ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచీ అధికార వైసీపీ రాబోయే మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తా చాటడానికి వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే తాము భావించినట్టుగా 13 వేల పై చిలుకు పంచాయతీల్లో 96 శాతం విజయం సాధించలేకపోయినందుకు అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కొందరిపై గుస్సాగా ఉన్నారనీ తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ పార్టీలో ప్రధాననాయకులుగా చెలామణీ అయిన వారి నియోజకవర్గాల్లోనే వైసీపీ మద్దతుదారులు గణనీయంగా ఓటమిని చవిచూడటం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష టీడీపీని కేవలం ఐదు శాతానికే పరిమితం చేయాలని ఊహించుకున్న తీరుకు భిన్నంగా ఫలితాలు రావడం కూడా సహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లోనయినా తెలుగుదేశంను నిలువరించకపోతే, తమ అనుయాయుల్లోనే విశ్వాసం సన్నగిల్లుతుందనీ వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.రాబోయే మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో సామ,దాన,భేద,దండోపాయాలను పుష్కలంగా వినియోగించాలనీ చూస్తున్నారు.
మరో వ్యూహం!
ప్రత్యర్థిని దెబ్బ తీసేందుకు రాజకీయాల్లో పలు వ్యూహాలు రచిస్తూ ఉంటారు. 2019లో జరిగిన సార్వత్రక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీయే గెలిచిపోతోందని, వైసీపీకి చెందిన సోషల్ మీడియా వారే ఓ పరోక్ష ప్రచారం చేశారు. ఓ వైపు తెలుగుదేశం గెలుస్తోందన్నట్టు చెబుతూనే, మరోవైపు తాము గెలిచేసినట్టుగా తమ సోషల్ మీడియాల్లోనే ప్రచారం మొదలు పెట్టారు. సాక్షాత్తు వైసీపీకి చెందిన కొన్ని సోషల్ మీడియాల్లోనే తెలుగుదేశం విజయం సాధించనున్నట్టు పేర్కొనడంతో అప్పటి అధికార టీడీపీ జబ్బలు చరచుకుంటూ ప్రత్యర్థి వ్యూహాలను ఎదుర్కోవడంలో విఫలమయింది. తత్ఫలితంగానే కేవలం 23 సీట్లకు పరిమితమయింది. ఇప్పుడు కార్పోరేషన్, మునిసిపల్ ఎన్నికల్లోనూ ప్రత్యర్థి వర్గాన్ని బెంబేలు పెట్టేలా ఓ రచన సాగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 75 మునిసిపాలిటీలకు, 12 కార్పోరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో నాలుగోవంతు అంటే 3 కార్పోరేషన్లు, 19 మునిసిపాలిటీలను తెలుగుదేశం గెలవగలదా? అంటూ ఓ ప్రచారం మొదలెట్టారు. ఈ లెక్క చూసిన తెలుగుదేశం వారు నవ్వుకుంటున్నారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎలా ప్రవర్తించబోతోందో ఈ మాటల్లోనే అర్థమవుతోంది. అందువల్ల తెలుగుదేశం శ్రేణులు 2019 ఎన్నికల్లోలాగా గాలిమేడల్లో విహరిస్తూ ఉంటే, ఫలితాలు అధికార పక్షం వారు కోరుకున్నట్టుగానే వస్తాయి.
అనుమానం…
అధికారంలో వారున్నారు, కాబట్టి వారి దౌర్జన్యాలను ఎలా ఎదుర్కోగలం అంటూ నీళ్లు నమిలితే లాభం లేదు. నిజమే, నిస్సందేహంగా మునుపు ఏ రాజకీయ పార్టీలు ప్రవర్తించని రీతిలో అధికార వైసీపీ ప్రవర్తిస్తోంది. నయానో, భయానో, ఏదైనా ఆశ చూపించో, లేదా చివరకు బౌతిక దాడులు చేయడం వల్లో జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలని వ్యూహం పన్నుతున్నారు. అందుకు పోలీసులు సైతం సహకరిస్తున్నారు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సాక్షాత్తు రాజ్యాంగాన్ని పరిరక్షించే స్థానంలో ఉన్న స్పీకర్ తనయుడు వచ్చి అధికారంలో ఉన్నది మేమే, ఏమైనా చేసే హక్కు మాకే ఉందని అన్నా కూడా పోలీసులు చోద్యం చూశారే తప్ప ఏమీ చేయలేకపోయారు. వారినీ ఏమీ అనడానికి లేదు, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా పనిచేయడంలోనే ప్రజాసేవ చేస్తున్నామని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో చక్క్లర్లు కొడుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ 3 కార్పోరేషన్లు, 19 మునిసిపాలిటీలు సంపాదిస్తుందా లేదా అన్న అనుమానం కూడా కలుగుతోంది.
వారి మాట!
అయితే ఇలాంటి మాటలను మేధావులు కొట్టి పారేస్తున్నారు. వారికి ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంది. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు తెలుగుదేశం వర్సెస్ వైసీపీకి కాదు, ఈ ఎన్నికలు ప్రజలకు, పాలకపక్షానికి మధ్య సాగుతున్న పోరు అని వారు విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఎంత భయపెట్టినా, తెగించిన జనం వారికి వ్యతిరేకంగానే ఓటేస్తారని ఈ మేధావుల విశ్వాసం. కానీ, ఇవేమీ పార్టీ రహితంగా సాగే ఎన్నికలు కావు. పార్టీ గుర్తులతో జరగనున్న ఎన్నికలు కావడంతో అధికార పార్టీ తప్పకుండా తమ విజయం కోసం అన్ని దారులనూ అన్వేషిస్తుంది. సజావుగా సాగే దారులు కనిపించక పోతే అడ్డదారులను అధికారంలో ఉన్నవారు ఆశ్రయించడం కొత్తేమీ కాదు కదా! పైగా తాను పట్టిన పట్టును వీడని ముఖ్యమంత్రి తమ పార్టీ గెలుపు కోసం ఏమైనా చేయకుండా ఉంటారా? అందుకోసమే ‘అర్ధికంగా వెనుకబడ్డ అగ్రకులాల’వారికి సైతం ఆర్థిక సాయం చేసే పథకాలు ప్రవేశ పెట్టారు. ఎన్నికల కోడ్ అమలు కాకముందే ఈ పథక రచన చేశారు. అంటే సామ మార్గాన్ని అనుసరించారు. ఇక ఎలక్షన్ల సమయంలో డబ్బులు ఏరులై పారించి, దాన గుణాన్నీ చాటుకుంటారు. ఆ పై తమ మాటకు అడ్డు చెప్పే వారిపై కేసులు గట్రా బనాయించి భేద మార్గమూ చూపిస్తారు. అన్నిటికీ అంకెకు రాకపోతే, తమకు బాగా అలవాటైన దండోపాయాన్ని ప్రయోగించక మానరు.
ధనం మూలం…
అధికార పార్టీ ఏమి చేస్తుందో పూర్తిగా అర్థమయిన తరువాత ప్రతిపక్ష పార్టీ చోద్యం చూస్తూ ఉంటే సరిపోదు. గతంలో తమను గెలిపించిన జనం కోసం నడుం బిగించాల్సిందే. లేదంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలోని పరిస్థితే ఇప్పుడు కూడా ఎదురవుతుంది. పోరాడితే పోయేదేముంది అని భావించే జనంఎప్పిటకీ ఉంటారు. అలాంటి వారికి దన్నుగా నిలవక పోతే, ప్రతిపక్షం అన్న మాటకు అర్థం ఉండదు. ఈ సమయంలో జనానికి బాసటగా నిలిచేది కేవలం న్యాయస్థానాలే. అందువల్ల పాలకపక్షం చేసే అకృత్యాలను అడ్డుకోవడానికి సామాన్యుల పక్షం నిలచి ప్రతిపక్షం పోరాడాల్సిందే. అందుకు ధనాన్నీ వెచ్చించవలసి ఉంటుంది.
ఇంకో వ్యూహం!
పాలక, ప్రతిపక్ష నాయకులు ఇద్దరూ రాయలసీమ ప్రాంతానికే చెందిన వారయినా, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకే రాయలసీమలో మంచి పట్టు ఉందని అంగీకరించక తప్పదు. అయితే ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న సత్యాన్ని చాటుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపలోనే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఊహించని రీతిలో విజయం సాధించారు. కేవలం నాలుగు పంచాయతీలనైనా కడప జిల్లాలో టీడీపీ సాధించగలదా అని ఎద్దేవా చేసిన వారి నోరు మూపిస్తూ ఒక్క చివరి దఫా ఎన్నికల్లోనే 5 స్థానాలకు పరిమితమైంది. అంతకు ముందు మూడు దఫాల్లోనూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు రెండంకెల స్థానాలనే కైవసం చేసుకున్నారు. ఈ పరిస్థితిని గమనించయినా రాయలసీమలోనూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలచిన కార్యకర్తలను టీడీపీ అధిష్టానం ఆదుకోవలసి ఉంటుంది. అన్నట్టు రాయలసీమలో తెలుగుదేశం తరపున పోటీ చేయడానికి చాలామంది జంకుతున్నారు అనే మాట కూడా సామాజిక మాధ్యమాల్లో విశేషంగా వినిపిస్తోంది. అందుకు కారణం, ఈ మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే వారికి తగిన ఆర్థిక బలం లేదని అంటున్నారు. ఎవరూ సొంత డబ్బు పెట్టుకొని కోట్ల రూపాయలు నష్టపోవడానికి సిద్ధంగా లేరు. అందువల్ల రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరపున ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యాంటూ ప్రచారం సాగుతోంది. డబ్బుల్లేక తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీకి జంకుతున్నారనే ప్రచారం ఊపందుకుంటే, జనం కూడా డబ్బులు ఇచ్చే వారిపైపే ప్రస్తుతం నిలచే అవకాశం ఉంది. పైగా, జనం ఒకప్పటిలా లేరు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జై అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే తమ అసలైన నిర్ణయం ప్రకటిస్తున్నారు. ఈ అంశాలన్నిటినీ గుర్తుంచుకొని పాలక పక్షం అనుసరించే వ్యూహాలకు ప్రతి వ్యూహరచన చేస్తేనే ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో ఉనికిని చాటుకోగలవు.
పల్లవి కుదిరింది…
మరి రాబోయే మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రజలు పాలక పక్షానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రతిపక్ష టీడీపీకి ఓట్లు వేస్తారేమో చూడాలి. తెలుగుదేశం ముందు పాలక పక్షం ఉంచిన సవాల్ – 3 కార్పోరేషన్లు, 19 మునిసిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంటుందా? ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలకు సైతం ప్రభుత్వం ప్రకటించిన తాయిలాలు ఫలిస్తాయా? తమ పార్టీ తరపున ఓటీ చేసేవారికి టీడీపీ ఆర్థికంగా అండగా నిలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం మార్చి నెలలో జరిగే మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలే చెబుతాయి. అన్నట్టు తెలుగుదేశం కనుక నాలుగోవంతు స్థానాలను దక్కించుకుంటే, ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలు పాడనున్న చరమగీతానికి పల్లవి దొరికినట్టేననీ కొందరు విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ పల్లవికి ప్రతిపక్ష పార్టీలు ఏ తరహా బలాన్ని అందిస్తాయో చూడాలి.