బీజేపీ కపట నాటకాలు

p

విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా మోసపోయింది. బీజేపీ కపటనాటకాలు ఏపీకి శాపంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ను పదిలం చేసుకోవచ్చనే ఆలోచనతో సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిస్తే, బీజేపీ అందుకు సహకరించింది. విభజనానంతరం ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందాలంటే ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా అవసరమని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటిస్తే, అది ఏమాత్రం సరిపోదని, కనీసం పదేళ్లు కావాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు గట్టిగా వాదించారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఐదేళ్లు కాదు కదా ఒక్క ఏడాది కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పి, ఏపీ ప్రజలను మోసం చేసింది. ఢిల్లీని తలదన్నే రీతిలో నిర్మించే రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీని విస్మరించారు.. ఇలా ఏపీకి అడుగడుగునా జరిగిన మోసాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావు తన ‘పెనం మీది నుండి పొయ్యిలో పడ్డాం’ పుస్తకంలో వివరించారు. ఆ వివరాల్లో కొన్ని మీకోసం యథాతథంగా..

p

5 కోట్ల మంది తెలుగు ప్రజల అభీష్టానికి భిన్నంగా భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌‌ను విభజిస్తూ తెలంగాణ ప్రాంతంలోని 17 లోక్‌సభ స్థానాలు తమ ఖాతాలోనే పడతాయనే సోనియాగాంధీ దుష్ట ఆలోచనతో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014’’ను అప్రజాస్వామికంగా, టి.వి చానెళ్ల ప్రసారాలను నిలుపదల చేసి, పార్లమెంటు తలపులు మూసి, సభా నియమాలకు విరుద్ధంగా ఆమోదించడానికి తెలంగాణలో బలపడవచ్చన్న భావనతో పార్లమెంటులో బి.జె.పి. సహకరించింది. ఆ సందర్భంగా బి.జె.పి నాయకురాలు సుష్మాస్వరాజ్ తన ప్రసంగంలో తెలంగాణ ప్రజలు సోనియా గాంధీనే కాక, తనను కూడా (చిన్నమ్మగా) అభిమానించాలని మాట్లాడడం ఎవరూ మర్చిపోలేదు. కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకే పట్టం కట్టారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీని విస్మరించడం తగునా?

రాజ్యసభలో ప్రధాని మన్మోహన్‌సింగ్ పరిశ్రములు, మౌలిక వసతులు పెద్దగా లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శీఘ్రంగా అభివృద్ధి చెందాలంటే నవ్యాంధ్రప్రదేశ్‌కు 5 సం.లపాటు ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని ప్రకటించగా, బి.జె.పి. నాయకులు ఎమ్. వెంకయ్యనాయుడు 5 సం.లు చాలదు, కనీసం 10 సం.లపాటు ప్రత్యేక హోదా వుండాలని కోరడం జరిగింది. 2014 దరిమిలా కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలోని బి.జె.పి. ప్రభుత్వం ఏర్పడింది.
నూతనంగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఫైనాన్స్ కమీషన్ సిఫార్సులు అడ్డుపడుతున్నాయని చెబుతూ కేంద్రం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తిరస్కరించింది. అది వాస్తవం కాదని ఫైనాన్స్ కమీషన్ సభ్యులు స్పష్టంగా చెప్పారు. ఎ.పి.కి ప్రత్యేక హోదా ఇస్తామన్న ప్రధానమంత్రి హామీకి న్యాయబద్ధత ఉంటుందని యిందుకొరకు చట్టాన్ని సవరించవలసిన అవసరం లేదని ప్రముఖ న్యాయకోవిదుడు డాక్టర్ పి.సి.రావు ప్రకటించారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే కొన్ని యితర రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయని కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు.

వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం మద్దతు యివ్వవద్దా?:

వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేగాక ఒరిస్సా, బీహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోతూ వున్నా యిప్పటికీ కొన్ని రాష్ట్రాలు అత్యంత వెనుకబడి వున్నాయి. ప్రత్యేక హోదా పొందుటకు అవసరమగు అంశాలు ఈ నాలుగు రాష్ట్రాలకు కూడా కచ్చితంగా వర్తిస్తాయి. ఎందుకంటే ఒరిస్సా రాష్ట్రంలో 40 శాతం మంది ప్రజలు ఎస్.సి., ఎస్.టి., వర్గాలకు చెందిన వారు. మొత్తం 314 బ్లాకులలో 118 గిరిజనులు మెజార్టీగా ఉన్నవే. మొత్తం 30 జిల్లాలోని 20 జిల్లాలో మావోయిస్టు ప్రభావం ఉంది. అలాగే బీహార్ రాష్ట్రంలో 41 శాతం మంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. చిన్న రాష్ట్రమైన గుజరాత్‌లో ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో 19 లక్షల మంది ఉపాధి పొందుతుండగా, దేశంలో రెండవ పెద్ద రాష్ట్రమైన బీహార్‌లో 4.3 లక్షల మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభించాయి. దుర్భర దారిద్ర్యం వల్ల లక్షలాదిమంది బీహారీలు అనేక యితర రాష్ట్రాలలో వివిధ రంగాలలో కూలీలుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలలో గిరిజనుల జనాభా చాలా ఎక్కువగా ఉండడమే కాక, మావోయిస్టుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అయితే ప్రధాని నరేంద్రమోదీకి గుజరాత్ రాష్ట్రం తప్ప భారతదేశంలో ఇతర రాష్ట్రాల అభివృద్ధి పట్ల తగినంత ఆసక్తి లేదు. సర్దార్ పటేల్ విగ్రహం ఏర్పాటు, లక్ష కోట్ల రూపాయల ఖర్చయ్యే ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు, ఢిల్లీ-ముంబాయి పారిశ్రామిక నడవాలో భాగంగా ‘‘డోలేరా ప్రత్యేక ఇన్వెస్టిమెంట్ రీజియన్-స్మార్ట్ సిటీ’’ అభివృద్ధి కొరకు వందలు, వేలాది కోట్ల రూపాయల కేంద్ర నిధులను అందించడం పట్లే ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటారు.
స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రధానిగా వుండగా ప్రజామోదంతో ఎట్టి నిరసనలు లేకుండా, సాఫీగా ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. బి.జె.పి. చిన్న రాష్ట్రాల ఏర్పాటు తమ పార్టీ విధానమని ప్రకటించుతూ వుంటుంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను 3 రాష్ట్రాలుగా విభజించాలని చాలా కాలం క్రిందటే ఉత్తరప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసినా ఇప్పుడు ఆ రాష్ట్రంలోను, కేంద్రంలోనూ బి.జె.పి. ప్రభుత్వాలే ఉన్నా, యూ.పి. విభజనకు ఎట్టి చర్యలూ తీసుకొనకపోవడం బి.జె.పి అవకాశవాద రాజకీయాలలో భాగమే.

విభజన హామీలను అమలు చేయవద్దా?

విభజన చట్టంలో నవ్యాంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన నాలుగు రాయలసీమ, మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకు గతంలో బుందేల్‌ఖండ్, కోరాపుట్-కలహండీ-బోలంగీర్‌లకు అందించిన మాదిరిగా ప్రత్యేక ఆర్థిక సాహాయాన్ని అందించుతామని హామీ యిచ్చినా సరిగా అమలుపరచడం లేదు. లోగడ బుందేల్‌ఖండ్ ప్రాంతానికి రూ. 7,200 కోట్లు, ఒరిస్సాలోని 3 జిల్లాలకు ఏటా రూ. 250 కోట్ల చొప్పున కేంద్రం ఇవ్వగా బి.జె.పి. ప్రభుత్వం మన వెనుకబడిన జిల్లాలకు, జిల్లాలకు రూ. 50 కోట్లు ఇస్తామనడం అన్యాయం. 5 సం.లు పాటు యివ్వవలసి ఉన్నా 3 సం.లు యిచ్చి ఆపివేసింది.
విభజన చట్టంలో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో గవర్నర్ బంగ్లా, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాలతో సహా మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు కేంద్రం సహాయం చేస్తుందని స్పష్టంగా పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 94 (3)లో పేర్కొనబడింది. శివరామకృష్ణన్ కమిటీ రాజ్‌భన్‌కు రూ. 56 కోట్లు, సి.యం, మంత్రులు, సెక్రటేరియట్‌కు రూ.360 కోట్లు, అసెంబ్లీ భవనములకు రూ.450 కోట్లు, ఉద్యోగుల నివాస భవనముల కొరకు రూ.1,100 కోట్లు, హైకోర్టు, జడ్జిల నివాస భవనములు మున్నగు వాటి కొరకు రూ. 1,271 కోట్లు, హెచ్.ఒ.డి.లకు కార్యాలయాలు, నివాస భవనముల కొరకు రూ. 6,660 కోట్లు మొత్తంగా రూ. 9,900 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ మున్నగు మౌలిక వసతులకు రూ. 16,536 కోట్లు, వెరసి ర. 26,433 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచానా వేసింది. 2014 ఎన్నికల్లో తిరుపతి బహిరంగ సభలో నరేంద్రమోడీ ఢిల్లీతో సరితూగే రాజధాని నవ్యాంధ్రలో నిర్మించబడుతుందని మాట్లాడారు. కానీ కేంద్ర ప్రభుత్వం రూ. 1500 కోట్లు మాత్రమే ఇచ్చింది. నీతి ఆయోగ్ 3 సం.లుపాటు యేటా రూ.333 కోట్లు చొప్పున ఇందుకొరకు సహాయం అందించాలని సిఫార్సు చేసినా ఇంతవరకు కేంద్రం నుండి నిధులు విడుదల కాకపోవడం ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యానికి తార్కాణం.

షెడ్యూల్-9 మరియు 10లలోని సంస్థ ఆస్తుల విభజన ఎప్పుడు?:

విభజన చట్టంలో దాదాపు రూ.50,000 విలువైన షెడ్యూల్ 9 పరిధిలో ఉన్న 89 సంస్థలు మరియు రూ. 25,000 కోట్ల విలువైన షెడ్యూల్ 10 పరిధిలో ఉన్న 142 సంస్థలు (ప్రభుత్వ సంస్థలు/కార్యాలయాలు ప్రభుత్వ రంగ సంస్థలు) ఉమ్మడి ఆస్తుల విభజన ప్రక్రియలో ఉభయ రాష్ట్రాలు ఒక అంగీకారానికి రాలేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తగు చర్యలు చేపట్టాలని నిర్దేశించబడినా, పట్టుంచుకోకపోగా ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆస్తుల పంపకం విషయంలో గౌరవ జస్టిస్ గోపాలగౌడగారి సుప్రీంకోర్టు బెంచ్, ఈ సంస్థతోపాటు మిగిలిన సంస్థల ఆస్తులను కూడా 58:42 నిష్పత్తిలో పంచబడాలని తీర్పు ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వ హోంశాఖలో ఉద్యోగి అందుకు భిన్నంగా తెలంగాణ భూభాగంలో ఉన్న సంస్థల ఆస్తులలో నవ్యాంధ్రకు వాటా ఇవ్వనవసరం లేదని ఉత్తర్వులు ఇవ్వడం కడు దుర్మార్గం. ఇది సరికాదని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను అమలు చేయాలని చాలాకాలం క్రితమే చంద్రబాబు ప్రభుత్వం కోరినా కేంద్రం స్పందించకపోగా 18 మార్చి 2020న పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి కూడా దీనినే బలపర్చడం కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత మాత్రమూ సానుభూతి లేదనేందుకు ప్రబల తార్కాణం.

పారిశ్రామిక ప్రోత్సాహకాలు లేనిదే ప్రగతి ఎలా?:

వందలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక, వ్యాపార సంస్థలను వదులుకున్న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్వర పారిశ్రామిక అభివృద్ధి కొరకు అవసరమైన ఆదాయపు పన్ను, ఎక్సైజ్ డ్యూటీలలో పన్నుల మినహాయింపు, 90 శాతం ట్రాన్స్‌పోర్టు రాయితీ, స్థిర క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ పైన 30 శాతం రాయితీ, వర్కింగ్ క్యాపిటల్ రుణం పైన వడ్డీ రాయితీ, ఇన్సూరెన్స్ ప్రీమియం రీయింబర్స్‌మెంట్ మున్నగు ఆర్థిక ప్రోత్సాహకాలు లభించితేనే పెద్ద ఎత్తున నూతనంగా పరిశ్రమలు స్థాపించేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని తెలిసినా కూడా కేంద్రం మన రాష్ట్రానికి ఇవ్వకపోవడం నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిపట్ల కేంద్రానికి ఆసక్తి లేదని స్పష్టమవుతోంది.

నవ్యాంధ్ర పట్ల సవతితల్లి ప్రేమ తగునా:

ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టం 2014లో షెడ్యూలు 14లో షెడ్యూలు 13లో పేర్కొన్న ప్రకారం నవ్యాంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ మరియు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాట్లు చేయవచ్చు అని పేర్కొనబడింది. ఈ ప్రాజెక్టుకు ఏటా రూ. 5,800 కోట్లు చొప్పున 15 సం.లపాటు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించితేనే ఈ ప్రాజెక్టు వయబుల్ అవుతుందని కేంద్రం తెలియపర్చింది. రాజస్థాన్‌లో ఇదే తరహా రిఫైనరీ ప్రాజెక్టును హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, బార్మెర్ వద్ద నెలకొల్పాలని తొలుత యు.పి.ఎ. ప్రభుత్వం నిర్ణయించి వయబిలిటి గ్యాప్ ఫండ్ కింద ఏటా రూ. 3,336 కోట్లు చొప్పు రాజస్థాన్ ప్రభుత్వం ప్రాజెక్టుకు చెల్లించాలని నిర్ణయించింది. అనంతరం అధికారం చేపట్టిన బి.జె.పి ప్రభుత్వం ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ 14 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తూ రూ.1,123 కోట్లు ఏటా రాజస్థాన్ ప్రభుత్వం కడితే సరిపోతుందని నిర్ణయించింది. ఫలితంగా రాజస్థాన్ ప్రభుత్వానికి రూ. 43,000 కోట్ల మేరకు లబ్ధి చేకూరిందని కేంద్ర పెట్రోలియం, రసాయనాల శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఘనంగా ప్రకటించారు.
అదేవిధంగా కాకినాడ వద్ద నెలకొల్పదలచిన హెచ్.పి.సి.ఎల్. పెట్రోలియం రిఫైనరీ విషయంలో కూడా ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్‌ను 14 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చంద్రబాబు కేంద్రాన్ని కోరినా బి.జె.పి. ప్రభుత్వం అంగీకరించకపోవటం నవ్యాంధ్ర పట్ల కేంద్ర ప్రభుత్వ సవతితల్లి ప్రేమకు ప్రబల తార్కాణం. కేంద్ర మంత్రివర్గంలో ఒక క్యాబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి ఉండికూడా మన రాష్ట్రానికి ఎంతో మేలు చేకూర్చగల ఈ ప్రాజెక్టు విషయంలో మందునుంచి పోరాడి వుంటే ఫలితం సానుకూలంగా ఉండేదేమో. మోడీతో విభేదించిన దరిమిలా ఎంత విమర్శించినా ఫలితం ఎలా ఉంటుంది?

బి.జె.పి. పక్షపాత ధోరణి:

అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు అందజేయాలని కేంద్ర ప్రభుత్వ లిఖిత పూర్వక హామీ విభజన చట్టం ద్వారా వున్నా, కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే అందజేసింది. నరేంద్రమోడీ కలల నగరం ‘‘ధోలేరా స్మార్ట్ సిటి’’ అభివృద్ధికి నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రష్ట్ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ ఫండ్ నుండి రూ. 1,000 కోట్లు, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ ఫండ్ నుంచి రూ. 17,500 కోట్లు శాంక్షన్ చేయటమే కాక రూ. 5,126 కోట్లు విడుదల చేయడం, వినియోగించటం కూడా జరిగింది. నరేంద్రమోడి దేశానికి ప్రధానమంత్రి అయినా ఆయన దృష్టంతా గుజరాత్ అభవృద్ధి పైనే ఉంటుంది?

b b1

అత్తెసరు కేటాయింపులు:

రాష్ట్రంలో కేంద్రం ప్రారంభించిన 9 జాతీయ విద్యాసంస్థలకు రూ.12,746 కోట్లు అవసరముండగా మార్చి 2019 నాటికి కేవలం రూ. 849 కోట్లను మాత్రమే విడుదల చేసింది. రాష్ట్ర రెవిన్యూ లోటు రూ. 16,009 కోట్లు అంచనా వుండగా కేవలం రూ. 4,118 కోట్లను మాత్రమే కేంద్రం ఇచ్చింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపైన డిసెంబరు 2018 నాటికి రూ. 10,069 కోట్లు ఖర్చు చేయగా రూ. 6,727 కోట్లు మాత్రమే విడుదల చేసింది.

సాగరమాల పథకంలో ఆంధ్రప్రదేశ్‌‌కు న్యాయం జరగలేదు:

2003లో ఎన్.డి.ఎ. ప్రభుత్వం వున్న సమయంలో సాగరమాల పథకాన్ని చేపట్టాలని నాటి ప్రధాని వాజ్‌పాయ్ సంకల్పించారు. భారతదేశంలో రహదారుల వ్యవస్థ మెరుగుపడి, రవాణారంగం వృద్ధిపడి దేశ ఆర్థికాభివృద్ధికి ఆనాడు వాజ్‌పాయి ప్రభుత్వం ప్రారంభించిన ‘‘సువర్ణ చతుర్భుజం’’ పథకం ఎంతో దోహదపడింది. మనదేశం లోనికి దిగుమతులు కానీ, మనదేశం నుంచి ఎగుమతులు గానీ 90 శాతం పోర్టు ద్వారానే జరుగుతూ ఉన్న నేపథ్యంలో పోర్టుల అభివృద్ధికి, పోర్టుల అనుసంధాన రహదారుల అభిృద్ధి, పోర్టులకు సమీపంలో పారిశ్రామిక సెజ్‌లు, పోర్టు సమీప తీర ప్రాంతాలలో అభివృద్ధి లక్ష్యంగా మార్చి 2015లో మోడి ప్రభుత్వం సాగరమాల పథకానికి ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ.8.5 లక్షల కోట్ల వ్యయంతో అమలుచేయబడే ఈ పథకం వలన మనదేశం నుంచి భవిష్యత్తులో దాదాపు రూ.7.75 లక్షల కోట్ల మేరకు అదనంగా మన ఎగుమతులు పెరుగుతాయని, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కోటి మందికి అవకాశాలు కల్పించబడతాయని అంచనా వేయబడింది.
2017 నుంచి 2035 వరకు ఈ పథకం అమలు చేయబడుతుంది. ఇందుకొరకు ఆగస్టు 2016లో సాగరమాల డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటైంది. పోర్టులకు రైలు మార్గాల అనుసంధానం కొరకు వాటి అభివృద్ధి కొరకు ‘‘ఇండియన్ పోర్టు రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’’ కూడా ఏర్పాటు చేయబడింది. మొత్తం 577 ప్రాజెక్టులను చేపట్టారు. పోర్టుల అభివృద్ధి, ఆధునీకరణ క్రింద 245 ప్రాజెక్టులకు రూ.1,41,641 కోట్లు, పోర్టులకు రైలు మరియు రహదారుల అభివృద్ధి కొరకు 2010 ప్రాజెక్టుల క్రింద రూ. 2,44,464 కోట్లు, పోర్టు ఆధారిత పరిశ్రమల అభిృద్ధి కొరకు రూ. 6,00,976 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించబడింది. 31 మార్చి, 2018 నాటికి రూ. 4,25,563 కోట్లు వ్యయం కాగల 496 ప్రాజెక్టులు వివిధ దశలలో అమలవుతున్నాయి.

Share: