మాటాడితే సంక్షేమం.. మీట నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు.. ఏపీలోని వైసీపీ నేతల్లో ఏ ఒక్కరిని కదిలించినా చెప్పే మాట ఇదే. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం విదిలించే డబ్బులకు అలవాటు పడిన జనం అభివృద్ధి అంటే అదే కాబోలు అనుకుని జబ్బలు చరుచుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కడా కనిపించనన్ని సంక్షేమ పథకాలతో ప్రజా ధనాన్ని పప్పుబెల్లాల్లా పంచేసి మరో 30 ఏళ్లపాటు అధికారం చలాయించాలని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. సంక్షేమం మాటున అభివృద్ధి అటకెక్కుతోందని, తమ పిల్లల భవిష్యత్ అన్యాయమైపోతోందని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్న ప్రజల నిద్రమత్తు వీడుతున్నారు. ఇందుకు నిదర్శనమే ప్రముఖ జాతీయ దినపత్రిక ‘ఇండియా టు డే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే.
సాధారణంగా అధికారాంతమున పాలనపై ప్రజల్లో ఎంతోకొంత వ్యతిరేకత రావడం సహజం. అలాంటిది ఏకంగా బంపర్ మెజారిటితో గెలిచి అధికారం చేపట్టిన జగన్కు ప్రజా వ్యతిరేకత మచ్చుకైనా రాకూడదు. అందులోనూ అలవికానీ హామీలు ప్రకటించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరిస్తున్న జగన్ విషయంలో అది ఎప్పటికీ రాకూడదు. కానీ, అదేం విచిత్రమో.. అధికారం చేపట్టిన సంగం సంవత్సరాలకే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ప్రజల ఖాతాల్లోకి డబ్బులు కుమ్మరిస్తున్నా ప్రభుత్వం చేస్తున్న మంచి పని ఒక్కటీ లేకపోవడంతో ప్రజల కళ్లకు ఇన్నాళ్లు పట్టిన పొరలు విడిపోతున్నాయి. వాస్తవ పరిస్థితులను వారు ఇప్పుడిప్పుడే గమనించడం మొదలుపెట్టారు.
‘సొంత రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులు’ పేరుతో నిర్వహించిన సర్వేలో జగన్కు టాప్-10లోనూ చోటు దక్కకపోవడం వాస్తవ పరిస్థితి అద్దం పడుతోంది. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముందువరుసలో నిలిచారు. ‘ఇండియా టుడే’ సర్వేను బట్టి జగన్ను సొంత రాష్ట్రంలో 19 శాతం మంది కూడా బెస్ట్ సీఎంగా గుర్తించలేదని స్పష్టమైంది. ఈ వ్యతిరేకత ఇలాగే కొనసాగితే జగన్కు ఈసారి ప్రతిపక్ష నేత పాత్ర కూడా దక్కడం డౌటే. ‘ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో వరాలు ప్రకటించి, ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ… జగన్కు ప్రజాదరణ తగ్గిపోయింది’’ అని ఇండియా టుడే పేర్కొనడం వాస్తవ పరిస్థితులకు నిదర్శనం.
ఇదే సంస్థ గతేడాది నిర్వహించిన సర్వేలో జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు ప్రదర్శిస్తున్న సీఎంగా జగన్కు 11 శాతం మంది ఓటు వేశారు. ఇప్పుడు ఆ సంఖ్య ఆరు శాతానికి పడిపోవడం చూస్తుంటే జాతీయ స్థాయిలోనూ జగన్కు ఉన్న ప్రతిష్ఠ నానాటికీ క్షీణిస్తోందని అర్థం చేసుకోవచ్చు. జగన్కు ప్రజాదరణ తగ్గడానికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కూల్చివేతల సర్కారుగా పేరు పొందడం, అడ్డగోలు నిర్ణయాలతో కోర్టుల్లో ఎదురు దెబ్బలు, మూడు రాజధానులతో అనిశ్చితి, పరిశ్రమలను బెదరగొట్టడం, విపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని వేధించడం వంటి కారణాల వల్లే జగన్కు ఆదరణ తగ్గిందని చెబుతున్నారు. డబ్బులు వెదజల్లే ఫార్ములాతో ప్రజల్లో పాపులారిటీని పెంచుకోవాలని చూస్తున్న జగన్ సర్కారుకు, వైసీపీ నేతలకు ఇది కోలుకోలేని పెద్ద షాకే.
మరోవైపు, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్కు ప్రజాదరణ అంత ఎక్కువ ఎందుకన్న ప్రశ్నకు కూడా రాజకీయ పండితులు కారణాలు చెబుతున్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతీకార చర్యలు లేవు. ప్రతిపక్ష నేతలపై వేధింపులు లేవు. జగన్ అధికారంలోకి రాగానే ‘అన్న క్యాంటీన్లను తొలగించినట్టు స్టాలిన్ అలా చేయలేదు. రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తున్నారు. పేదల కడుపు నింపే ‘అమ్మ క్యాంటీన్ల’ను జయలలిత బొమ్మతోనే కొనసాగిస్తున్నారు. ఇవే ఆయనను బెస్ట్ సీఎంగా చేశాయని చెబుతున్నారు. ఒక్క జగన్ మాత్రమే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా ఇండియా టుడే సర్వేలో ఏ జాబితాలోనూ కనిపించలేదు. ఇక మోదీ గ్రాఫ్ ప్రజల్లో బాగా పడిపోయినట్టు కూడా సర్వే తేల్చింది. పాలకులు ఇప్పటికైనా అభివృద్ధిని నమ్ముకోకుండా సంక్షేమం పేరుతో కోట్లు పంచిపెట్టడం, ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్ల ఉపయోగం లేశమాత్రమైనా లేదని సర్వే చెప్పకనే చెప్పింది. మరి ఈ విషయాన్ని పాలకులు ఏమేరకు గ్రహిస్తారో వేచి చూడాల్సిందే!