నందమూరి బాలకృష్ణ కేవలం నటుడు, నిర్మాతనే కాదు, మన దేశంలో ప్రఖ్యాతి గాంచిన బసవరామ తారకం కేన్సర్ హాస్పిటల్ చైర్మన్ కూడా. బాలకృష్ణ ఛైర్మన్ అయిన తరువాత దేశవిదేశాల్లోని తెలుగువారి వద్దు వెళ్ళి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, హాస్పిటల్ సవ్యంగా సాగేందుకు తగిన నిధులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే దేశవిధేశాల్లోని ఎంతోమంది ప్రముఖ ఆంకాలజిస్టులతోనూ బాలయ్యకు పరిచయం ఏర్పడింది. విద్యావంతులను గౌరవించడంలో నందమూరి వారు ఎప్పుడూ ముందుంటారు అని అన్న నందమూరి తారక రామారావు ఏ నాడో నిరూపించారు. ఆయన వారసునిగా బాలయ్య సైతం తనకు పరిచయమైన విద్యావంతులను ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. తనకు తెలియని విషయాలను అడిగి తెలుసుకుంటూ ఉండడం కూడా ఆయన నైజం. తెలుగునేలపై కేన్సర్ బారిన పడ్డ ఎందరికో బసవరామ తారకం సేదతీర్చి పంపుతోంది. తమ ఇండో అమెరికన్ ఇన్ స్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న వారిని తన అనునయమైన మాటలతో సేద తీర్చడంలోనూ బాలయ్య ముందుంటారు. ఆయన అనునయ వ్యాఖ్యలతో ఎంతోమంది కేన్సర్ వ్యాధిగ్రస్తులు త్వరిత గతిన కోలుకున్న సందర్భాలూ ఉన్నాయి.
కోవిడ్ -19 సమయంలోనూ…
ప్రస్తుతం కోవిడ్ -19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ సమయంలోనూ తమ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ల స్ఫూర్తితో బాలకృష్ణ రోగులలో ఆత్మస్థైర్యం నింపుతూ, వారు త్వరగా కోలుకొనేందుకు పూనుకుంటున్నారు. కోవిడ్ -19 నుండి కూడా తనకు తెలిసిన వారికి ఏ లాంటి ప్రమాధం సంభవించకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఆయన యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా నిర్మూలన కోసం తనకు పరిచయం ఉన్న వైద్యులందరితోనూ ఆయన ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నారు. కరోనా నిర్మూలనకు వ్యాక్సిన్ రావడానికి మరిన్ని నెలలు పడుతుందన్న అంశాన్ని ఆయన మొదటి నుంచీ చెబుతున్నారు. సినిమా షూటింగులకు, థియేటర్ల ప్రారంభానికి ఇది సరైన సమయం కాదనీ ఆయన మొదట్లోనే అభిప్రాయపడ్డారు. అయినా కొందరు సీనీప్రముఖులు తమకు షూటింగ్ జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ సంప్రదించారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ లో చలనచిత్రాభివృద్ధి కోసం రాయితీలనూ కోరారు. ఈ సమయంలోనే బాలకృష్ణ “ముందు ఈ మహమ్మారిని పారదోలుదాం. ఆ తరువాతే మన సినిమా రంగం గురించి ఆలోచిద్దాం” అంటూ చేసిన ప్రకటనను కొందరు వక్రీకరించారు. కొంత వివాదం కూడా తలెత్తింది. అయితే బాలకృష్ణ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారు. అంతేకాదు, తన సినిమా షూటింగును కూడా కరోనాకు తగిన నివారణ లభించేదాకా ప్రారంభించబోననీ కరాఖండిగా చెప్పారు. కొందరు చిన్న నిర్మాతలు షూటింగ్ ఆరంభించినా, ఓ టీవీ షూటింగులో కరోనా పొడసూపడంతో ఎవరూ షూటింగులకు సాహసించడం లేదు. బాలయ్య అభిప్రాయంతోనే మహేశ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా ఏకీభవించారు. వారు కూడా తమ షూటింగులు ఇప్పట్లో మొదలు పెట్టమని చెప్పారు. వరుసగా మూడు చిత్రాల్లో నటించడానికి అంగీకరించిన పవన్ కళ్యాణ్ సైతం ఈ మధ్యే తాను కూడా కరోనా అంతమయ్యే దాకా షూటింగులో పాల్గొననని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రసీమలో ఇప్పుడు అందరూ బాలయ్య చెప్పిందే నిజమవుతోందని ఆయనను ప్రశంసిస్తున్నారు.
చేతనైన సాయం
కోవిడ్-19కు తగిన వ్యాక్సిన్ వస్తుందనే అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడమొక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కరోనాను కట్టడి చేసే కొన్ని హోమియో మందులను, అది వచ్చినా ఎంతగానో ఉపయోగపడే విటమిన్ టాబ్లెట్స్ ను పంపిణీ చేయడం మొదలు పెట్టారు. చిత్రసీలోని వారికి, తనతో పరిచయం ఉన్న వారందరికీ ఈ ఔషధాలను ఆయన అందిస్తున్నారు. బాలయ్య తమను గుర్తు పెట్టుకొని మరీ కరోనాను కట్టడి చేసే మందులను పంపించడంతో చిత్రసీమలోని పలువురు ఆనందిస్తున్నారు. బాలయ్య అంతకు ముందు సినీప్రముఖులు ముఖ్యమంత్రులను కలవడానికి చూపుతున్న ఉత్సాహం చూసి అన్న వ్యాఖ్యలను కొందరు విపరీత అర్థాలు తీసి ఏవేవో అన్నారు. ఇప్పుడు అలాంటి వారు కూడా బాలయ్య ఔదార్యాన్ని అభినందిస్తూ ఉండడం విశేషం. ఏది ఏమైనా ఈ ఆపత్ సమయంలో బాలకృష్ణ మాట బంగారుబాటలానే కనిపిస్తోందనీ ఆ మధ్య ఆయనను విమర్శించిన వారు సైతం అంగీకరిస్తున్నారు.