమూ వీర్రాజు ఈ విషయంలో స్పందించిన తీరును మరికొందరు మరో రకంగా విశ్లేషిస్తున్నారు. తమ పార్టీ నేతపై జరిగిన దాడిని రాబోయే మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఓ అస్త్రంగా ఉపయోగించాలని బీజేపీ అధిష్టానం చూస్తోందని వారంటున్నారు. విష్ణు వర్ధన్ రెడ్డిపై జరిగిన దాడిని కులాల వారిగా వేరుచేసి చూపించినట్టయితే, ఆ కులం వారి ఓట్లు అటు వైసీపీకి, తెలుగుదేశానికీ పోకుండా తమవైపు మళ్ళించుకోవచ్చుననే వ్యూహం ఉన్నట్టు చెబుతున్నారు. విష్ణువర్ధన్ పై శ్రీనివాసరావు చేసిన దాడి వల్ల ‘సింపతీ’ క్రియేట్ అయిందని, దానిని తమ ఎన్నికలకు అనువుగా ఉపయోగించుకోవాలనీ బీజేపీ భావిస్తున్నట్టు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే 75 మునిసిపాలిటీలకు, 12 కార్పోరేషన్లకు జరిగే ఎన్నికల్లో ఈ దాడి ఏమరకు బీజేపీకి ఉపకరిస్తుందో చూడాలి.

Share: