పంచాయతీ ఎన్నికలు అంటేనే అల్లకల్లోలంగా ఉంటాయి. ఇప్పుడే కాదు, గతంలోనూ పంచాయతీ ఎన్నికలు కంగాళీగానే సాగాయి. ఎందుకంటే వీటికి పార్టీ గుర్తులు ఉండవు. దాంతో గెలిచినవారిని అధికారంలో ఉన్నవారు తమ ఖాతాలో వేసుకొని తమకే ఎక్కువ సీట్లు వచ్చాయంటూ గొప్పగా చెప్పుకోవడం పరిపాటే! ఇందులో ఆందోళన చెందవలసింది ఏమీ లేదు. అధికారంలో ఉన్న పార్టీలు సామ,దాన,భేద, దండోపాయాలు ప్రదర్శించడం, దరిమిలా ఎక్కువ సీట్లు సంపాదించుకోవడం కూడా సహజమే! ఇక అధికారంలో ఉన్న పార్టీకే ఏకగ్రీవాల్లోనూ ఆధిక్యం ఉంటుంది. ఇవన్నీ ఇటు చంద్రబాబు నాయుడుకు, అటు జగన్మోహన్ రెడ్డికి తెలియనివి కావు. అయినప్పటికీ ప్రజలను మభ్య పెట్టేందుకు ఎవరి నాటకాలకు వారు తెరతీస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ పార్టీ సామదానభేదాలు వదిలేసి ఏకంగా దండోపాయంతోనే ఎంతోమందిని బెదిరించి, మరీ తమ వాళ్ళుగా గెలిచిన వారిని చేరదీసింది. ప్రతిపక్షంలోనూ బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇది చూసి లబోదిబోమంటోంది. మొన్నటి దాకా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేసిన పోరాటాన్ని చూసి చప్పట్లు కొట్టిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అదే ఎస్.ఈ.సి.పై నిందారోపణలు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ అక్రమాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉందని టీడీపీ దుమ్మెత్తి పోస్తోంది. ఈ నేపథ్యంలోనూ ఎవరికి వారు తాము ఇన్ని సీటల్లో గెలిచామంటే ఇన్ని సీట్లలో గెలిచామని టముకు వేసుకుంటూనే ఉన్నారు. ఇదంతా చూస్తోంటే నిజాయితీగా ఓటు వేసిన వారికి చీదరపుట్టిస్తోంది.
ఇది నిజంగా నిమ్మగడ్డ విజయం!
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 13.097 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో అధికార పార్టీ మొదటి నుంచీ 90 శాతం సంపాదించాలనే ప్రయత్నంలోనే తలమునకలై ఉంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇందులో పది శాతం అంటే 1310 సంపాదించినా, ఆ పార్టీకి ప్రజల్లో పట్టు ఉన్నట్టే నని విశ్లేషకులు భావించారు. మొత్తం నాలుగు దఫాలుగా జరిగిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలన్నీ వెలువడ్డాయి. అందులో అత్యధికంగా వైసీపీ కైవసం చేసుకుంది. ఇది అందరూ ఊహించిందే. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైసీపీనే. తమకు 81 శాతం సీట్లు వచ్చాయని, తెలుగుదేశానికి కేవలం 15.75 శాతమే వచ్చాయని వైసీపీ వర్గాలు విజయగర్వంతో చెబుతున్నాయి. లేదు తమకు 40 శాతం సీట్లు వచ్చాయని, ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే మరో పది శాతం పెరిగేవని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఎవరికి వారు ఎన్నికల్లో తామే పట్టు సాధించామని చెప్పుకుంటున్నారు. అందుకు అవకాశం ఇచ్చింది పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు జరగడమే! అయితే ఇక్కడే విశ్లేషకులు ఓ అంశాన్ని గుర్తు చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ 90 శాతం సీట్లు సాధించడానికి నానా తంటాలు పడాల్సి వస్తుందని ముందే చెప్పారు. ఇక ప్రతిపక్ష పార్టీకి పది శాతం మించినా, ఆ పార్టీకి జనాల్లో పట్టు ఉన్నట్టేనని తేటతెల్లం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే జగన్ రెడ్డి పంచాయతీ ఎన్నికలు జరగకుండా పలు నాటకాలకు తెరతీశారు. ఉద్యోగసంఘాలతోనూ డ్రామాలు వేయించారు. చివరకు ఎస్.ఈ.సి. నిమ్మగడ్డ న్యాయస్థానాల్లోనూ విజయం సాధించి, అనుకున్నట్టుగానే ఎన్నికలు జరిపారు. నాలుగు విడతల్లోనూ ఏదో ఒకటి రెండు సంఘటనలు మినహాయిస్తే ఎన్నికలు సజావుగానే సాగాయి. ఇది నిస్సందేహంగా, నిస్సంశయంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సాధించిన విజయం అని అంగీకరించక తప్పదు. తెలుగుదేశం ఎక్కువ సీట్లు గెలిచిందా? వైసీపీ ఎక్కువ సీట్లు సొంతం చేసుకుందా? అన్న మాటలు పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించిన నిమ్మగడ్డను అబినందించి తీరాల్సిందే! తాను అనుకున్న ప్రకారం ఎన్నికలు నిర్వహించారు కాబట్టి ఇది నిమ్మగడ్డ విజయంగానే అందరూ అంగీకరించాలి.
వారి మాట…
పంచాయతీ ఎన్నికల్లో 93 శాతం సీట్లు సంపాదిస్తామని, తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్ దాటనివ్వమని డంబాలు పలికిన వైసీపీ మంత్రులు, నాయకులు ఇప్పుడు వారి నోటితోనే తమకు 81 శాతం సీట్లు వచ్చాయని, తెలుగుదేశానికి 15.75 శాతం సీట్లు దక్కాయని చెబుతున్నారు. అంటే ప్రజల్లో వారిపై నమ్మకం సన్నగిల్లిందని వారే అంగీకరిస్తున్నారన్న మాట. ఇది విశ్లేషకుల అభిప్రాయం. ఇంకా వారు ఏమంటున్నారంటే – చంద్రబాబు నాయుడు ఇంకా పాత చింతకాయపచ్చడి లాంటి మాటలనే పట్లుకొని వేలాడుతూ ఉండడం, నవతరం మెచ్చే వ్యూహాలను రచించడంలో ఆయన విఫలం కావడం ఈ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశంకు అంతగా లాభించకపోవడానికి కారణమని చెబుతున్నారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఈ స్థాయిలో సీట్లు రావడం గమనార్హమనీ వారు అంటున్నారు. అధికారంలోఉన్న వైసీపీ పార్టీ ముఖ్యనాయకుల పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగురవేయడం గుర్తుంచుకోవలసిన అంశమనీ చెబుతున్నారు. అయితే, అదే రీతిన చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆయన కంచుకోటను వైసీపీ నానా విధాలా ప్రయత్నించి, మొత్తానికి అక్కడ ఆధిక్యం సాధించడాన్నీ తెలుగుదేశం వర్గాలు మరచిపోరాదనీ గుర్తు చేస్తున్నారు.
కొత్త వ్యూహాలు అవసరం!
ఎన్నికలు అయిపోగానే అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసిందని ప్రతిపక్షం సన్నాయి రాగాలు తీయడం కొత్తేమీ కాదు. అలాగే ఎన్నికల కమీషన్ పై కారాలు మిరియాలు నూరడం కూడా పాతపద్ధతే! ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు రాబోయే మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల సమయంలో సరికొత్త వ్యూహాలు రచించాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అంటే పార్టీల గుర్తులు లేవు కాబట్టి, ఎవరికి వారు తమకు ఇన్ని సీట్లు వచ్చాయని గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ, రాబోయే మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికలలో తప్పకుండా గుర్తులు ఉంటాయి. ఆ సమయంలో పాత చింతకాయపచ్చడి కాకుండా, కొత్త వ్యూహాలతోనే ప్రతిపక్షం ముందుకు పోవాలి. ఎలాగూ అధికారపక్షం తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా ముందుకు పోతుంది. అధికార పక్షం ఎత్తులకు ప్రతిపక్షం పైఎత్తులు వేయాలి. లేకుంటే ఎన్నికలు అయిన తరువాత అధికార దుర్వినియోగం, ఎన్నికల కమీషన్ అసమర్థత అన్న మాటలనే పట్టుకొని వేలాడాల్సి ఉంటుంది. పార్టీల గుర్తులేని పంచాయతీ ఎన్నికల్లో పది శాతం సీట్లు సంపాదించినా ప్రతి పక్షానికి పట్టు ఉన్నట్టేనని పరిశీలకులు సెలవిచ్చారు. ఇప్పుడు పాలక పక్షమే వైరి పక్షానికి 15.75 శాతం సీట్లు వచ్చాయని చెబుతోంది. కాబట్టి , కాసింత ఊరట చెందవలసిన పరిస్థితి. అయితే పార్టీల గుర్తులతో జరగనున్న మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ 25 శాతం సీట్లు సంపాదించగలగాలి. అప్పుడే ఆ పార్టీకి జనాల్లో బలం తగ్గలేదన్న భావన ప్రజల్లో కలుగుతుంది. ఈ 25 శాతానికంటే ఎక్కువ సంపాదిస్తే మరింత మంచిది. అప్పుడు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం చోటు చేసుకుంటుంది. అది మునుముందు జరగబోయే ఎన్నికలకు బలంగానూ మారుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నూతన వ్యూహాలకు తెర తీయాలి. ముఖ్యంఆ అధికారంలో ఉన్న పార్టీ చేసే అక్రమాలను ధైర్యంగా ఎదుర్కొంటున్న కార్యకర్తలకు మేమున్నామంటూ నైతికబలాన్ని అందించాలి. ఎవరికి వారు చూసుకుంటారులే అని భావిస్తే, మొదటికే మోసం వస్తుంది. కుప్పం మన కంచుకోట అందులో వీళ్ళ ఆటలు సాగవు అంటూ దీర్ఘాలు తీశారు తెలుగుదేశం నేతలు. చివరకు ఏమయింది? అన్యాయాలకు, అక్రమాలకు తెరతీయడం వల్లే కుప్పంలో అధికార పార్టీకి అధికశాతం సీట్లు లభించాయని చెబితే కుదరదు. వారు అలా ప్రవర్తిస్తారని తెలిసీ, సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే పరిస్థితి తారుమారయింది. అలాంటి పరిస్థితిని తెచ్చుకోరాదంటే, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి. అందుకు ఏమి జరిగినా మేమున్నామంటూ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి.
ఆలోచించండి!
పంచాయతీ ఎన్నికల్లో తాము ఊహించిన దానికంటే మిన్నగా సీట్లు లభించడం పట్ల తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆనందంగానే ఉన్నారని తెలుస్తోంది. రాబోయే మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికలలో పార్టీ తరపున తానే ప్రచారం చేస్తారనీ చెబుతున్నారు. ఇది అభినందించదగ్గ విషయం. ఎందుకంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగలిగేది ప్రస్తుతం ఆయన ఒక్కరే! తెలుగుదేశంలోని నాయకులు, గెలిచిన వారు సైతం ఉదాసీనంగా ఉన్నారు. అలా ఉన్నా, కూడా ఆ పార్టీ అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు సంపాదించడం గమనించదగ్గ అంశం! తెలుగుదేశం పార్టీకి తొలి నుంచీ కార్యకర్తలే అసలు బలం, నాయకులు కాదు అన్న విషయం మరోమారు తేటతెల్లమయింది. కావున, టీడీపీ అధినేత పాతచింతకాయపచ్చడి లాంటి నాయకులను నమ్ముకోకుండా, తానే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అభినందనీయమే! ఇక్కడే పార్టీ శ్రేణులలో ఎవరు ఎలా పనిచేస్తున్నారో ఆయన తెలుసుకోవాలి. అంతేకానీ, నాయకులు చెప్పిన వారికి పదవులు కల్పిస్తూ ముందుకు సాగితే, కార్యకర్తల్లో నిరుత్సాహం కలుగుతుంది. అలా కాకుండా, ప్రతి నియోజకరవ్గంలోనూ పార్టీ కార్యకర్తలతో ఎవరు ఎలా పనిచేస్తున్నారో ముందుగానే ఓ రిపోర్టు సంపాదించాలి. నాయకుల చెప్పిన మాటలు, వారు చసిన సర్వేలను నమ్మరాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తుతం ఉదాసీనంగా ఉన్నా, పార్టీకి కాసింత ఊపు వస్తోందని తెలియగానే అన్నీ తామే చేశామంటూ అధినాయకుని వద్దకు పరుగులు తీస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న తంతే! లోకేశ్ బాబు కూడా తన చుట్టూ ఉన్న కోటరీని కాకుండా, అసలు కార్యకర్తల్లో ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారో పరిశీలించాలి. ఎన్నో ఏళ్ళుగా పార్టీని నమ్ముకున్న వారిని ఆదరించాలి. వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవన్నీ ప్రతీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అందరూ చెబుతున్న హితోక్తులే! అయినా పెడచెవిన పెట్టినప్పుడు ఫలితం అనుభవించక తప్పదు. అయితే పార్టీ పునర్నిర్మాణానికి ఇదే సరైన సమయం. అందువల్ల పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన ప్రాధాన్యమివ్వాలి. అదికారంలో లేకున్నా, అధికారంలో ఉన్నట్టు భావించి, పార్టీలోనే పలు వర్గాలను తయారు చేసుకోవడం ద్వారా నష్టమే కానీ, లాభం ఏమాత్రం లేదు. ఈ విషయాన్ని లోకేశ్ బాబు గుర్తుంచుకోవాలని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. వీటన్నిటినీ గుర్తుంచుకొని తెలుగుదేశం పార్టీ అధినేత, యువనేత వ్మూహరచనలు చేయాలి. అప్పుడే రాబోయే మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించగలరు.