మహానటుడు, మహానాయకుడుగా విశ్వవిఖ్యాతి గాంచిన అన్న నందమూరి తారక రామారావు మహాదర్శకునిగానూ జేజేలు అందుకున్నారు. ఈ ఘనత ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఏ నటునికీ దక్కి ఉండదు. యన్టీఆర్ లాగే చిత్రసీమలోనూ రాజకీయ రంగంలోనూ రాణించిన నటులున్నారు. కానీ, పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలకు దర్శకత్వం వహించి విజయం సాదించిన నటులు భూగోళంలో మరొకరు కానరారు. అంతటి ఖ్యాతిని దర్శకత్వంలోనూ ఆర్జించిన యన్టీఆర్ రూపొందించిన తొలి చిత్రం ‘సీతారామకళ్యాణం’ ఈ యేడాదితో అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 1961 జనవరి 6న విడుదలై విజయఢంకా మోగించింది. నాటి సంక్రాంతి బరిలో పోటీ చిత్రాలను పక్కకు నెట్టి విజేతగా నిలచింది.
యన్టీఆర్ బాణీ!
ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఏ దర్శకుడు కూడా తన పేరు ప్రకటించుకోకుండా సినిమాలు తీసిన దాఖలాలు లేవు. అయితే నందమూరి తారకరామారావు తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సీతారామకళ్యాణం’కు పేరును ప్రకటించుకోకపోవడం ఆయన బాణీగా నిలచింది. దాని తరువాత తెరకెక్కించిన ‘గులేబకావళి కథ’కు కూడా ఆయన పేరు ప్రకటించుకోలేదు. ఇది తన శైలి అని ఆయన అనుకున్నారు. అయితే అప్పటికే ప్రముఖ దర్శకునిగా ఉన్న పి.పుల్లయ్య లాంటి సీనియర్స్ “డైరెక్టర్ అంటే కెప్టెన్. అతని పేరు లేకుండా టైటిల్స్ వేయడం సబబు కాదు” అని యన్టీఆర్ కు సూచించారు. దాంతో మూడో సినిమా ‘శ్రీక్రిష్ణ పాండవీయం’కు డైరెక్టర్ గా పేరు వేసుకున్నారు. అది కూడా సినిమా టైటిల్ పడగానే, ఆ తరువాత ఆయన పేరు తెరపై కనిపించడం గమనార్హం! అప్పటి నుంచీ అదే పంథా కొనసాగింది.
తొలి చిత్రంతోనే సంచలనం!
ఓ కొత్త ప్రయత్నం సాగుతూ ఉంటే విమర్శించేవారికి కొదువే ఉండదు. అది అన్ని కాలాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. యన్టీఆర్ దర్శకత్వంలో సినిమా అనగానే చాలామంది పెదవి విరిచారు. ఎందుకంటే అప్పటికే ఏడాదికి ఏడెనిమిది చిత్రాలలో నటించేవారు యన్టీఆర్. అంతటి బిజీ ఆర్టిస్ట్ కు తీరిక ఎక్కడిది, ఆయన దర్శకత్వం చేయాలంటే ఈ సినిమాలన్నీ విడిచిపెట్టి మరీ చేయాలి కదా అన్నారు. ఓవైపు తన నటనను కొనసాగిస్తూనే, మరోవైపు ‘సీతారామకళ్యాణం’ పూర్తి చేశారు రామారావు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సీతారామకళ్యాణం’ 28 ప్రింట్లతో విడుదల కాగా, అన్ని కేంద్రాలలోనూ అర్దశతదినోత్సవం జరుపుకుంది. 9 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ శ్రీలక్ష్మీ ప్యాలెస్ లో ఏకధాటిగా 156 రోజులు ప్రదర్శితమైంది. ఆ యేడాది సంక్రాంతి చిత్రాల్లో మేటిగా నిలచింది ‘సీతారామకళ్యాణం’. ఈ ఘనవిజయాన్ని చూసిన సినీజనం ఆశ్చర్యపోయారు. సామాన్య జనం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం అనేకమార్లు రీ-రిలీజ్ అయి వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ నాటికీ బుల్లితెరపై పర్వదినాలలో అలరిస్తూనే ఉంది.
యన్టీఆర్ దర్శకత్వ శైలి
యన్టీఆర్ తాను ఎంచుకున్న కథను సూటిగా చెప్పేవారు. అంతే తప్ప కంగాళీ చేసేవారు కారు. తొలి సినిమాలోనే టైటిల్ ను “సీతారామకళ్యాణం’ అన్నారు. అసలు సీత, శ్రీరాముడు జననం గురించి, వారి పవిత్రత గురించి చక్కగా చూపించారు. ఇక ఇదే చిత్రంలో రావణాసురుని పరమశివభక్తిని, అతని అరాచకాన్నీ కూడా తెరకెక్కించారు. అంతేకానీ, ఏ నాడూ తాను స్టార్ హీరోని కథ తనచుట్టూ తిరుగుతూ ఉండాలి, టైటిల్ తన పేరనే ఉండాలి అన్న అంశాలకు ఆయన ప్రాధాన్యమిచ్చేవారే కాదు.
తన దర్శకత్వంలో రూపొందిన చిత్రాలలో పాత కథనైనా కొత్తకోణంలో చూపించాలని ఆయన తపించేవారు. అందులో భాగంగానే ‘సీతారామకళ్యాణః’లో ముందు రావణాసురుని శివభక్తిని, వరగర్వితుడైన రావణుని అరాచకాన్నీ చక్కగా తెరకెక్కించారు.
స్ట్రెయిట్ నేరేషన్ లోనే ఫ్లాష్ బ్యాక్స్ కూడా అవసరమైన చోట ఉపయోగించారు. శ్రీరాముని పాదం తాకి శాపవిమోచనం పొందిన అహల్య కథను ఫ్లాష్ బ్యాక్ లో చూపించిన వైనం మరపురానిది. అలాగే ‘శ్రీక్రిష్ణ పాండవీయం’లో అంతకు ముందు ఎవరూ శకుని చరిత్రను, అతని పగను గురించి చర్చించని అంశాన్ని చొప్పించారు.
‘గుల్ ఏ బకావళి’ అనే అరేబియన్ నైట్స్ కథను తరువాతి కాలంలో తమిళులు ఆ వాతావరణంలోనే తెరకెక్కించారు. మన తెలుగులోనూ అదే తీరున సాగింది. రామారావు ఆ కథను మన నేటివిటీకి అనుగుణంగా రూపొందించిన వైనాన్ని ఎవరూ మరచిపోలేరు.
సమకాలీన సమస్యలు – పరిష్కారం
తన చిత్రాలలో సామాజిక అంశాలు, సమకాలీన సమస్యలను కూడా చర్చించేవారు రామారావు. ఈ నాటికీ మహమ్మారిలాగే మిగిలిన ‘వరకట్నం’పై ఆయన యాభై ఏళ్ళ క్రితమే చక్కని పరిష్కారం చూపిస్తూ సినిమా తెరకెక్కించి, ఆకట్టుకున్నారు. ఇక జన్మనిచ్చిన తల్లి ప్రధానమా, మనలను నమ్మి వచ్చిన ఇల్లాలు ముఖ్యమా అన్న సంశయం ప్రతి కుటుంబీకుని మదిలో మెదిలే అంశమే. ఈ సున్నితమైన అంశానికి తగిన పరిష్కారం చూపిస్తూ ‘తల్లా-పెళ్ళామా’ను రక్తి కట్టించారు. అధిక సంతానంపై ఆ నాటి ప్రభుత్వం చర్యలను ఓ వైపు విమర్శిస్తూనే, మరోవైపు ఆదాయానికి తగినట్టుగానే సంతానం కనాలి అనే సందేశాన్నీ ఇస్తూ ‘తాతమ్మకల’ సినిమాను రూపొందించారు.
అదో అద్భుతం!
తెలుగు చిత్రసీమలో మహత్తర పౌరాణిక చిత్రాలలో ఒకటిగా నిలచిన ‘దానవీరశూరకర్ణ’ ఓ చరిత్ర. ఆ సినిమా నిడివి 25 రీళ్ళు. అంత పెద్ద చిత్రాన్ని అందునా పౌరాణికాన్ని, కేవలం 43 రోజుల్లో పూర్తి చేసి ఔరా అనిపించారు యన్టీఆర్. ఇంత నిడివిగల పౌరాణికాన్ని అంతకు ముందు కానీ, ఆ తరువాత కానీ ఎవరూ ఇంత తక్కువ వ్యవధిలో తెరకెక్కించిన దాఖలాలు లేవు. ఈ సినిమాలో యన్టీఆర్ శ్రీకృష్ణ, దుర్యోధన, కర్ణ పాత్రలను సమర్థవంతంగా పోషించడమే కాదు, నిర్మాతగానూ వ్యవహరించారు. ఇంత పెద్ద చిత్రాన్ని అంత తక్కువ సమయంలో అందునా ఇంతటి సాంకేతికాభివృద్ధి లేని రోజుల్లోనే తెరకెక్కించడం సామాన్య విషయం కాదు. అసలు మానవమాత్రులకు సాధ్యమయ్యే పనేనా అని భావితరాలు తప్పకుండా చర్చించుకుంటాయి. ఇక ‘దానవీరశూరకర్ణ’ సినిమాలోని డైలాగ్స్ ఈ నాటికీ మారుమోగుతూనే ఉన్నాయి. అందులోని “ఏమంటివి ఏమంటివి…”అనే డైలాగ్ ఇప్పటికీ ఎంతోమంది రింగ్ టోన్ గానూ మసలుతోంది.
ఆపై యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక చిత్రాలు “శ్రీరామపట్టాభిషేకం, శ్రీమద్విరాటపర్వము, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం” కూడా జనాన్ని ఆకట్టుకున్నాయి. ఆయన చివరి పౌరాణికం బ్రహ్మర్షి విశ్వామిత్ర’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది. తొలుత తెలుగు విడుదలయింది. తరువాత కొన్ని మార్పులూ చేర్పులతో హిందీలోనూ జనం ముందు నిలచింది.
యన్టీఆర్ చారిత్రకాలు
తాను ధరించగల పాత్రను సాటి నటునికి ఇచ్చి, తానే దర్శకత్వం వహించి, ఆయనచేత గొప్పగా అభినయింపచేసి ‘చాణక్య-చంద్రగుప్త’ చిత్రం తెరకెక్కించారు రామారావు. ఈ చిత్రంలో ఆయన చరిత్రను వక్రీకరించారని విమర్శలు వినిపించాయి. ఎందుకంటే చంద్రగుప్తుని కాలంలో అలెగ్జాండర్ భారతదేశానికి రాలేదని, దానిని యన్టీఆర్ తప్పుదోవ పట్టించారనీ ఈ నాటికీ విమర్శించేవారున్నారు. అయినా ‘చాణక్య-చంద్రగుప్త’ ఓ కళాఖండంగా నిలచిపోయింది.
హిందీలో ఘనవిజయం సాధించిన ‘మొఘల్ ఏ ఆజమ్’ ఆధారంగానే ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ రూపొందించారు. ఆ సినిమా మ్యూజికల్ హిట్ కాబట్టి, ఈ చిత్రాన్నీ సంగీతపరంగా జనాన్ని ఆకట్టుకొనేలా చిత్రీకరించాలని ఆశించారు. అందుకే అనార్కలి కథతో తెరకెక్కిన ‘అనార్కలి’ చిత్రానికి సంగీతం సమకూర్చిన సి.రామచంద్రను సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. ఇందులో మహ్మద్ రఫీ పాడిన పాటలు జనాన్ని విశేషంగా అలరించాయి. ఆయన కోరుకున్నట్టుగానే ఈ చిత్రం మ్యూజికల్ హిట్ అయింది. కమర్షియల్ గా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయినా, ఈ నాటికీ ఇందులోని పాటలు మురిపిస్తూనే ఉండడం విశేషం!
బ్రహ్మంగారి అద్భుతం!
యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన మరో చారిత్రకం ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’. ఈ చిత్రంలో బుద్ధ, రామానుజ, శంకరాచార్య, వేమన పాత్రలు ధరించి అలరించారు. ఇక బ్రహ్మంగారి పాత్రలో రామారావు జీవించారనే చెప్పాలి. ఈ చిత్రం తెలుగునేలను పులకింప చేసింది. ఈ సినిమా 1984 నవంబర్ 29న విడుదలై విజయఢంకా మోగించింది. 1984 డిసెంబర్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశమంతటా కాంగ్రెస్ గాలి వీచింది. అందుకు కారణం ఇందిరాగాంధీ మరణం. అయితే, తెలుగునాట యన్టీఆర్ హవా ఏమిటో నిరూపించింది ఈ సినిమా. ఈ నాటికీ చారిత్రక చిత్రాలలో ఇంతటి విజయం సాధించిన సినిమా మరొకటి కానరాదు.
ఇక రామారావు దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘సమ్రాట్ అశోక’ కూడా చారిత్రకమే. ఇందులో అశోకుని యుద్ధకాంక్షను, తరువాత బౌద్ధం ఆయనను మార్చిన తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు.
యన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు వాటి తీరు తెన్నులను పరిశీలిస్తే, ఆయన దూరదృష్టి ఏ పాటిదో అర్థమవుతుంది. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన తొలి సాంఘిక చిత్రం ‘వరకట్నం’. ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో నగదు బహుమతి అందుకున్న తొలి తెలుగు చిత్రంగానూ ‘వరకట్నం’ నిలచింది. ఇక ‘తల్లా-పెళ్ళామా’కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు లభించింది. యన్టీఆర్ ‘తాతమ్మ కల’ ఓ సంచలనం. ఎందుకంటే అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం బలవంతపు కుటుంబ నియంత్రణ చేయిస్తూండేది. దానిని వ్యతిరేకిస్తూనే తొలుత ‘తాతమ్మకల’ రూపొందింది. దాంతో ఈ సినిమాను కేంద్రం నిషేధించింది. అయితే, తగిన ఆదాయం లేకుండా అధిక సంతానం కలిగితే ఎలాంటి కష్టనష్టాలు ఉన్నాయో ఈ సినిమా చూపించింది. ఈ చిత్రం ద్వారా యన్టీఆర్ కు ఉత్తమ కథకునిగా నంది అవార్డు లభించింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన చివరి సాంఘిక చిత్రం ‘చండశాసనుడు’. ఇందులో పెత్తందారీ వ్యవస్థకు, సామాన్యులకు మధ్య సాగే పోరాటాన్ని చూపించారు. తాను నెగటివ్ షేడ్స్ ఉన్న కామందు పాత్రలో నటించి, తన చెల్లెలు పాత్రలో శారదను నటింప చేశారు. ఈ సినిమా తరువాతే శారద గంభీర పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు. అంతకు ముందు శారద అంటే శోక రస పాత్రలకే పరిమితం అన్న ముద్రను చెరిపేశారు.
ఇలా రామారావు దర్శకత్వంలో రూపొందిన 16 తెలుగు చిత్రాలు, తమిళ చిత్రం ‘రాజసూయం’ (శ్రీక్రిష్ణ పాండవీయం తమిళ వర్షన్), హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ అన్నిటా ఆయన దర్శకత్వ ప్రతిభ కనిపిస్తూనే ఉంటుంది.
యన్టీఆర్ దర్శకత్వం వహించిన చిత్రాలు:
సీతారామకళ్యాణం (1961), గులేబకావళి కథ(1962), శ్రీక్రిష్ణపాండవీయం (1966), వరకట్నం (1969), తల్లా-పెళ్ళామా(1970), తాతమ్మకల (1974), దానవీరశూర కర్ణ (1977), చాణక్య-చంద్రగుప్త (1977), అక్బర్ సలీమ్ అనార్కలి (1978), శ్రీరామపట్టాభిషేకం (1978), శ్రీమద్విరాటపర్వము (1979), శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం (1979), చండశాసనుడు (1983), శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984), బ్రహ్మర్షి విశ్వామిత్ర (1992), సమ్రాట్ అశోక (1993)
రాజసూయం (తమిళం) (1966), బ్రహ్మర్షి విశ్వామిత్ర (హిందీ)
యన్టీఆర్ దర్శకత్వంలో నటించిన మహానటీనటులు
భానుమతి రామకృష్ణ, సావిత్రి, జమున, బి.సరోజాదేవి, కె.ఆర్.విజయ, ఋష్యేంద్రమణి, సూర్యకాంతం, ఛాయాదేవి, యస్.వరలక్ష్మి, కృష్ణకుమారి, జయప్రద, జయసుధ, సంగీత, ప్రభ, రాజశ్రీ, శారద, వాణిశ్రీ, దీప, రాధ, కాంచన, మీనాక్షి శేషాద్రి, వాణీ విశ్వనాథ్,
చిత్తూరు వి.నాగయ్య, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, కాంతారావు, జగ్గయ్య, శోభన్ బాబు, హరనాథ్, రాజనాల, గుమ్మడి, బాలయ్య, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, ముక్కామల, మిక్కిలినేని, నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, జూ.యన్టీఆర్
రేలంగి, బాలకృష్ణ (అంజి), పద్మనాభం, రాజబాబు, మాడా, లంకా సత్యం, పేకేటి శివరామ్, రావి కొండలరావు, మోదుకూరి సత్యం
యన్టీఆర్ దర్శకత్వంలో సంగీత దర్శకులు
గాలి పెంచల నరసింహారావు (సీతారామకళ్యాణం), జోసెఫ్-కృష్ణమూర్తి (గులేబకావళి కథ, వీరిని పరిచయం చేసింది యన్టీఆరే), టి.వి.రాజు(శ్రీక్రిష్ణ పాండవీయం, వరకట్నం, తల్లా పెళ్ళామా), రాజేశ్వరరావు (తాతమ్మకల), పెండ్యాల(దానవీరశూరకర్ణ, చాణక్య-చంద్రగుప్త, శ్రీరామపట్టాభిషేకం, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం), సి.రామచంద్ర (అక్బర్ సలీమ్ అనార్కలి), సుసర్ల దకిణామూర్తి (శ్రీమద్విరాట పర్వం, బ్రహ్మంగారి చరిత్ర), చక్రవర్తి (చండశాసనుడు), రవీంద్రజైన్ (బ్రహ్మర్షి విశ్వామిత్ర), ఎమ్మెస్ విశ్వనాథన్ (సమ్రాట్ అశోక)
చిత్రసీమకు దర్శకునిగా యన్టీఆర్ పరిచయం చేసిన వారు
డాక్టర్ సి.నారాయణరెడ్డి (గీతరచయిత – గులేబకావళి కథ)
రవికాంత్ నగాయిచ్ (సీతారామకళ్యాణం)
గీతాంజలి (సీతారామకళ్యాణం)
నందమూరి బాలకృష్ణ (తాతమ్మకల)
———————