ఉద్యమాలే ఊపిరిగా.. ప్రజాహితమే ప్రాణంగా వైవీబీ విజయ గీతిక

55
యలమంచిలి వెంకట బాబూరాజేంద్రప్రసాద్ .. తెలుగురాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. ఉద్యమాలే ఊపిరిగా ముందుకు సాగుతున్న ఆయన సాధించిన విజయాలు అసామాన్యం. విద్యార్థి దశ నుంచే ఆయన పోరాటం మొదలైంది. అవినీతిపై శమరశంఖం పూరించే తత్త్వం ఆనాడే అలవడింది. అలా విద్యార్థి దశలోనే మొదలైన ఆయన ప్రస్థానం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నాయకుల్లో ఒకరిని చేసింది. సమస్యలపై ప్రభుత్వాలతో పోరాడడం విజయం సాధించే వరకు మడమ తిప్పకపోవడం ఆయన నైజం. ఫలితంగా ఆయన ఖాతాలో ఎన్నో విజయాలు. ఆయన పోరాట ఫలంగా అటు విద్యార్థులు, ఇటు ప్రజలకు జరిగిన ప్రయోజనాలెన్నో.. ఎన్నెన్నో..
——————-

కృష్ణా జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజేంద్రప్రసాద్‌ వైవీబీగా సుపరిచితులు. ఆయన రాజకీయ ప్రస్థానానికి 1978లోనే తొలి అడుగు పడింది. ‘ఫ్రెండ్స్ సర్కిల్’ స్వచ్ఛంద యువజన సేవా సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నో ప్రజా ఉద్యమాలు చేపట్టారు. విద్యార్థి నాయకుడిగా ఎన్నో సమస్యలకు పరిష్కారం అందించారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రవేశంపై ఉన్న అడ్డంకులను తొలగించడంలో ముఖ్య భూమిక పోషించారు. 1986లో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట ఆరు రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి విజయం సాధించారు. ఆయన పోరాటం ఫలితంగా డిప్లొమా విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ-సెట్ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. దీంతో వేలాదిమంది పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రయోజనం లభించింది. 1987లో ఆంధ్రప్రదేశ్ డిప్లొమా హోల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన సారథ్యంలో మద్య వ్యతిరేక ఉద్యమం. 1992లో కృష్ణా జిల్లా మద్య వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడిగా ఎన్నికైన వైవీబీ.. 1994లో జిల్లా మద్య వ్యతిరేక పోరాట అధ్యక్షుడిగా ఎన్నికై రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం..

విద్యార్థి నాయకుడిగా, మద్య వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడిగా ప్రజల్లో తిరిగిన రాజేంద్రప్రసాద్ ఆ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో బాధలను కళ్లారా చూశారు. అప్పుడే ఆయన మదిలో ఓ ఆలోచన వచ్చింది. రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే సమస్యల పరిష్కారానికి సరైన వేదిక దొరుకుతుందని భావించిన వైవీబీ.. 1995లో జరిగిన ఉయ్యూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 1665 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నాటి నుంచి నేటి వరకు ఆయన రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.

33

పంచాయతీ హక్కుల కోసం పోరాటం

అప్పటికి పేరుకే గ్రామ సర్పంచ్ పదవి అయినా అధికారాలు మాత్రం నామమాత్రం. దీంతో అభివృద్ధికి ఆస్కారం పెద్దగా ఉండేది కాదు. ఫలితంగా పల్లెలు అభివృద్ధికి నోచుకోక కునారిల్లేవి. రాజేంద్ర ప్రసాద్‌ను ఇది కలచివేసింది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని భావించిన వైవీబీ పంచాయతీలకు అధికారం కోసం నిర్విరామ కృషి చేశారు. 26 సెప్టెంబరు 1995లో ఉయ్యూరు నియోజకవర్గ పంచాయతీ సర్పంచ్ ఫోరమ్ కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు చట్టప్రకారం రావాల్సిన నిధులు, విధులు, అధికారాలు, హక్కులపై పోరాటం ప్రారంభించారు. అసంఘటితంగా ఉన్న సర్పంచులందరినీ ఏకం చేసి డిమాండ్ల పరిష్కారం కోసం అంతకుముందెన్నడూ లేని విధంగా 15 వేల మంది సర్పంచులతో అసెంబ్లీని ముట్టడించారు. ఆయన పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం సర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వడంతోపాటు పంచాయతీలకు ఉపయోగపడే 100 జీవోలను జారీ చేసింది. వైవీబీ పోరాటంతో మేజర్ గ్రామ సర్పంచులకు వెయ్యి రూపాయలు, మైనర్ పంచాయతీ సర్పంచులకు రూ. 600 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు, తన పోరాటంతో పంచాయతీలకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేలా చేశారు. 1996లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా బాబూ రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1998లో ఉత్తమ సర్పంచ్‌గా ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు.

 

ఉయ్యూరు జడ్పీటీసీగా..

2001వ సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 10,300 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో ఉయ్యూరు జడ్పీటీసీగా రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలనే ఉద్దేశంతో 2002లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్‌ను ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా ఎన్నికైన రాజేంద్రప్రసాద్.. ఎంపీటీసీల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పలు పోరాటాలు చేశారు. నిధులు, అధికారులు లేని ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోకూడదనే తలంపుతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం ప్రారంభించి తమ 14 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేలా విజయం సాధించారు.

22

వైవీబీ పోరాటంతో జీవో ఎంఎస్ నంబరు 128 రద్దు

పంచాయతీరాజ్ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. 13 మే 2002న రాజేంద్రప్రసాద్ సారథ్యంలో హైదరాబాద్‌లో ‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ప్రజా ప్రతినిధుల రాష్ట్ర సదస్సు’ నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయంపై నిరసన గళం వినిపించారు. జీవోను వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం తప్పదని వైవీబీ హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఆ మరుసటి రోజే జీవో ఎంఎస్ 128ను రద్దు చేసింది. ఆయన సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. అంతేకాదు, అప్పటి వరకు జననమరణ ధ్రువీకరణ పత్రాలు, స్టడీ, నేటివిటీ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం ఎమ్మార్వోలకు ఉండగా, వాటిని గ్రామస్థాయిలో పంచాయతీలే జారీ చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు.

అతిపెద్ద విజయం 356 జీవో

వైవీబీ సాధించిన అతిపెద్ద విజయాల్లో 356 జీవో కూడా ఒకటి. సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఆయన చేసిన పోరాటాలతో దిగొచ్చిన అప్పటి ప్రభుత్వం జీవో నంబరు 356ను విడుదల చేసింది. నదీ పరివాహక గ్రామాలకు ఈ జీవో వల్ల లబ్ధి చేకూరింది. అప్పటి వరకు ఇసుక క్వారీలు గనుల శాఖ పర్యవేక్షణలో ఉండేవి. దీనివల్ల ఆయా గ్రామ పంచాయతీలకు పైసా ఆదాయం కూడా వచ్చేది కాదు. అయితే, రాజేంద్రప్రసాద్ పోరాటం వల్ల ఇసుక క్వారీలు గనుల శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖకు బదలాయిస్తూ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. అప్పటి నుంచి ఇసుక క్వారీలపై స్థానిక సంస్థలకు సంపూర్ణ అధికారాలు లభించాయి. ఇసుక ఆదాయంలో పంచాయతీకి 25 శాతం, మండల పరిషత్‌కు 50 శాతం, జిల్లా పరిషత్‌కు 25 శాతం చొప్పున ఆదాయం లభిస్తోంది.

అలాగే, పంచాయతీలకు గుదిబండలుగా మారిన గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అధికారుల వ్యవస్థను రద్దు చేసి, సర్పంచులకు వివిధ అధికారులను బదలాయించే 485 జీవో, సర్పంచులకు గౌరవ వేతనం అందించేలా తీసుకొచ్చిన 154 జీవో, వృత్తిపన్నులో పంచాయతీలకు 95 శాతం లభించేలా తీసుకొచ్చిన 544 జీవో, పంచాయతీ పనులకు సాంకేతిక మంజూరు అధికారాన్ని రూ. 40 వేల నుంచి రూ. 2 లక్ష పెంచుతూ తీసుకొచ్చిన 94 జీవో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవోలు రాజేంద్రప్రసాద్ పోరాట చలువతో వచ్చినవే.


—————
వైవీబీ ఉద్యమాలు.. ఘనతలు
1979లో ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్‌జీ కళాశాల విద్యార్థి సంఘం సంయుక్త కార్యదర్శిగా గెలుపు
1980లో ‘యువభావ’ మాసపత్రిక ఎడిటర్‌గా ఉద్యమ రచనలు
1981లో ఉయ్యూరు రోటరాక్ట్ కార్యదర్శిగా ఎన్నిక
1982లో ఏజీ అండ్ ఎస్‌జీ కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక
1983లో కాకినాడలో ‘ఫ్రెండ్స్ సర్కిల్’ పేరుతో స్వచ్ఛంద యువజన సేవా సంస్థ స్థాపన
1984లో కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నిక
1985లో ఆంధ్ర పాలిటెక్నిక్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా విజయం
1986లో ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నిక. ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రవేశం కోసం పోరాటం. హైదరాబాద్‌లో సచివాలం ఎదుట ఆరు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష. ఫలితంగా దిగొచ్చిన ప్రభుత్వం
1987 ఆంధ్రప్రదేశ్ డిప్లొమా హోల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక
1992లో కృష్ణా జిల్లా సారా వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక
1992లో కృష్ణా జిల్లా మద్య వ్యతిరేక అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక.
1995లో ఉయ్యూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా విజయం
1995లో కృష్ణా జిల్లా సర్పంచ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక
1996లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక
1997లో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నిక
1998లో జిల్లాలోనే ఉత్తమ సర్పంచ్‌గా ప్రభుత్వం నుంచి అవార్డు
1999లో మొత్తం 21,943 మంది సర్పంచులను ఏకతాటిపైకి తీసుకొచ్చి అధికార, సాంకేతిక హక్కుల కోసం పోరాడి విజయం
2001లో ఉయ్యూరు మండల జడ్పీటీసీగా విజయం
2002లో చాంబర్ ఆఫ్ ఏపీ స్టేట్ పంచాయతీరాజ్ అధ్యక్షుడిగా ఎన్నిక
2003లో ఏపీ స్టేట్ సర్పంచ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నిక
2006లో ఎమ్మెల్సీగా ఎన్నిక
2015లో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నిక
——————

టీడీపీలో చేరిక
ఉద్యమాలే ఊపిరిగా రాజేంద్రప్రసాద్ చేస్తున్న పోరాటాలను, ఆయనలోని నాయకత్వ లక్షణాలను, ప్రజాహితం కోసం పడే తపనను తెలుగుదేశం పార్టీ గుర్తించింది. పార్టీ ఆహ్వానం మేరకు 2001లో చంద్రబాబు నాయుడు సమక్షంలో రాజేంద్ర ప్రసాద్ టీడీపీలో చేరారు. నాటి నుంచి తెలుగుదేశం వాణిని వినిపిస్తూ, ప్రతిపక్షాలను ఎండగడుతూ రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు రాజేంద్రప్రసాద్. పార్టీ కోసం వైవీబీ పడుతున్న శ్రమను గుర్తించిన చంద్రబాబు 2005లోనే అంటే ఏడాది ముందుగానే ఆయనను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఫలితంగా 2006లో రాష్ట్ర శాసన మండలికి స్థానిక సంస్థల ప్రతినిధిగా ఎన్నికయ్యారు. శాసన మండలిలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గానూ వ్యవహరించారు. 2015లో మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

11177

రాజేంద్రప్రసాద్ మా వాడు అని చెప్పుకునే స్థాయికి ఎదిగిన వైవీబీ తన పోరాటాన్ని కొనసాగించాలని, ప్రజాహితం కోసం తన గొంతు ఎప్పుడూ గళమెత్తుతూనే ఉండాలని కోరుకుందాం.

88

Share: