అవిభక్త ఆంధ్రప్రదేశ్కు ఎన్.టి. రామారావు తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. మూడు సార్లు తన రికార్డును తానే అధిగమించి ప్రతి సారీ మూడొంతుల మెజారిటీతో గెలిచి, కేవలం ఏడున్నర సంవత్సరాలు మాత్రమే పాలించిన నాయకుడు ఎన్టీఆర్. ప్రజాకర్షణలో శ్రీమతి ఇందిరాగాంధీ తరువాత ఆయనదే ద్వితీయ స్థానం. రామారావు సంప్రదాయక రాజకీయ నాయకుడు కాదు. కుళ్ళు, కుతంత్రం తెలియని ఏకైక రాజకీయ నాయకుడుగా ఆయన చరిత్రకెక్కారు. అధికారానికి వచ్చినప్పుడు పరిపాలనానుభవం శూన్యం. అవిభక్త ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయన పాలనా కాలమే పాలనారంగంలో స్వర్ణ యుగంగా పేరుకెక్కింది. అధికారుల నియామకంలో పారదర్శకత, సమర్థతకు పెద్దపీట వేశారు. అవినీతిని సహించని చండశాసనుడుగా ఎన్టీఆర్ ప్రసిద్ధుడయ్యారు. ఏడు దశాబ్దాల చరిత్రలో సామాజిక న్యాయానికి ఇప్పటి వరకు ఆయనే ఆదర్శ ప్రాయుడు. వ్యవస్థలు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, నిజాయతీగా పని చేసిన ఏకైక కాలమది.
అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఎవరికీ లేని కాలమది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశమంతా స్పందించి జనతా పార్టీని గెలిపించుకున్నా 42కు 41 సీట్లు కాంగ్రెస్ పార్టీకిచ్చిన ఏకైక రాష్ట్రమిది. అటువంటి కాంగ్రెస్ పార్టీని, అది కూడా 9 నెలల ప్రాయమున్న పార్టీ ద్వారా ఓడించిన ఘనత సాధించుకున్న చరిత్ర ఎన్టీఆర్కే సొంతం. డబ్బు, అధికారం, కులం ఉన్న నాయకులను అవేవీ లేని కురుమ, ముదిరాజు, గౌడ తదితర చిన్నకులాల యువనేతలు రామారావు దన్నుతో ఓడించారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని కులాల వారికి కేవలం విద్య అనే అర్హత ద్వారా టిక్కెట్టిచ్చి ఎన్టీఆర్ మరీ చరిత్ర సృష్టించారు. 1994 లో అయితే ఆయన 6 నెలలు ముందు ప్రకటించిన తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాలో 100% బీసీలే ఉన్నారు. ఆ అభ్యర్థులలో విశ్వబ్రాహ్మణ, గౌడ, మున్నూరు కాపులే అత్యధికులు. నాయకత్వమంతా పటేళ్ళ, దొరలతో కేంద్రీకృతమైన ప్రాంతాన్ని బహుజనులకు అప్పగించిన ఉదారత్వం, విశాల దృష్టి, విప్లవ తత్త్వం ఎన్టి రామారావుది.
నిరుద్యోగం తాండవిస్తున్న అవిభక్త రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగ కల్పన చేసిన చరిత్ర రామారావుదే. విద్యాధిక యువకులు విప్లవ పార్టీల కార్యకర్తలు, నాయకులు అవుతున్న కాలంలో, ఉద్యోగావకాశాలు సృష్టించి నిరుద్యోగులందరిని ఉద్యోగులుగా చేసిన ఘనత ఆయనదే అంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఎంత మంది నిరుద్యోగులు మిగిలిపోయారో గణాంకాలు తీసుకుని సంబంధిత రంగాలలో వేలాది ప్రత్యేక ఉద్యోగాలు సృష్టించి మరీ నిరుద్యోగితను అంతమొందించిన ఘనత ఎన్టీఆర్ సొంతం. ఉదాహరణకు స్పెషల్ టీచరులు అనే కొత్త అవకాశాలు కల్పించి దాదాపు 42 వేల మంది ఉద్యోగులను సృష్టించారు. అంతేగాక రిజర్వేషన్లు, రిక్రూటింగ్ వ్యవస్థలు, ఎపిపిఎస్సి వంటి వాటిని పారదర్శకంగా రూపొందించారు. రూపాయి ఖర్చు లేకుండా లక్షలాది మంది, ప్రత్యేకించి బడుగులు ఉద్యోగాలు పొందింది అయన హయాంలోనే. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలలో దశాబ్దాల రిజిస్ట్రేషన్లు, ఎదురు చూపులు అవినీతితో ఉద్యోగాలు లేని ఏకైక కాలమది. బడుగులంతా ఎమ్మార్వో, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్లు, ఎస్ఐలు, ఆబ్కారీ ఇన్ స్పెక్టర్లు, కో- ఆపరేటివ్ రిజిస్ట్రార్లు, ఆర్టిఏలు… ఏదికాలేకపోతే లెక్చరర్లు, టీచర్లు అయినకాలమది. పోటీ తగ్గటంతో కేంద్రప్రభుత్వం, బ్యాంకింగ్, ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా సునాయాసంగా ఉద్యోగాలు పొందటమే కాకుండా చదివితే మంచి ఉద్యోగాలు డబ్బు, పైరవీలు లేకుండా వస్తాయనే నమ్మకం కల్పించిన ఏకైక కాలమది.
రాజకీయ రంగం విషయానికి వస్తే రిజర్వేషన్ల పెంపుతో సహా పటిష్టీకరించటమే కాకుండా పాలనా సంస్కరణల్లో భాగంగా తాను తెచ్చిన మండల వ్యవస్థను బడుగుల పాలిట, బీసీల పాలిట రాజకీయ ద్వారాన్ని ఏర్పరచి ఆద్యుడైనాడు. మండల స్థాయి గ్రామ స్థాయి కాకుండా, జిల్లా స్థాయిలో కూడా రిజర్వేషన్లు కల్పించటమే కాకుండా అతి పెద్ద యూనిట్లను కూడా రిజర్వ్ చేసి వారికి బహిరంగంగా ఎన్నికలలో ప్రత్యక్షంగా పోటీ చేసే ఆవకాశం కల్పించి ఆ యా వర్గాలకు అతి పెద్ద స్థాయిలో ఉన్నతికి ఎన్టీఆర్ కారకుడయ్యారు. ఉదాహరణకు ముదిరాజు వర్గం నుంచి వచ్చిన వెంకటయ్య 63 మండలాలు ఉన్న మహబూబ్ నగర్ కు ప్రత్యక్షంగా ఎన్నుకోబడి జిల్లా ప్రజా పరిషత్ తొలి చైర్మన్ అయ్యాడు. అదే విధంగా రాజకీయాలలోకి కొత్తగా వచ్చిన దేవేందర్ గౌడ్ రంగారెడ్డి వంటి కమర్షియల్ జిల్లాలో, ప్రత్యక్ష ఎన్నికలలో చైర్మన్గా ఎన్నికై తిరుగులేని నాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఒక సాధారణ పద్మశాలి గృహిణి శ్రీమతి చిలివేరి లలిత పటేళ్ళ ఇలాకాలో పాగా వేసింది. ఈ రకంగా వందలాది మంది మండల పరిషత్ చైర్మన్లుగా ప్రత్యక్షంగా ఎన్నుకోబడి బడుగుల, బీసీలు ప్రభావాన్ని నెలకొల్పిన ఘనత ఎన్టీఆర్దే. బడుగులకు సంపూర్ణ రాజకీయ నాయకత్వమిచ్చిన అతి పెద్ద సంస్కర్త ఆయనే.
విద్యారంగం విషయానికి వస్తే దాదాపు 14 సంవత్సరాలు ప్రైవేటీకరణను సంపూర్ణంగా అడ్డుకొన్న ఘనత ఎన్టీఆర్దే. 1978–82 కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మొదటి సారిగా ఉన్నత విద్యను ప్రైవేటీకరించి అగ్రకులాల వారికి వాణిజ్య ఇంజనీరింగ్ కళాశాలలను ఇస్తే ఎన్టీఆర్ తన హయాంలో ఎన్నడూ ఆ పని జరగనీయలేదు. అంతేగాక ఆయా కాలేజీల పాలనను యూనివర్సిటీల ద్వారా అడ్మిషన్లతో సహా నియంత్రించటమే కాకుండా వచ్చిన నెలలోనే (1983) క్యాపిటేషన్ ఫీజును కూడా రద్దు చేశారు. 1992–93లో ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అవకాశమిస్తే కోర్టు ద్వారా కొట్టేయించారు. ఈ రకంగా రాష్ట్రంలో విద్యను ప్రైవేటు, కార్పొరేటు రంగాలనుండి రక్షించటమే కాకుండా ప్రాథమిక విద్యను నాణ్యమైన విద్యగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన ఘనత ఎన్టీఆర్దే. అంతేగాక గురుకుల పాఠశాల ఏర్పాటు ద్వారా నిమ్న వర్గాలకు ప్రామాణిక, ఉచిత విద్య నందించే తొలి ప్రయత్నం విజయవంతం కావటమే కాక మార్గదర్శకమయింది. బలహీనవర్గాలలోని అత్యంత నిజాయితీపరులను శోధించి, గుర్తించి, ఉన్నత బాధ్యతలు అప్పగించడం ద్వారా దేశంలోనే ఆదర్శ విద్య వ్యవస్థను రూపకల్పనకు ఆయన కారకుడు అయ్యారు. బీసీలలో అత్యంత నిజాయతీ పరుడు, ప్రామాణికత, విలువలు ఉన్న ప్రొఫెసర్ రామకృష్ణయ్య ను గుర్తించి ఓయూకు తొలి బీసీ వైస్ చాన్సలర్ను ఇచ్చారు. ఆయన హయాంలోనే ఓయూలో ఒక్క గజం స్థలం కూడా దురాక్రమణ కాలేదు. ఒక్క ఉద్యోగం కూడా అమ్ముడుపోలేదు. ఆయన మరణ సమయం వరకు కూడా ఒక్క రూపాయి అదనంగా సంపాదించిందిలేదు. ఒక్క గజం స్థలం కూడా కొనుక్కోలేదు. ఈ రకంగా అధికారవ్యవస్థను అంతా నిజాయితీ పరులు,సమర్థులు, రెకమండేషన్కు దూరంగా ఉన్న వారి చేతిలో పెట్టడం కారణంగా పూర్తి స్వతంత్రం ఇవ్వటం వల్లే స్వర్ణయుగం సాధ్యమయింది. అదే విధంగా వైద్యరంగం కూడా ప్రైవేటీకరణకు దూరంగా ఉండటం విశేషం. అత్యాధునిక వైద్యవసతికై ప్రైవేట్ వైద్యానికి పోకుండా నిజాం హాస్పిటల్ను నిమ్స్గా మార్చారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేవు. ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకునే అవకాశం లేకుండా చట్టాలు చేశారు. పారిశ్రామిక రంగంలో బడుగులకు 25% సబ్సిడీలతో ఔత్సాహికులను ప్రోత్సహించటం జరిగింది.
శాంతిభద్రతల విషయానికి వస్తే అంతక్రితమున్న మత కలహాలు లేవు. గల్లీ గల్లీ కొక్కా గొండ ఇలాకా వ్యవస్థ అంతమైనది. తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగ నిష్పత్తులలోను, లోకల్, నాన్-లోకల్ అక్రమాలను అరికట్టే జీవో నెంబర్ 810 తయారయింది కూడా ఎన్టీఆర్ హయాంలోనే. ముందే చెప్పినట్లు ఆయనకు గత పాలనానుభవం, రాజకీయానుభవం, సామాజిక లోతు పాతుల అనుభవం లేదు. అయినప్పటికీ తన అధికార సుస్థిరతకు పట్టు సాధించేందుకు ఆయన అక్రమ పద్ధతులు అనుసరించలేదు. అసలు ఆయనకు ఆ అవసరం లేదు. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రజాసంక్షేమమే ప్రాధాన్యంగా ఎన్టీఆర్ పరిపాలన చేశారు. కనుకనే అవిభక్త ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అద్వితీయ పాలకుడుగా ఎన్టీఆర్ మనగలిగారు. దీనికి ప్రధాన కారణమేమంటే సమాజ శ్రేయస్సు పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ. నీతి నిజాయితీ, కల్మషం లేని వ్యక్తిత్వం, సగటు మనిషి కోణంలో నిరంతరం ఆలోచించే మానవతావాదం, పరిపూర్ణ స్వార్థరాహిత్యమే ఆయన్ని సమున్నత పరిపాలకుడుగా నిలిపాయి. ఎక్కడ అక్రమాలకు అవకాశముంటే అక్కడ ఎన్టీఆర్ అనే భయాన్ని నెలకొల్పిన కారణంగా అధికార, రాజకీయ వ్యవస్థలలో పూర్తి ప్రక్షాళన జరిగింది. బడుగు, వెనుకబడిన వర్గాల నుంచి ప్రభవించిన నాయకులు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఉదాహరణకు మహేంద్ర నాథ్ ఆర్థిక శాఖ, ఎస్. సత్యనారాయణ రవాణా శాఖ, రాజేశం గౌడ్, ఎం. చంద్ర శేఖర్ వైద్య, ఆబ్కారీ శాఖలు నిర్వహించారు. పలు శాఖలు నిర్వహించిన జానారెడ్డితో సహా మంత్రులందరూ ఎన్టీఆర్ ఉన్నంత కాలం ఒక్క ఇల్లు కూడా కొనుక్కోలేని భయంలో బతికారు. సంగం రెడ్డి సత్యనారాయణ ఒక కలర్ టివి కొనుక్కోవడం కూడా చర్చగా మారిందంటే అవినీతిపై రాజకీయ నాయకత్వానికి ఎంత భయముండేదో తేట తెల్లమవుతుంది. యనముల రామకృష్ణుడు, నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అశోక గజపతి రాజు వంటి నిజాయతీ పరులతో విలసిలింది. అధికారులలో కూడా నిజాయితీ పరులను వెతికి వెతికి పట్టం కట్టిన కాలమది. హైకోర్టు కాని, ప్రతిపక్షం కాని ఒక్క ఆరోపణకూడా చేసేందుకు ఆస్కారం లేని విధంగా సంక్షేమంలో స్వర్ణ యుగం చూసిన కాలమది. తొలి రోజు నుండే రూ.2 లకే కిలో బియ్యం, వస్త్ర తర్పణం, గృహ కేటాయింపులలో పేదవాడి సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చిన కాలమది.
ఎఱ్ఱ సత్యనారాయణ అధ్యక్షుడు, తెలంగాణ బిసి సంక్షేమ సంఘం (ఎన్టీఆర్ జయంతి)
